మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. నిఘా పెరిగింది. అక్కడక్కడా అడపాదడపా గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముఠాలను పట్టుకుంటున్నారు. కానీ, ఆ మాఫియా గుట్టు రట్టవుతున్నా, మట్టు పెట్టడమే సాధ్యమవడంలేదు. ఎక్కడో ఒకచోట పట్టుబడితే, అంతకుమించి మరోచోట రవాణా కొనసాగుతోంది. ఇది కేవలం చట్టానికి మాత్రమే కాదు, సమాజానికే సవాల్ గా మారిన సంక్షోభం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఏపీలోని మదనపల్లెలో బాలికపై జరిగిన దారుణం, నెల్లూరులో ప్రజాకళాకారుడు పెంచలయ్య హత్య, తెలంగాణలోని నిజామాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై జరిగిన దాడి, ఆమె మరణం వంటి సంఘటనల వెనుక మత్తు మాఫియా దౌర్జన్యమే ప్రస్ఫుటమవుతోంది. మత్తు మనిషిలోని విచక్షణను హరించి, నేరానికి దారి తీస్తోందని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.
గత రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల పరిమాణం విపరీతంగా పెరిగింది. వేల కోట్ల విలువైన, లక్షల కిలోల మత్తు పదార్థాలు పట్టుపడుతున్నాయి. దీన్ని బట్టి మత్తు పదార్థాల వినియోగం ఏ స్థాయిలో విస్తరించిందో ఊహించవచ్చు. స్కూల్ ఏజీ పిల్లల నుంచి యువత వరకూ మత్తు బారిన పడుతున్నారన్న నివేదికలు భవిష్యత్తు సమాజంపై భయాందోళనలు కలిగిస్తున్నాయి. మత్తుకు బానిసైన యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు.
నిజానికి మత్తు, మాదకద్రవ్యాల సమస్యను కేవలం పోలీసు చర్యలతోనే ఎదుర్కోలేం. ఇంకా కఠిన చట్టాలు అవసరం. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర రవాణా మార్గాలపై నిఘా పెరగాలి. రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వంటి సంస్థలు సమగ్ర కార్యాచరణతో దూకుడు పెంచాలి.
ఈ దుష్ప్రభావానికి సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తి, ఈజీగా డబ్బు సంపాదన, నిరుద్యోగం, ఆకలి, అవసరాలు కూడా కారణాలు. వేగంగా డబ్బు సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలనే ఆశతో కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విస్తరించాలి. యువతకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కేవలం శిక్షలతో సమస్యను అణచివేయడం సాధ్యం కాదు. ఇవ్వాళ జైలుకెల్లిన వాళ్లు రేపు విడుదలై తిరిగి అదే పనిలో నిమగ్నమవుతున్నారు.
ఇక మత్తుకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలి. ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సకాలంలో వైద్య సహాయం అందించాలి. మత్తు వినియోగం మొదట సరదాగా మొదలై, తరువాత శారీరక, మానసిక వ్యవస్థలను క్రమంగా దెబ్బతీస్తుంది. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా పతనం జరుగుతోంది. కాబట్టి పునరావాస విధానాలు సమర్థంగా అమలవ్వాలి.
రాజకీయ వ్యవస్థ కూడా తన బాధ్యతను గుర్తించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మత్తు ముఠాలకు రాజకీయ అండదండలు లభించడం నిజమైతే అత్యంత ప్రమాదకరం. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి మాదకద్రవ్యాల వ్యాపారంతో సంబంధం ఉన్నవారిని వెలివేయాలి. ఈ విషయంలో రాజకీయం మించి సామాజిక ప్రయోజనం ప్రధానంగా నిలవాలి.
విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు అత్యవసరం. స్కూలు స్థాయిలోనే పిల్లలకు మత్తు ప్రమాదాలపై బోధించాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీల్లో నిఘా పెరగాలి. మీడియా సంచలనాత్మక వార్తలకే పరిమితం కాకుండా అవగాహన సృష్టించే కార్యక్రమాలు చేపట్టాలి.
మాదకద్రవ్యాలపై సమాజం మొత్తం కలిసిరావాలి. సరఫరాను అరికట్టడమే కాదు, డిమాండ్ లేకుండా చేయాలి. ఉపాధి, అవగాహన, కఠిన చట్ట అమలు, పునరావాసం వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలి.

