గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం యొక్క ముఖ్య అధికారిని విషయపతి అనేవారు. గ్రామ పాలనను నిర్వహించడానికి గ్రామణి అనే అధికారి ఉండేవాడు. నగర పాలనను వ్యాపారం చేసే వారితో కూడిన నిగమ సభలు (మున్సిపల్ కౌన్సిల్) నిర్వహించేది.

ముఖ్యమైన అధికారులు : ఈ కాలంలో ముక్యమైన అధికార గణాన్ని కింది విధంగా పిలిచేవారు.
కుమారమాత్య – ఉన్నత అధికారులు
మహాబలాధీకృత – సేనాపతి
మహాదండనాయక – ముఖ్య న్యాయమూర్తి
అఖపాలాధికృత – కోశాధికారి
హిరణిక – పన్నులు వసూలు చేసే అధికారి
సంధి విగ్రాహాక – విదేశాంగ శాఖ (వేరే రాజ్యాలతో సంధి కుదుర్చుకొనుటకు)
భటాశ్వపతి – అశ్వ దళాధిపతి
దండ పాషాధికారణ – పోలీస్ శాఖాధిపతి (నగర కొత్వాల్)
గుప్తుల కాలం నాటి మత పరిస్థితులు
గుప్తుల కాలంలో అనూహ్యమైన మత పరిస్థితులు చోటుచేసుకొని హిందూ మతం పూర్తి రూప సంతరించుకుంది. భక్తియే ప్రధాన అంశంగా భారతదేశంలోని ప్రాచీన కాలంలో ఉన్న మతాలన్నింటినీ సర్వ సమ్మేళనం చేసి ఒక కొత్త మతంగా అవతరించింది. దీనినే ప్రస్తుతం మనం హిందూ మతంగా అనుసరిస్తున్నాము. ఇందులో వైష్ణవం మరియు శైవం అనే రెండు ప్రధాన శాఖలు పుట్టుకొచ్చాయి. (హిందూ మతం మతం కాదు. ఇది ఒక జీవన విధానం. ఎందుకంటే సహజసిద్ధంగా మత ఆవిర్భావం జరిగింది. ఇందులో ద్రావిడులు, ఆర్యులు, యజ్ఞయాగాలు, భక్తి, విష్ణువు, శివుడు, కృష్ణుడు, ప్రకృతి దేవతలు, గిరిజన దేవతలు మొదలగ్గునవన్నీ మిళితమై ఉంటాయి. హిందూ మతానికి స్థాపకుడు, కాలం, సిద్ధాంతాలు, ఏకపవిత్రగ్రంథం, ఇక దైవం అనేవి లేవు మరియు ఉండవు.)
వైష్ణవము
విష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి దశావతారాలుగా అవతరించాడని గుప్తుల కాలంలోనే ప్రజల్లో విశ్వాసం బలపడింది.
దశావతారాలు – మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం.
శైవము
హిందూ మతంలో మరొక ప్రధాన శాఖ శైవము. ప్రాచీన కాలంలోనే శైవ శాఖలో అనేక ఉపశాఖలు ఆవిర్భవించాయి. అందులో పాశుపథము, కాపాలిక, అఘోరశైవము, మితవాద శైవము మొదలగునవి. (అఘోర శైవంలో నేటికీ కాశీ ప్రాంతంలో అఘోరాలు నివసిస్తున్నారు. వీరు అతివాద వర్గానికి చెందినవారు. మలమూత్రాలు, శవాలు మరియు కుళ్ళిన కళేబరాలను తింటారు.)
