ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం ప్రజల జీవన విధానం, ప్రమాణాల్లో వచ్చిన మార్పునకు సంకేతం. అయితే, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, దిగుమతులపై ఆధారపడే వ్యవస్థ అవడం, దేశంలో గ్యాస్ భద్రతపై అప్పుడప్పుడూ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ లో యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా అంతరాయం కలగవచ్చనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో గ్యాస్ వినియోగ స్థితి, నిల్వలు, భవిష్యత్ అవసరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశ్లేషించుకోవడం అవసరం.
భారతదేశంలో ఎల్పీజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2004-05లో దేశంలో ఎల్పీజీ వినియోగం కేవలం 10.2 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, 2024-25 నాటికి ఇది 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే రెండు దశాబ్దాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. 2017లో 21.6 మి.మె.ట.గా ఉన్న వినియోగం 2025లో 31.3 మి.మె.ట.కి చేరి దాదాపు 44 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం దేశంలో 32.9 కోట్ల గృహ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ అందుబాటు 102.8 శాతానికి చేరినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ సదుపాయం దాదాపు చేరిందని చెప్పవచ్చు. ప్రతి నెల సగటు. దేశంలో 2.6 మి. మె. ట. ల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. కుటుంబాల వారీగా చూస్తే సాధారణ వినియోగదారులు ఏడాదికి సగటున 6–7 సిలిండర్లు వినియోగిస్తుండగా, పేద కుటుంబాలకు అందించే పథకాల కింద సగటు వినియోగం 4.5 సిలిండర్లుగా ఉంది.
ఎల్పీజీ వినియోగం దేశీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా వేగంగా పెరుగుతోంది. భారత్లో వినియోగించే ఎల్పీజీలో 60%-65% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చే సరఫరా కీలకం. ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగాగానే గాక, రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతి దేశంగా భారత్ నిలిచింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధాలు లేదా ఉద్రిక్తతలకు సరఫరా మార్గాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా భారత్కు వచ్చే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ మార్గం ద్వారా వచ్చే సరఫరా నిలిచిపోతే దేశంలో తాత్కాలిక కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా తగ్గడంతో వ్యాపారాలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాణిజ్య రంగానికి సరఫరా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
దేశంలో గ్యాస్ నిల్వల పరిస్థితి కూడా అంతగా దీర్ఘకాలిక భద్రతను, భరోసాను ఇవ్వలేవనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వ సామర్థ్యం 16 రోజుల వినియోగానికి సరిపడే స్థాయిలో మాత్రమేనని పరిశ్రమ నివేదికలు చెబుతున్నాయి. అంటే దిగుమతులు నిలిచిపోయినా, సరఫరా ఆగిపోయినా, దేశం ఎక్కువకాలం నిల్వలపై ఆధారపడే పరిస్థితి లేదు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని అత్యవసర చర్యలు తీసుకుంది. రిఫైనరీలను పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆదేశించడం, ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచడం, పరిశ్రమలకు వెళ్లే గ్యాస్ను కొంత మేర గృహ వినియోగానికి మళ్లించడం వంటి చర్యలు చేపట్టింది.
అయితే, దీర్ఘకాలికంగా చూస్తే మరికొన్ని చర్యలు అమలు చేయాల్సిన అగత్యం కనిపిస్తోంది. మొదటగా, ఎల్పీజీ దిగుమతులపై అధికంగా ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి. అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యామ్నాయ దిగుమతులకు పూనుకోవాలి. రెండవది, దేశంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక నెలకు పెరగాలి. మూడవది, గ్యాస్ వినియోగంలో సమర్థతను పెంచే చర్యలు అవసరం. స్మార్ట్ బుకింగ్ విధానాలు, నిల్వల నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలి.
నాలుగవది, ప్రత్యామ్నాయ శక్తి వనరులపై దృష్టి పెట్టాలి. బయోగ్యాస్, విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా గ్యాస్పై ఒత్తిడిని తగ్గించవచ్చు. గ్యాస్ వినియోగం అభివృద్ధికి సూచికగా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో ఇది ఇంధన భద్రతకు సవాలుగా నిలుస్తోంది. పెరుగుతున్న వినియోగానికి తగిన అన్ని ప్రత్యామ్నాయ శక్తి వనరులు లేకపోతే భవిష్యత్తులో మరింత సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే దేశ ఇంధన భద్రతకు భద్రత ఉంటుంది.

