అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం, భాగస్వామ్యం అత్యవసరం!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
అభివృద్ధి లక్ష్యం ఎంత గొప్పదైనా, అది ప్రజావసరాలు తీర్చలేకపోతే, వారి జీవనాధారాలను దెబ్బతీస్తే ఆ అభివృద్ధి అర్థహీనమే. అమరావతి రాజధాని నిర్మాణం, ఔటర్ రింగు రోడ్ వంటి ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న భూసేకరణల నేపథ్యంలో రైతుల ఆందోళనలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే 32 వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం, మరిన్ని దశల్లో మరింత భూసేకరణకు సిద్ధమవుతుండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చివేస్తోంది.
అమరావతి కోసం మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చిన పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు, కౌలు చెల్లింపులు సకాలంలో అందకపోవడం ప్రధాన సమస్య. రాజధాని కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన రైతులు ఇప్పటికీ పూర్తి ప్రయోజనాలు పొందకపోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో మరిన్ని భూములను ఇవ్వాలని ప్రభుత్వం రైతుల మెడపై కత్తి పెట్టడం సహజంగానే రైతులకు వ్యతిరేకతకు దారితీస్తున్నాయి.
ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఔటర్ రింగు రోడ్ ప్రాజెక్ట్ విస్తృతి రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది. 250 మీటర్ల వెడల్పుతో, 189 కిలోమీటర్ల పొడవునా, ఈ రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు. గుంటూరు, ఎన్టిఆర్, కృష్ణా, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో విస్తరించే ఈ ప్రాజెక్ట్ వల్ల వేల ఎకరాల సారవంతమైన భూములను రైతులు కోల్పోయే ప్రమాదం ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలాంటి రహదారులు సాధారణంగా 60–70 మీటర్ల వెడల్పుతో నిర్మించబడుతున్న సందర్భంలో, అమరావతిలో 250 మీటర్ల విస్తృతి అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ ప్రాంతాల్లోని భూములు మూడు పంటలు పండించే అత్యంత సారవంతమైన కృష్ణా పరివాహక ప్రాంతాలకు చెందినవి. ఈ భూముల మార్కెట్ విలువ ఎకరానికి రూ.1 కోటి నుండి రూ.2 కోట్లు వరకు ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ, రైతులకు అందిస్తున్న పరిహారం ఈ విలువలకు ఏ మాత్రం దరిదాపుల్లో లేవు. భూమికి భూమి ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలు కూడా సరిగా అమలు కాలేదు.
భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం మరో ప్రధాన సమస్య. వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సచివాలయాల వద్ద సాధారణ సమాచారం మాత్రమే ప్రదర్శించడం వల్ల రైతుల్లో గందరగోళం నెలకొంది. ఏ రైతు భూమి ఎంత మేరకు సేకరించబడుతుందన్న స్పష్టత లేకపోవడం అనిశ్చితిని పెంచుతోంది.
2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించడం, సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడం, ప్రజల సమ్మతి పొందడం తప్పనిసరి. అయితే ఈ చట్టబద్ధమైన ప్రక్రియ అనేక ప్రాంతాల్లో అమలు కాలేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా కూడా భావించవచ్చు.
పర్యావరణ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత మార్గం కృష్ణా నది బఫర్ జోన్కు సమీపంగా ఉండటం వల్ల వరదల ప్రమాదం పొంచి ఉందని రైతులు కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ ప్రాంతాలు వరదలకు గురైన అనుభవం ఉన్న నేపథ్యంలో, ఇలాంటి ప్రాజెక్ట్ భవిష్యత్తులో మరింత నష్టానికి దారితీయవచ్చన్న భయం సహజమే.
ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు “ఇంకెన్ని సార్లు త్యాగం చేయాలి?” అని ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబం పలు దశల్లో భూములు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, వారి జీవన విధానానికి, సామాజిక స్థితికి కూడా పెద్ద దెబ్బ.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించాలి. కొత్త భూసేకరణకు ముందు పూర్తి పారదర్శకతతో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రాజెక్ట్ విస్తృతిని పునఃసమీక్షించి, అవసరమైతే 250 మీటర్లను 70 మీటర్లకు తగ్గించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా సరైన పరిహారం చెల్లించాలి.
అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం, భాగస్వామ్యం అత్యవసరం. వారి గుండెల్లో భయం కాకుండా, భవిష్యత్తుపై విశ్వాసం నింపడం ప్రభుత్వ బాధ్యత.

