GRANITE| గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించాడని ఆరోపణ
పలు SECTIONS| సెక్షన్ల కింద CASE| కేసులు నమోదు
SHAMSHABAD| శంషాబాద్ AIRPORT| ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వేసిన మరో పిటిషన్ను సైతం హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. దీంతో కౌశిక్ రెడ్డి గత రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కాసేపట్లో ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోర్డులో హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కోర్టులో హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బీఆర్ఎస్ లీగల్ టీమ్ వచ్చాక పరీక్షలకు తీసుకెళ్లాలని కౌశిక్ కోరారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకున్నాక వైద్య పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుచనున్నారు. కౌశిక్ను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాసేపటి తర్వాత వారికి లోనికి అనుమతించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్రావులు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అక్రమాలు, మంత్రుల అవినీతి, దుర్మార్గాలను కౌశిక్రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
పాలన గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అందర్నీ అక్రమ కేసులతో వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపించారు. నమ్మించి నయవంచన చేసిన మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తేల్చిచెప్పారు. అక్రమ అరెస్టు చేసిన కౌశిక్ రెడ్డి బేషరుతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, హరీశ్రావులు ఎన్ని వందల కేసులు పెట్టినా ప్రజల పక్షాల బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.

