తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య నెలకొన్న విభేదాలు తాజాగా మరోసారి తెరపైకి వచ్చాయి. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఆమె ఒంటరిగానే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక కాంగ్రెస్లోని కొందరు మంత్రులు, ముఖ్య నేతల మద్దతు ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ నెల 13న మంత్రి కొండా సురేఖ రాసినట్లు ప్రచారంలోకి వచ్చిన ‘పాలించే ప్రభువు కాదు.. కలిసి పనిచేసే గుంపుమేస్త్రీ’ అనే వ్యాఖ్యలతోనే రేవంత్ ప్రభుత్వ పనితీరుపై పరోక్ష విమర్శలు మొదలయ్యాయనే చర్చ జరిగింది. ఆ తర్వాత కేవలం మూడు రోజులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు కొండా సురేఖ గైర్హాజరు కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత వారం రోజులు కూడా గడవకముందే కొండా సుష్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది.
రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు స్పందిస్తే ఆయన అవినీతి చిట్టాను బయటపెడతానంటూ సుష్మిత హెచ్చరించడం సంచలనంగా మారింది. పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ తరఫున తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బీసీ మంత్రుల ఫొటోలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించడంతో పాటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని కూడా ఆమె నిలదీశారు.
అంతేకాకుండా రూ.200 కోట్ల విలువైన భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి ఎలా కట్టబెడతారని సుష్మిత ప్రశ్నించడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. రేవంత్ రెడ్డి వెంట ఉన్న ‘పొంగు’ ఎంతోకాలం నిలవదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. మరోవైపు మేడారం జాతర సమయంలో మంత్రి సీతక్క, పొంగులేటి వర్గాలతో కొండా సురేఖకు విభేదాలు మొదలయ్యాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ ఉంది.
గతంలోనూ సుష్మిత రేవంత్ వర్గంపై ఆరోపణలు చేసినప్పటికీ పెద్దగా స్పందించని కాంగ్రెస్ నాయకత్వం, తాజా పరిణామాలపై మాత్రం క్రమశిక్షణ చర్యలకు దిగింది. కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ వివరణ కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనలో సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కొండా కుటుంబం నుంచి వరుసగా వస్తున్న విమర్శల వెనుక మరికొందరు కాంగ్రెస్ మంత్రులు, నాయకుల మద్దతు ఉందన్న ఊహాగానాలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. షబ్బీర్ అలీని ఎందుకు పక్కన పెట్టారు? కొండా మురళికి ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదు? సీతా దయాకర్ రెడ్డికి ఎందుకు పదవి ఇచ్చారు? వంటి ప్రశ్నలు సుష్మిత లేవనెత్తడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ సాగుతోంది.
మొత్తంగా చూస్తే, ఈ వ్యవహారం కేవలం ‘టీ కప్పులో తుఫాను’గానే ముగుస్తుందా? లేక ‘అసలు కాంగ్రెస్–కొసరు కాంగ్రెస్’ మధ్య ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా.. ఉద్దేశపూర్వకమా? అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లో కాంగ్రెస్లో జరిగే పరిణామాలే సమాధానం చెప్పాల్సి ఉంది.

