దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కోసం ఆందోళన చెందడం ఆలోచించాల్సిన విషయం. ఉద్యోగాల కొరతతో పాటు నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు యువతలో నిరాశను మరింత పెంచుతున్నాయి.
యువత ఆగ్రహాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నిజమైన పాలనా బాధ్యత. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ శక్తి యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కంటే ఉన్నతంగా చూడాలి. పార్లమెంట్లో చర్చలు జరగాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. తప్పు చేసినవారు ఎవ్వరైనా చట్టం ముందు జవాబుదారీగా నిలవాలి. యువత ఆక్రోశాన్ని రాజకీయ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తించాలి. లేకపోతే ఈ అసంతృప్తి మరింత విస్తరించి, భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్యమాలకు దారితీసే అవకాశాన్ని విస్మరించలేం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుందని ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. కానీ అదే యువత వీధుల్లోకి వచ్చి తమ భవిష్యత్తుపై ప్రశ్నలు సంధించినప్పుడు నేతలు, అధికార యంత్రాంగం స్పందించే తీరు మాత్రం విభిన్నంగా ఉంటోంది. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్ఠంభన కీలక ప్రశ్నలను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. యువతలో పెరుగుతున్న అసహనం, అసంతృప్తిలకు కేవలం రాజకీయ సమాధానాలు సరిపోవు. వ్యవస్థాగత సంస్కరణలే శాశ్వత పరిష్కారం.
జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షను ప్రతి ఏడాది 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. లక్షలాది కుటుంబాల ఆశలు, సంవత్సరాల శ్రమ, కోట్లాది రూపాయల ఖర్చు ఈ ఒక్క పరీక్షపై ఆధారపడి ఉంటుంది. అలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం కేవలం పరీక్షా నిర్వహణలో వైఫల్యం మాత్రమే కాదు. అది విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే ఘటన. అందుకే ఈ అంశంపై విద్యార్థుల ఆగ్రహాన్ని చిన్న సమస్యగా చూడడం సమంజసం కాదు.
పార్లమెంట్లో తీవ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం కూడా దర్యాప్తు, అరెస్టులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా పారదర్శక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా చర్చ జరిగేలా సహకరించడం అవసరం. నిరసన ఎంత ముఖ్యమో, చర్చ కూడా అంతే ముఖ్యం.
దేశంలో పేపర్ లీకేజీల సమస్య కొత్తది కాదు. గత పదేళ్లలో 150కు పైగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపిఎ హయాంలోనూ లీకులు జరిగాయి. అనేక పరీక్షలు రద్దు కావడం, మళ్లీ నిర్వహించాల్సి రావడం, లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు పడటం మాత్రం వాస్తవం. ప్రతి పరీక్ష రద్దు వెనుక వేలాది కుటుంబాల ఆర్థిక భారం, నెలల తరబడి చేసిన శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటాయి.
దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కోసం ఆందోళన చెందడం ఆలోచించాల్సిన విషయం. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం యువ నిరుద్యోగం భారతదేశానికి ప్రధాన సవాల్. ఉద్యోగాల కొరతతో పాటు నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు యువతలో నిరాశను మరింత పెంచుతున్నాయి.
జంతర్ మంతర్ లో జరిగిన విద్యార్థుల నిరసనలు కూడా ఇదే అసంతృప్తికి ప్రతిబింబం. సామాజిక మాధ్యమాల ద్వారా స్వచ్ఛందంగా సమీకరించిన వేలాది మంది యువత పాల్గొనడం, మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండడం, రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తపరచడం కొత్త సామాజిక పరిణామం. ప్రతి నిరసన వెనుక రాజకీయ కోణం వెతకడం కంటే, ఆ నిరసనకు దారితీసిన కారణాలను అర్థం చేసుకోవడం పాలకుల బాధ్యత.
అవినీతి కూడా ఈ సంక్షోభానికి మరో మూల కారణం. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామకాలలో అవకతవకలు, లంచగొండితనం వంటి ఘటనలు ఆయా వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయడం, దర్యాప్తు సంస్థలకు స్వతంత్రత కల్పించడం, వేగవంతమైన విచారణలు నిర్వహించడం, దోషులకు కఠిన శిక్షలు విధించడం అవసరం. అయితే శిక్షల విషయంలో రాజ్యాంగం, న్యాయవ్యవస్థ నిర్దేశించిన ప్రమాణాలు, మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు కూడా అత్యవసరం. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రశ్నాపత్రాల భద్రత, డిజిటల్ పర్యవేక్షణ, బాధ్యులపై వేగవంతమైన చర్యలు, పరీక్షా సంస్థల జవాబుదారీతనం పెంపు వంటి చర్యలు చేపట్టాల్సిన సమయమది. అలాగే నియామక ప్రక్రియలు నిర్ణీత కాలపట్టికలో పూర్తి చేయడం ద్వారా యువతలో నమ్మకాన్ని పునరుద్ధరించాలి.
యువత ఆగ్రహాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నిజమైన పాలనా బాధ్యత. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ శక్తి యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కంటే ఉన్నతంగా చూడాలి. పార్లమెంట్లో చర్చలు జరగాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. తప్పు చేసినవారు ఎవ్వరైనా చట్టం ముందు జవాబుదారీగా నిలవాలి. యువత ఆక్రోశాన్ని రాజకీయ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తించాలి. లేకపోతే ఈ అసంతృప్తి మరింత విస్తరించి, భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్యమాలకు దారితీసే అవకాశాన్ని విస్మరించలేం.

