సీఎం రేవంత్ పై కినుక|CM|REVANTHREDDY
కడియంపై సీఎం కు లేఖ|KADIYAM SRIHARI
అధిష్ఠానానికి ఫిర్యాదు?|AICC
గతంలోనూ అవమానాలే
క్రమశిక్షణా సంఘంతో విచారణకు డిమాండ్|DISIPLINERY COMMITTEE
హైదరాబాద్, జూలై 7 (అడుగు న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ అధికారులతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమవడంతో పాత సమస్యలు కూడా తెరమీదకు వచ్చాయి. గతంలోనూ తనకు అవమానాలే జరిగాయంటూ, తాజా సమస్యపై విచారణ జరపాలని సీఎం కు లేఖ రాసిన సురేఖ, అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు లేఖ రాయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కొండా కుటుంబానికి అధికారంతోపాటు వివాదాలు కొత్త కాదు. అయితే, అవి ఎప్పటికీ సమసిపోకుండా పోతున్నాయి. కొత్తగా తలెత్తుతుండటమే విచిత్రం. విధి వైపరీత్యం. స్వయం క్రుతాపారాధం. గతంలో అవినీతి ఆరోపణల కారణంగా మంత్రి కొండా సురేఖకు అత్యంత నమ్మకస్తుడైన ఓఎస్డీ సుమంత్ ను సీఎంఓ తొలగించింది. సురేఖకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ఏకపక్ష నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.
నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి నియామక వ్యవహారం మంత్రిని తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే యాదాద్రి టెంపుల్ బోర్డు చైర్మన్తో సభ్యుల నియామకం విషయం కూడా మంత్రికి తెలియదట. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పేర్లు ఖరారై జీవో విడుదలైందట. తన సిఫార్సులకు కనీస విలువ ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న కొండా సురేఖ, నిరసనగా ఇటీవల డిజిటల్ గా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికే హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. “కొండా సురేఖకు తెలియకుండానే కొణిదెల సురేఖ నియామకం” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు రావడం ఆమెను మరింత మనోవేదనకు గురిచేసినట్లు తెలిసింది.
యాదాద్రి వివాదం చల్లారకముందే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలి కొండా సురేఖకు మరింత ఆగ్రహం తెప్పించింది. దేవాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కడియం శ్రీహరి హైదరాబాద్లో దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, భూముల పరిరక్షణపై ఆయన అధికారులకు గడువులు నిర్దేశించడంపై మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగానే ఫిర్యాదు చేశారు.
కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ స్ఫూర్తిని ఉల్లంఘించారని మంత్రి మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఇంత అనుభవం ఉన్న నాయకుడు, శాఖా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి సమీక్షలు నిర్వహించడం అనుచిత సంప్రదాయమని, ఇది అధికార యంత్రాంగంలో అయోమయానికి దారితీస్తుందని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శాఖాపరమైన ఇబ్బందులతో పాటు, తన సొంత ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కొండా సురేఖకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని తన కుమార్తె కొండా సుస్మితా పటేల్కు ఇప్పించుకోవాలని ఆమె ప్రయత్నించినప్పటికీ, స్థానిక సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల ఆధిపత్యానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గతంగా గ్రూపులు కట్టడం ఆమెను ఒంటరిని చేసింది. దీనికి విరుద్ధంగా అమె వ్యవహారశైలి, వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. అధిష్ఠానం జోక్యం చేసుకునేదాకా వెళ్లింది. ఏదో విధంగా సద్దుమణిగింది.
ఈ మొత్తం పరిణామాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న కొండా సురేఖకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో వ్యతిరేకతలు రావడం, నిర్లక్ష్యానికి గురవుతుండటాన్ని తన పట్ల వివక్షగా మంత్రి సురేఖ భావిస్తున్నారు.
అందుకే ఆమె ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని తేల్చుకోవాలనుకుంటున్నారు. ఒకవైపు సీఎంకు లేఖ రాస్తూనే, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అధిష్టానానికి రాయనున్న లేఖ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

