విపక్షాలు ఏకమైతే కేంద్రానికి సవాల్ విసరగలవని తేలిపోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం, ఎన్డిఎ మద్దతుపైనే ప్రభుత్వం కొనసాగుతుండటం వల్ల కీలకమైన రాజ్యాంగ సవరణలను చేపట్టాలంటే విస్తృత చర్చ, సమన్వయం, సంఘీభావం అవసరం. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధ ప్రక్రియ. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రతినిధ్యాన్ని పునర్వ్యవస్థీకరించడం దాని లక్ష్యం. కానీ అమలు విధానం, సమయం, ప్రాంతీయ సమానత వంటి అంశాలు సరైన చర్చల ద్వారా నిర్ణయించాలి. మరిది కేంద్రానికి రాజకీయ గుణపాఠంగా నిలవగలదా?*
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పరిపాలనలో విధానపరమైన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు విస్తృత స్థాయి చర్చ, సమన్వయం అనివార్యం. కానీ, 131వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదన, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే డీలిమిటేషన్ అంశాలను కలిపి తీసుకురావడంపై ఏర్పడిన వివాదం దేశ రాజకీయాల్లో కొత్త మలుపునకు దారితీసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధాన నిర్ణయం, ఒకవైపు విమర్శలకు గురవుతుండగా, మరోవైపు విపక్షాల ఐక్యం మాత్రమే కాదు బలోపేతం చేసింది.
2023లోనే ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును, 2029 నుంచి అమలు చేస్తామని ముందుగా సంకేతాలు ఇచ్చిన కేంద్రం, అనూహ్యంగా దానిని డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడం, ఎన్డిఎ మిత్రపక్షాలతో సైతం పూర్తి స్థాయి సంప్రదింపులు జరపకపోవడం అతిశయమే.
లోక్సభలో ప్రస్తుతం 542 స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత ఈ సంఖ్యను 600 వరకు పెంచితే సరిపోతుందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, 816 లేదా 850 స్థానాలకు పెంచాలన్న చర్చలు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమయ్యాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు ఇది ప్రతికూలంగా మారుతుందనే భావన బలపడింది. “ప్రాతినిధ్యం తగ్గిపోతుంది” అనే భయం రాజకీయంగా పెద్ద దుమారంగా మారింది.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకంగా మారింది. తమిళనాడుకు చెందిన 38 మంది, కేరళకు చెందిన 20 మంది, తెలంగాణకు చెందిన 9 మంది, కర్ణాటకకు చెందిన 9 మంది ఎన్డీయే యేతర ఎంపీలు డీలిమిటేషన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తం మీద ఈ బిల్లులు విపక్షాల ఐక్యతకు సమన్వయానికి దారి తీశాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడు ఎంపీలు పార్లమెంటులో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపడం, బయట కూడా బిల్లును తగులబెట్టే వరకు వెళ్లడం ఈ వ్యతిరేకత తీవ్రతను ఎత్తి చూపించింది.
విపక్షాలు ఈ బిల్లును కేవలం విధానపరమైన సమస్యగా కాకుండా, సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా చిత్రీకరించాయి. “ఉత్తరాది రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెరిగితే, దక్షిణాది ప్రభావం తగ్గిపోతుంది” అన్న వాదన రాజకీయంగా బలంగా వినిపించింది. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై అన్యాయం చేస్తోందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
ఇక మహిళా రిజర్వేషన్లను విపక్షాలు వ్యతిరేకించడం లేదు. కానీ డీలిమిటేషన్తో అనుసంధానం చేయడాన్నే నిరసిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. “మహిళా సాధికారత”ను ఇతర రాజకీయ లెక్కలతో కలపకూడదని మాత్రం బలంగా పేర్కొంటున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలు ఏకమైతే కేంద్రానికి సవాల్ విసరగలవని తేలిపోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం, ఎన్డిఎ మద్దతుపైనే ప్రభుత్వం కొనసాగుతుండటం ఈ సందర్భంలో ప్రస్తావించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన రాజ్యాంగ సవరణలను చేపట్టాలంటే విస్తృత చర్చ, సమన్వయం, సంఘీభావం అవసరం.
డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధ ప్రక్రియ. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రతినిధ్యాన్ని పునర్వ్యవస్థీకరించడం దాని లక్ష్యం. కానీ అమలు విధానం, సమయం, ప్రాంతీయ సమానత వంటి అంశాలు సరైన చర్చల ద్వారా నిర్ణయించాలి.
ఈ ఘటన కేంద్రానికి ఒక రాజకీయ గుణపాఠంగా నిలవాలి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం, మిత్రపక్షాలతో సమన్వయం అవసరం. అదే సమయంలో విపక్షాలు కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. కేవలం వ్యతిరేకతకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వాలి.
131వ రాజ్యాంగ సవరణ చుట్టూ జరిగిన పరిణామాలు భారత ప్రజాస్వామ్యంలో చర్చల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేశాయి. భేదాభిప్రాయాలు, విభేదాలు సహజమే, కానీ వాటిని పరిష్కరించేది సానుకూల చర్చలు, సమన్వయం మాత్రమే. అధికార, విపక్షాలు రెండూ ఈ పాఠాన్ని గ్రహిస్తేనే భవిష్యత్ రాజకీయాలు స్థిరత్వంగా పయనిస్తాయి.