గుప్తుల కాలంనాటి కళలు
గుప్తుల కాలాన్ని పండితులు మరియు చరిత్రకారులు స్వర్ణయుగంగా అభివర్ణించారు. ఈ కాలంలోనే లలితకళలు మరియు సాహిత్యము అత్యున్నత ప్రగతి సాధించడం వల్ల దీనిని స్వర్ణయుగంగా పిలుస్తున్నారు. కానీ ప్రస్తుత చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. ఎందుకనగా సమాజంలో మరియు మానవ జీవన విధానంలో ప్రగతిని సాధిస్తే మాత్రమే స్వర్ణయుగంగా పిలవాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కాలంలో సాహిత్యం అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం వల్ల సాంస్కృతిక యుగమని చెప్పవచ్చు.
వాస్తుశిల్పకళ
వీరు బౌద్ధ శిల్పకళను మరియు హిందూ శిల్పకళను సమానంగా ఆదరించారు. గుప్తులు వైష్ణవులైనప్పటికీ ఇతర అన్ని మతాలను సమానంగా ఆదరించి తమ యొక్క లోకైక భావాలను ప్రజలకు మరియు సమాజానికి వ్యక్తపరిచారు. గుప్తుల కాలంలో సారనాథ్(కాశీ నగర సమీపం)లోని బుద్ధుడి విగ్రహం ప్రముఖమైనది. గౌతమ బుద్ధుడు ధర్మచక్రంపరివర్తన (గౌతమబుద్ధుడు తన తొలి బోధనను చెప్పడం. దీనికి అయిదుగురు శిష్యులు హాజరయ్యారు.) చూపించే శిల్పాలి సారనాధ్ శైలిలో ప్రముఖమైనది కాబట్టి సారనాథ్ ను బౌద్ధ మత జన్మస్థలంగా చెప్తారు. దీనితోపాటు ప్రస్తుత బీహార్ లోని సుల్తాన్ గంజ్ లో ఉన్న ఏడున్నర అడుగుల ఎత్తైన రాగి బుద్ధుని శిల్పం గుప్తుల కాలానికి చెందినదే. వీరు అనేక బౌద్ధ గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్ని విహారాలు (బౌద్ధ సన్యాసులు నివసించే గుహలు) మరియు చైత్యాలు (బౌద్ధుల ప్రార్థనా మందిరాలు) ఉన్నాయి.
గుప్తులు బౌద్ధ శిల్పకళతో పాటు హిందూ శిల్పకళను అభివృద్దిచేసారు. భారతదేశంలో నేటికీ నిలిచియున్న హిందూ దేవాలయాలు గుప్తులవే. ఇందులో శైవ మరియు వైష్ణవ దేవాలయాలున్నాయి. మధ్యప్రదేశ్ లో ఉన్న సుమారు 20 గుహాలయాల్లో అయిదవ దానిలో భూమిని కాపాడుతున్న వరాహ శిల్పం అత్యంత సుప్రసిద్ధమైనది. దీనితోపాటు ఉజ్జయినిలో (మధ్యప్రదేశ్) వీరు అనేక ఆలయాలను నిర్మించారు కాబట్టే గుప్తులకు ఉజ్జయిని సాంస్కృతిక మరియు సాహిత్య రాజధానిగా (రెండవ రాజధాని) కొనసాగింది.
అజంత శిల్పకళ
ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో బౌద్ధ మతానికి చెందిన శిల్పం మరియు చిత్రలేఖనం ఉన్నాయి. ఇది భారతదేశంలో UNESCO గుర్తించిన తొలి ప్రపంచ వారసత్వ కేంద్రం. ఇక్కడ సుమారు 30 బౌద్ధ గుహాలయాలు గుర్తించబడ్డాయి. ఇందులో కొన్ని విహారాలు, మరికొన్ని చైత్యాలు ఉన్నాయి. పాళీ భాషలో రాయబడిన బుద్ధుని జాతకాలు మరియు బోధిసత్వుల కథలను గోడల మీద చెక్కి అలంకరించారు. బుద్ధుని జీవితంలోని ప్రధాన ఘట్టాలైన వజ్రపాణి, పద్మపాణి చిత్రాలు సుప్రసిద్ధమైనవి.

