భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి జరుగుతున్న లెక్కలేనన్ని చొరబాట్లు దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాభాను ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ వలసదారులు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ లెక్కల్లో స్పష్టత లేదు. 2016లో కేంద్ర హోంశాఖ పార్లమెంట్కు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో 2 కోట్ల వరకు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉండవచ్చని అంచనా.
పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, బీహార్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అసోంలో 1985లో జరిగిన అసోం ఒప్పందం నుంచే విదేశీయుల సమస్య ప్రధాన చర్చగా మారింది. అనంతరం జాతీయ పౌర రిజిస్టర్ ప్రక్రియలో 19 లక్షల మంది జాబితా వెలుపల ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో రోహింగ్యాల అక్రమ వలస అంశం కూడా భద్రతా సంస్థలకు సవాలుగా మారింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారతదేశంలో 40 వేల వరకు రోహింగ్యాలు నివసిస్తున్నారని భావిస్తున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్, జమ్మూ, ఢిల్లీ, మేవాత్ ప్రాంతాల్లో స్థిరపడినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.
అక్రమ వలసల ప్రభావం కేవలం జనాభా పెరుగుదలకే పరిమితం కాదు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు పొందడం ద్వారా కొందరు రాజకీయ, సామాజిక వ్యవస్థలోకి చొరబడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాల్లో విదేశీయుల పేర్లు ఉండటం వివాదాలకు దారితీస్తోంది. దీనివల్ల స్థానిక ప్రజల్లో ఉపాధి, వనరుల పంపకం, భూముల ఆక్రమణలపై అసంతృప్తి పెరుగుతోంది.
ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నవోలేకర్ ఆధ్యర్యం వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గాశంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి తదితరులు సభ్యులుగా ఉండటం ఈ కమిటీకి విశేష ప్రాముఖ్యతను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా మత, సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న అసాధారణ జనాభా మార్పులను ఈ కమిటీ విశ్లేషించి, కాలపరిమితితో కూడిన విధాన సూచనలు చేయనుంది.
ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్రమ వలసలపై కఠిన వైఖరి పెరుగుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ చర్చకు దారితీసింది. అదే విధంగా బ్రిటన్ కూడా వలస విధానాన్ని సంస్కరించింది. యూరప్లో కూడా అక్రమ వలసల నియంత్రణ కోసం అనేక దేశాలు సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తున్నాయి. భారతదేశం కూడా తన భౌగోళిక, భద్రతా అవసరాల దృష్ట్యా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినవారు ఆధార్, ఓటరు కార్డులు పొంది స్థానిక వ్యవస్థల్లో కలిసిపోయారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల రాష్ట్రంలో విదేశీయుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. “గుర్తించండి – తొలగించండి – బహిష్కరించండి” అనే నినాదంతో చర్యలు ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్బంధ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగం అందుకుంది.
అయితే, ఈ అంశాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చట్టబద్ధమైన శరణార్థులు, మానవ హక్కుల పరిరక్షణ అవసరాలను కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. మత, జాతి ఆధారిత విద్వేషం పెరగకుండా జాగ్రత్త పడటం ప్రభుత్వాల బాధ్యత. అక్రమ వలసలను అరికట్టడం ఎంత ముఖ్యమో, చట్టబద్ధ ప్రక్రియలో మానవీయ దృక్పథాన్ని పాటించడం కూడా అంతే అవసరం.
సరిహద్దు భద్రత బలోపేతం, ఆధార్-ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన, నకిలీ పత్రాల మాఫియాపై కఠిన చర్యలు, రాష్ట్రాలు-కేంద్రం మధ్య సమన్వయం వంటి చర్యల ద్వారానే ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది. అక్రమ వలసలు దేశ సార్వభౌమత్వానికి, సామాజిక, రాజకీయ, ఆర్థిక భద్రతకు ముప్పుగా మారకుండా ఇప్పుడే సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

