పార్టీ పండుగపై తెలంగాణ ప్రజల ప్రశ్న!?
సభకు తరలేందుకు గులాలీ శ్రేణుల నిరాసక్తత!?
సభ సక్సెస్ ఐనా.. ఆశించిన మైలేజీ వచ్చేనా!?
బాహు‘బలి’ కాకుండా చూసుకోవడం ఎలా?
‘వంద’ కోట్లు ‘బొంద’లో పోసినట్లు కావు కదా?
కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో అంతర్మథనం!
‘గులాబీ’ శ్రేణుల గుండెల్లో గూడు కట్టుకున్న గుబులు!?
పహల్గాం నరమేథం నేపథ్యంలో సభ సక్సెస్ అయ్యేనా?
సక్సెస్ సరే, సభా వేదిక నుంచి ప్రజలకిచ్చే సందేశం ఏంటి?
ప్రజల మనసుల్లో బలంగా నాటుకున్న మారణహోమం!
నివాళులర్పిస్తూ దేశమంతా అలుముకున్న విషాదం!
వార్యమా? అనివార్యమా? కమ్ముకున్న యుద్ధ మేఘం!
ఉగ్రదాడితో ఒక్కసారిగా మారిన ప్రజాభిప్రాయం!
గత 2,3 రోజులుగా వేగంగా మారుతున్న వాతావరణం!
‘ఉగ్ర’దాడికితోడు గత కొద్ది రోజులుగా ‘ఉష్ణ’దాడి!
భారీ బహిరంగ సభలకు కేరాఫ్ అడ్రస్ భారత రాష్ట్ర సమితి. భారీ సభలు, ఎన్నికలు, రాజీనామాలు ఇదే బీఆర్ఎస్ అవలంబించిన ఫార్ములా. 25 ఏళ్ళుగా ఈ ఫార్ములా వర్కౌట్ అవుతూనే ఉంది. ఉద్యమ ప్రస్థానంలో 14 ఏండ్లు, ప్రభుత్వ ప్రస్థానంలో తొమ్మిదిన్నర ఏండ్లు ఆ పార్టీని నడిపించిందిదే. ఉద్యమ కాలంలో పోరుగర్జన, సింహ గర్జన వంటి భారీ బహిరంగ సభలను న భూతో, న భవిష్యత్ అన్నంతగా నిర్వహించిన బీఆర్ఎస్, అధికారంలోకి వచ్చాక కూడా కొంగర కలాన్ లో రైతు మహాసభలను సక్సెస్ చేసుకుంది. పార్టీ స్థాపించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సభను ఏకంగా రూ.వంద కోట్ల ఖర్చుతో, 10 లక్షల మందితో నిర్వహించాలని తలపెట్టింది. నెల రోజులుగా ఈ సభ సక్సెస్, ప్రజలకిచ్చే సందేశంపై తీవ్ర కసరత్తు చేసింది. సభకు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న ఈ టైమ్ లో దేశంలోనే అతి పెద్దది కానున్న ఈ బహిరంగ సభను దేశంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి భయపెడుతోంది. పహల్గాం నరమేథం కేసీఆర్ కుటుంబాన్ని పరిపరి విధాలుగా వేధిస్తున్నది. ఈ మారణహోమమే ఇప్పుడు, బీఆర్ఎస్ నేతలు, కేడర్ లో అంతర్మథనానికి దారితీసింది. ఒక్కసారిగా మారిన ప్రజాభిప్రాయం, అలుముకున్న విషాదం, కమ్ముకున్న యుద్ధ మేఘం, వేడెక్కిన వాతావరణంలో పార్టీ రజత ఉత్సవాన్ని నిర్వహించడమెలా? పహల్గాం కు ముందున్న ఉత్సవ ఉత్సాహం ఇప్పుడు పార్టీ కేడర్ లోనూ కానరావడం లేదు. పైగా ఉత్సవమంటేనే ఆటా, పాట అల్లరి, హంగామా? ఈ దశలో సభకు వెళ్ళడమా? ఏదో వెళ్ళి ఇలా రావడమా? అని ఆ పార్టీ కేడర్ ఆగమాగం అవుతున్నది. ఊరంతా ఒకదారి అయితే, ఉలిపికట్టెది మరోదారి అన్నట్లు… దేశమంతా ఇంతగా విషాదం అలుముకున్న వేళ… సభ ఎలా? మరి ఇంత ముందుకెళ్ళిన ఈ సభ నిర్వహణపై అధినాయకత్వం కింకర్తవ్యం ఏంటి? కాకపోతే ఆలోచించుకుని, నిర్ణయించుకునే సమయమింకా ఆ పార్టీకి మిగిలే ఉంది.
పోరాటాల పురిటిగడ్డ. ఉద్యమాల ఖిల్లా. కలిసొచ్చిన వరంగల్ సెంటిమెంట్. అచ్చొచ్చిన సభలు. అలవిగాని జనం మద్దతు. అధికారాన్నిచ్చిన ఒటర్లు. ఒక ఉద్యమ పార్టీకి భారీ బహిరంగసభ నిర్వహించడానికి ఇంతకంటే ఏం కావాలి? అందుకే బీఆర్ఎస్ తన 25వ వార్షికోత్సవ సిల్వర్ జూబ్లీ బహిరంగసభని ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చే ఎల్కతుర్తిలో నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
వైభవోపేతంగా…
25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా బిఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. బాహుబలి వేదిక. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు. ఇలా ఎన్నో విశిష్టతలు ఉండబోతున్నాయని బిఆర్ఎస్ సంకేతాలు ఇచ్చింది. వరంగల్ వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది.
