పరనింద కాదు ఆత్మ విమర్శ జరగాలి!
రాజకీయాల్లో విమర్శలే కాదు, ఆత్మవిమర్శలూ అవసరం. ఎదుటి పార్టీని ఎండగడుతూ రాజకీయ పబ్బం గడపుకోవడం ద్వారా స్వల్పకాల ప్రయోజనాల సంగతేమో కానీ, దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరవు. ఉద్యమం పేరుతో రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలు మాత్రమే చేసిన సెమీ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్, రజతోత్సవ వేదిక నుంచి విమర్శలను పక్కన పెట్టి, తన స్వయం కృతాపరాధాన్ని అంగీకరించాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పాతికేళ్ళల్లో జరిగిన తప్పులు, దొర్లిన పొరపాట్లు, చేసిన పాపాలకు, వస్తున్న విమర్శలకు ప్రాయశ్చిత్తం జరిగేలా జవాబు ఉండాలి!
బీఆర్ఎస్ ఆవిర్భావం, ప్రస్థానం, మనుగడలను సమీక్షించుకుని ముందుకు సాగాలి. ప్రజలు ఇచ్చిన అధికారం ఎలా దుర్వినియోగం అయిందో గుర్తించాలి. పార్టీ ఉత్థాన పతనాలు గుణపాఠాలు కావాలి. కేసీఆర్ తన స్వార్థ రాజకీయాలకు తెలంగాణను వాడుకున్నారనే విమర్శకు సమాధానం చెప్పాలి.
ఉద్యమ గమ్యాన్ని ముద్దాడేలా పోరాడిన ప్రజలను, ఉద్యమకారులను విస్మరించి పాలన సాగించడం వల్లనే ప్రజలు బిఆర్ఎస్ను దూరం పెట్టారు. దీనిపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రజతోత్సవ సభలో తప్పులపై చర్చ చేయాలి. నిజాయితీగా ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్ పై ప్రజలకు భరోసా ఇవ్వాలి.
ఆత్మ స్థుతి పర నింద సర్వసాధారణం. కానీ, రాజకీయాల్లో ఇదే రాజ్యమేలుతుంది. స్లోగన్ సెట్ అయిందా, బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. అందుకే రాజకీయాల్లో విమర్శలే కాదు, ఆత్మవిమర్శలూ ఎంతో అవసరం. ఎంతసేపు ఎదుటి పార్టీని ఎండగడుతూ రాజకీయ పబ్బం గడపుకోవడం ద్వారా స్వల్పకాల ప్రయోజనాల సంగతేమో కానీ, దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరవు. మరీ ముఖ్యంగా ఆదివారం రజతోత్సవ సభ జరుపుకుంటున్న బీఆర్ఎస్ వరంగల్ వేదిక నుంచి విమర్శలను పక్కన పెట్టి, తన స్వయంకతాపరాధాన్ని అంగీకరించాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉద్యమం పేరుతో రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలు మాత్రమే చేసిన పార్టీ 25 ఏండ్ల ప్రస్థానం సామాన్యమేమీ కాదు. పార్టీ పురుడుపోసుకున్న రెండు మూడు నెలల్లోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అది. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధన, తొమ్మిదిన్నరేళ్ల అధికారం. ఈ పాతికేళ్ళల్లో జరిగిన తప్పులు, దొర్లిన పొరపాట్లు, చేసిన పాపాలకు, వస్తున్న విమర్శలకు ప్రాయశ్చిత్తం జరిగేలా జవాబు ఉండాలి!
తెలంగాణాలో బిఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్ల అవకాశమేలేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవమానాలనైనా భరించారు కానీ, తమ ఆత్మగౌరవం దెబ్బతిని, కాళ్ళకింద భూమి కదిలిపోతుంటే తట్టుకోలేని ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేకే ‘కారు’కు బ్రేకులేసి, ‘చేయి’కి చేయందించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి గుణపాఠాలను విస్మరించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎన్నుకుని ప్రజలే తప్పు చేశారని బీరాలు పలికింది. దీంతో ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ‘సున్నా’తో ‘కారు’ టక్కరిచ్చారు. అయినా సరే, ఆ పార్టీకి అధికారం పోయి అహం పెరిగింది. అయితే, కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ తప్పిదాలను ఎలుగెత్తాయి. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం వల్ల లక్ష కోట్లు నీటిపాలయ్యాయి. ధరణితో రైతులను, ప్రజలను ఆగం చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ, సామాన్యుల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వేలాది ఎకరాలు అప్పనంగా తనవాళ్లకు కట్టబెట్టారు. ఎన్నో భూములను తెగనమ్మారు. మియాపూర్ భూములపై చర్యలే లేవు. నయీం డైరీది నయా మోసం. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల పేరుతో పేదల భూములను, ఇళ్లను గుంజుకుని రోడ్డున పడేశారు. వారి ఉసురు తీసుకున్నారు. లిక్కర్ బిజినెస్లో కవిత తల దూర్చి తెలంగాణ పరువు తీశారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తమ దొడ్లో కలుపుకున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్లకు అప్పుల పాలు చేశారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని దీనావస్థ ఎందుకు వచ్చింది. బంగారు తెలంగాణ పరువును బజారుకీడ్చారు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్న పచ్చి నిజాలు. ఫోన్ ట్యాపింగ్ లాంటి దగుల్బాజీ పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి.’’ అంటూ ఆరోపణలు చేస్తున్న అధికార కాంగ్రెస్, బీజేపీలకే కాదు, వీటిని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలుగా భావించి జవాబులివ్వాలి.
