తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు, యువత, మహిళలు, వ్యాపారులు అందరి ఆశలు, ఆకాంక్షలు ఈ బడ్జెట్పైనే నిలిచాయి.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, పెట్రో, డీజిల్, గ్యాస్ సమస్యలు, వాటి ప్రభావంతో పెరగనున్న అన్ని ధరలు, రాష్ట్ర అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, హైదరాబాద్ క్లీనింగ్ 99-డే ప్లాన్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగ, ఉపాధి కల్పన, మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి అనేకానేక హామీల అమలు, ఆర్థికాంశాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. రాష్ట్ర అభివృద్ధి దశ, దిశను మార్చడమేగాక, ప్రజల జీవితాలపై ప్రభుత్వం, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ప్రభావం చూపనుంది. అయితే ఈ బడ్జెట్ నిజంగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగలదా?
ప్రభుత్వానికి బడ్జెట్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన సవాల్ గా మారింది. అయితే, రాష్ట్ర మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అప్పులు ఇప్పటికే రూ.6 లక్షల కోట్లకు చేరువలో ఉన్నాయి. ఆదాయం పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు భారీగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సంక్షేమం-అభివృద్ధి మధ్య సమన్వయం ఎలా సాధిస్తుందో చూడాల్సి ఉంది.
తెలంగాణలో ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతు భరోసా కొనసాగింపు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, పంటలకు గిట్టుబాటు హామీలను రైతులు కోరకుంటున్నారు. రాష్ట్రంలో 65 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్లు అంచనా. మరి వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉందా? సాగునీటి ప్రాజెక్టులు, నీటి నిర్వహణ, రైతు రుణాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి ఉండవచ్చు.
రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఏటా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఖాళీలు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, స్టార్టప్లకు ప్రోత్సాహం వంటి అంశాలు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే పథకాలు ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ రాజకీయ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మహిళలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పెన్షన్లకు మరోసారి బడ్జెట్లో గణనీయమైన నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీటి కొనసాగింపు తప్పనిసరి కాబట్టి, సంక్షేమ వ్యయం తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతులైన కీలకం.రోడ్లు, పట్టణాభివృద్ధి, మెట్రో, రవాణా, పారిశ్రామిక పార్కులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచే అవకాశముంది. ఐటీ, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమై, బడ్జెట్ ప్రవేశపెట్టడం, శాఖల వారీగా చర్చ, ప్రతిపక్షాల విమర్శలు, సూచనలు, ప్రభుత్వ సమాధానాలు, బడ్జెట్ ఆమోదంతో ముగుస్తాయి. అయితే సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. మరోసారి ప్రతిపక్షం ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం తన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థించుకుంటుంది. కాకపోతే, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలు వస్తారా? లేక గతంలో లాగే టెక్నికల్ గా తన పదవికి ఇబ్బందీ కాకుండా హాజరైవెళ్ళిపోతారా? అన్నది చూడాలి.
అయితే, ఈ బడ్జెట్పై ప్రజల అంచనాలు భారీగా ఉన్నాయి. పెట్రో, డీజిల్, గ్యాస్ సహా ధరల నియంత్రణ, రైతులకు స్థిరమైన ఆదాయం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పెన్షన్లు, ఇండ్లు, రైతు భరోసా నిధులు, రేషన్ కార్డులు వంటి అనేకాంశాలపై స్పష్టమైన ప్రణాళికలు ప్రకటిస్తే మాత్రమే బడ్జెట్ ప్రజల విశ్వాసాన్ని పొందగలగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా నిలవనున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక నియంత్రణల మధ్య సమతౌల్యం, సమన్వయం సాధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా నిలువనుంది.
ఈ బడ్జెట్ నిజంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందా? రాష్ట్రంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతుందా? ఏమైనా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపనుంది.