భారీగా ఏర్పాట్లు!
మొత్తం 1213 ఎకరాల్లో బహిరంగ సభ. అందులోని 159 ఎకరాల్లో సభా ప్రాంగణం. 5 ఎకరాలలో సభా ప్రాంగణం. 500మంది కూర్చునేలా బాహుబలి వేదిక. సభా వేదికకు వెనుకాలే 4 ఎకరాలలో వీఐపీ పార్కింగ్. 150 ఎకరాల్లో పబ్లిక్, వీఐపీ, ప్రెస్ సహా ఉద్యమకారులకు ప్రత్యేక గ్యాలరీలు. మిగిలిన స్థలం భోజనాలు, పార్కింగ్ కోసం. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అటువైపే పార్క్ చేసేలా.. ఐదు ప్రాంతాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 10లక్షల చల్ల ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నది.
వంద కోట్ల నిధుల ఖర్చు?
దేశంలోనే అత్యంతగా పార్టీ ఫండ్ ఉన్న బీఆర్ఎస్, ఇప్పటికే అధికారికంగా ప్రతి నియోజకవర్గానికి రూ.25 లక్షల చొప్పున దాదాపుగా రూ. 30 కోట్లు పార్టీ తరఫున చెక్కులు విడుదల. సభ కోసం రైతుల దగ్గర లీజుకు తీసుకున్న 1200 ఎకరాల్లో చదును చేయడం, బారికేడ్లు, రోడ్లు వేయడం, స్టీజీ, గెస్ట్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వంటి సభాస్థలం కోసం మరొక రూ.20 నుంచి రూ.25 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్, గులాబీ జెండాలు ఫ్లెక్సీలు, హోర్డింగులు, పేపర్లు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ల కోసం మరొక రూ.20 – రూ.25 కోట్లు. ఇక జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీకి రూ. 9 కోట్లు చెల్లించింది. ప్రైవేటు వాహనాలు. మధ్యలో వారికి భోజనాలు, సభా స్థలం వద్ద పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, కూలర్లు ఇలా వీటన్నింటికీ మరో రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నారని సమాచారం. ఇలా గులాబీ బాహుబలి బహిరంగ సభ కోసం దాదాపు రూ. 100 కోట్ల దాకా ఖర్చు పెట్టనున్నట్లుగా గత కొద్ది రోజులుగా విశేషంగా ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కన జన సమీకరణ పరంగా చూసినా, ఖర్చుపరంగా చూసినా ఇదే భారీ బహిరంగ సభ.
పహల్గాం ఘటనతో అంతర్మథనం!
పహల్గాం ఉగ్రదాడి దేశం మూడ్ నే మార్చేసింది. 26మంది నరమేథం ప్రజల మనోఫలకంపై బలంగా నాటుకున్న మారణహోమంగా మిగిలింది. యావత్ దేశమంతా నివాళులర్పిస్తూ విషాదం అలుముకుంది. కంపుకొట్టే పాక్ కవ్వింపు చర్యలు, రంకు బొంకు వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని ఏర్పరిచాయి. ఉగ్రదాడితో ఒక్కసారిగా జనాలోచనలు పహల్గాం ఘటనకు ప్రతీకారం, దేశ భక్తి, ఐక్యత, పాక్ ను ఎదుర్కోవడం, నిలువరించడం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపైకి మళ్ళింది. ఈ ఉగ్రదాడికితోడు గత కొద్ది రోజులుగా ప్రజలపై తీవ్ర ఉష్ణదాడి జరుగుతోంది.
రజత’ఉత్సవ’మెలా..!?
ఈ దశలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహిస్తే ఏంటి? నిర్వహించకపోతే ఏంటి? దేశభక్తిని చాటాల్సిన ఈ దేశ పెను విషాదం మధ్య ఇంత అట్టహాసంగా సభ నిర్వహిస్తే ప్రజలకు ఏ సంకేతాలు వెళతాయి? పహల్గాం నరమేథం నేపథ్యంలో సభ సక్సెస్ అయ్యేనా? సక్సెస్ అయినా ఆశించిన మైలేజీ వచ్చేనా? వంద కోట్లు బొందలో పోసినట్లు కాదు కదా? బాహుబలి సభ ‘బలి’ కాకుండా చూసుకోవడం ఎలా? సభ సరే, సభా వేదిక నుంచి ప్రజలకిచ్చే సందేశం ఏంటి? పైగా పార్టీ శ్రేణులు సైతం నిర్లిప్తమైన ఈ తరుణంలో అన్నింటికి అతీతంగా ఐక్యంగా దేశభక్తిని చాటుకునే సమయంలో రజతోత్సవమైనా, రాజకీయమైనా వికటిస్తుందా? వంటి అనేకానేక ప్రశ్నలు అటు కేసీఆర్ కుటుంబాన్ని, ఇటు పార్టీ శ్రేణులను గుబులు రేపుతున్నాయి. మరి కేసీఆర్ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటుందో? ఏ విధంగా నిర్వహిస్తుందో చూడాలి.