బీఆర్ఎస్ అధ్యక్ష్యా! అసెంబ్లీకి సైతం రాకుండా చట్ట సభలను, ఫాంహౌస్ కే పరిమితమై మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలను కూడా ఎందుకు అవమానిస్తున్నారో చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలిచ్చిన అమరవీరుల కుటుంబాలకు ఏం చేశారో చెప్పాలి. నీళ్ళు, నిధులు, నియమకాలేమయ్యాయో తెలపాలి. యూనివర్సిటీల్లో కనీసం ఒక్క కొలువునైనా ఎందుకు భర్తీ చేయలేకపోయారో చెప్పాలి.
గులాబీ బాస్! ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ ను ప్రజలు విశేషంగా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. 14ఏళ్ళ సుదీర్ఘ పోరాట ప్రయాణంలో అనేక ఆటుపోట్లు. ఒడిదుడుకులు. ఎత్తుపల్లాలు చూశారు. ప్రజలు, ప్రజాసంఘాలు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు, సబ్బండ వర్గాలు అంతా కలసి నడిపిస్తేనే టీఆర్ఎస్ నిలిచింది. నడిచింది. గెలిచింది. తొలిదశ గుణపాఠాలతో మలిదశ ఉద్యమానికి అనేకమంది పునాదులు వేశారు. మీ పార్టీ ఏర్పాటుకు వేదికనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీనే విస్మరించారు. తెలంగాణ జనసభ మారోజు వీరన్న, గాదె ఇన్నయ్య, కేశవరావు జాదవ్, పాశం యాదగిరి, కొల్లూరి చిరంజీవి, ప్రొ.జయశంకర్, ప్రొ.బియ్యాల జనార్ధన్ రావు, బెల్లి లలిత వంటి వాళ్ళెందరో తెలంగాణ ఆకాంక్షను సజీవంగా కాపాడారు. ఇవన్నీ విస్మరించి గత పదేళ్ల అధికారంలో ఉన్న కాలంలో మీరు, మీ వందిమాగథులు ఉద్యమకారులను విస్మరించారు. కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జయశంకర్ సార్ లాంటి వారు కేసీఆర్ను నమ్మి నడిపించారు. నిజం కాదంటారా?
తెలంగాణ వస్తే ఏమొస్తదన్న ఎటకారాలను సహిస్తూ, తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు భావిస్తే, కేసీఆర్ మాత్రం పక్కా రాజకీయ నేతగా ఆలోచించారు. ప్రజల్ని, ఉద్యమకారుల్ని పక్కన పెట్టి.. తను, తన కుటుంబమే తెలంగాణ అని భావించారు. దళితుణ్ణే ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన మాట తప్పారు. తెలంగాణ పేగుబందాన్ని తెగ తెంపుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ రాచరికపు పోకడలకు బీజం వేశారు. సామాన్యుల సంగతి ప్రగతి భవన్ ఎరుగు. మంత్రులను కూడా కలవలేనంత బిజీగా అయ్యారు. అపాయింట్ మెంట్ లేని మంత్రులను వెనక్కి పంపి అవమానించారు. సిఎంను కలవాల్సిన పనేముందని యువరాజు ఆక్షేపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ తమ జాగీరుగా నిరంకుశ పోకడలకు పోయి ఇవాళ నీతుల చెబితే వినడానికి ప్రజలు సిద్దంగా లేరని గుర్తించాలి.
అందుకే ఈ వేళ… తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, ప్రస్థానం, మనుగడలను సమీక్షించుకుని ముందుకు సాగాలి. ప్రజలు ఇచ్చిన అధికారం ఎలా దుర్వినియోగం అయిందో గుర్తించాలి. పార్టీ ఉత్థాన పతనాలు గుణపాఠాలు కావాలి. కేసీఆర్ తన స్వార్థ రాజకీయాలకు తెలంగాణను వాడుకున్నారనే విమర్శకు సమాధానం చెప్పాలి. ఉద్యమ గమ్యాన్ని ముద్దాడేలా పోరాడిన ప్రజలను, ఉద్యమకారులను విస్మరించి పాలన సాగించడం వల్లనే ప్రజలు బిఆర్ఎస్ను దూరం పెట్టారు. దీనిపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రజతోత్సవ సభలో తప్పులపై చర్చ చేయాలి. నిజాయితీగా ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్ పై ప్రజలకు భరోసా ఇవ్వాలి.

