ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రాజకీయాలు, అధిక భద్రతా కాన్వాయ్లు ఇవన్నిటిని నియంత్రించినప్పుడే కాదు, వాటిని ఒక్క రోజు షోలా కాకుండా కొనసాగించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతీకాత్మక నిర్ణయాలకంటే ధైర్యవంతమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలే అవసరం. కాన్వాయ్ల కార్లు తగ్గించడం మాత్రమే కాదు, రాజకీయ దుబారాలను తగ్గించడమే నిజమైన పొదుపు.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ ఆర్థిక పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం, పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, స్టాక్ మార్కెట్ల పతనం ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి అనుగుణంగా మోదీ తన కాన్వాయ్ ని కుదించుకోగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాన్వాయ్లలో కార్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేవలం కాన్వాయ్ల కార్లు తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందా?
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఉపరితల స్థాయిలో లేవు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్ల దిశగా కదులుతున్నాయి. భారతదేశం అవసరమైన చమురులో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరల్లో ప్రతి 10 డాలర్ల పెరుగుదల దేశ దిగుమతులపై వేల కోట్ల అదనపు భారాన్ని మోపుతోంది. దీని ప్రత్యక్ష ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుంది. పెట్రో ధరలు పెరిగితే రవాణా వ్యయం పెరిగి, దాని ప్రభావం ఆహార పదార్థాల నుండి నిర్మాణ సామగ్రి వరకు అన్ని రంగాలపై పడటం ఖాయం.
ఇప్పటికే ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడుము విరుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 4% దాటడంతో పప్పుధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రజల ఆదాయాలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల నిధుల కోతల కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో పెట్రో ధరల పెంపు ప్రజలపై మరింత భారాన్ని మోపుతుంది.
ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు పొదుపు బోధనలు చేయడం కన్నా ముందుగా తమ దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. కాన్వాయ్లలో రెండు కార్లు తగ్గించడం ప్రజలకు సందేశాత్మక చర్యే కావచ్చు. కానీ, అది నిజమైన ఆర్థిక సంస్కరణ కాదు. దేశ రాజకీయ వ్యవస్థలో కొనసాగుతున్న అనవసర ఖర్చులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులకు లక్షల్లో జీతాలు, భారీ భత్యాలు, జీవితాంతం పెన్షన్లు, ఉచిత బంగళాలు, ఉచిత విద్యుత్, ఫోన్, భద్రతా సిబ్బంది వంటి సౌకర్యాలపై ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రజలకు పొదుపు చెప్పే ముందు ఈ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి.
దేశవ్యాప్తంగా శాసన మండళ్ల నిర్వహణ, వివిధ స్థాయిల్లో రాజకీయ పదవుల విస్తరణ, అవసరానికి మించిన ప్రభుత్వ కమిటీలు కూడా ఖర్చును పెంచుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో శాసన మండళ్ల అవసరంపై ఏళ్ళుగా చర్చ జరుగుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కొనసాగిస్తున్నారు. ప్రజల డబ్బుతో నడిచే ఈ వ్యవస్థల్లో పారదర్శకత, వ్యయ నియంత్రణ అత్యవసరం.
ఇక సామాన్య ప్రజల అవసరాలపై మాత్రం భారాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు ఇస్తోంది. విమాన ఇంధన ధరలు పెరగడంతో విమాన టిక్కెట్లు భారీగా పెరిగాయి. విదేశాల్లో ఉన్న పిల్లలను చూసేందుకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకే ఇప్పుడు విమాన ప్రయాణం భారంగా మారింది. ప్రజల జీవన వ్యయాలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ప్రతీకాత్మక చర్యలతో సరిపెట్టుకోవడం సరైంది కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యాలు పెంచాలి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయాలి. ధరల నియంత్రణ కోసం మార్కెట్ జోక్యం పెంచాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ చురుకుదనం పొందుతుంది. ప్రజలపై పన్నులు, ధరల భారాలు మోపడం ద్వారా కాదు.
ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రాజకీయాలు, అధిక భద్రతా కాన్వాయ్లు ఇవన్నిటిని నియంత్రించినప్పుడే కాదు, వాటిని ఒక్క రోజు షోలా కాకుండా కొనసాగించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.
దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతీకాత్మక నిర్ణయాలకంటే ధైర్యవంతమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలే అవసరం. కాన్వాయ్ల కార్లు తగ్గించడం మాత్రమే కాదు, రాజకీయ దుబారాలను తగ్గించడమే నిజమైన పొదుపు.

