సీసీఐ పత్తి కొనుగోల్ మాల్!
తప్పెవరిది? శిక్షలెవరికి?
మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి?
దళారుల ప్రమేయం నిజం కాదా?
మార్కెటింగ్ శాఖదే బాధ్యతా?
కేంద్రం ఎందుకు స్పందించదు?
వరంగల్ జేడీఎం సప్పెన్షన్!
7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు
సీసీఐ పత్తి అవినీతిపై ‘అడుగు’ గ్రౌండ్ రిపోర్ట్
దేశమంతటా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా పత్తి కొనుగోలు చేస్తోంది. ప్రతిసారీ సీసీఐ కొనుగోళ్ళ కంటే కూడా కొనుగోల్ మాల్ మీదే వివాదాలు ఎక్కువగా ముసురుకుంటున్నాయి. గతేడాది జరిగిన అవినీతిపై తాజాగా మార్కెటింగ్ శాఖ అధికారులకు నోటీసులివ్వడం ఒక ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం వాదాస్పదమే కాకుండా, చర్చనీయాంశంగా మారింది. అవినీతిలో అనేక మంది పాలు పంచుకున్నా, ఒక్క మార్కెటింగ్ శాఖ మీదే చర్యలెందుకు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కేంద్ర సంస్థల వైఫల్యాలపై కేంద్రం ఎందుకు స్పందించదు? ఏటేటా దగా పడుతున్న రైతులు సంధిస్తున్న ప్రశ్నలెన్నో?
(అడుగు ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణలో భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలులో తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పేరుతో జరిగిన అవినీతిలో బాధ్యులెవరు? సీసీఐ అధికారుల పాత్ర ఎంత? మార్కెటింగ్ శాఖ అధికారుల బాధ్యతెంత? మొత్తం అవినీతిలో ఒక్క మార్కెటింగ్ శాఖ అధికారులను మాత్రమే భాద్యులను చేయడం సబబేనా? అసలు అవినీతి ఎలా జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు?
గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాల వ్యవహారంలో 84 మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేయగా, తాజాగా మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారిని సస్పెన్షన్ చేయడం వివాదాస్పదంగానేగాక, చర్చనీయాంశంగా మారింది.
ఇదీ వెసలుబాటు
పట్టాదారు పాసు పుస్తకాలు లేని కౌలు రైతులు, పోడుభూములు చేసే రైతులకు సరైన పత్రాలు లేని కారణంగా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వెసలుబాటు కల్పించింది. ఈ వెసలుబాటు ఆసరాగా దళారులతో కలిసి, మిల్లర్లు, అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కొందరి పేర్లతో నేరుగా దళారులు, మిల్లర్లు, అధికారులు కలిసి దోచేశారు.
దందా సాగిందిలా?
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులంతా భాగవస్వాములే. ముందుగా వ్యవసాయ అధికారులు పత్తి రైతులను గుర్తిస్తూ, వారు సాగు చేసిన భూములు, పండిన పత్తికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ ధ్రువీకరణ పత్రాల్లో రాసిన ఒక ఎకరా పంటకు బదులు ఒకటి పక్కన సున్నా పెట్టి పది, అంతకు మించి 19 ఎకరాలు పత్తి పండినట్లుగా మిగతా అధికారులు, మిల్లర్లు కలిసి నమోదు చేశారు. ఆ మేరకు మిల్లర్ల పత్తినే తిరిగి మిల్లర్లకు పెడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముని తలా ఇంత పంచుకున్నారు.
మిల్లులే వేదికగా పత్తి కొనుగోలు
భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలును వ్యవసాయ మార్కెట్లల్లో కాకుండా పత్తి మిల్లులే వేదికగా చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ బాధ్యత తీసుకున్నా.. సీసీఐ కొనుగోలులో తప్పులు జరగడానికి ఒక్క మార్కెట్ అధికారులే కారణమా? పత్తి మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదా? పత్తి కొనుగోళ్లు పరిశీలించే సీసీఐ అధికారులకు బాధ్యత లేదా? అవినీతిలో రైతు సరుకుల విక్రయ దారులు, దళారుల ప్రమేయం లేదా? తప్పంతా మార్కెటింగ్ శాఖదేనా?
పత్తిపాపం తలా పిడికెడు
సీసీఐ కొనుగోలులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు.. పత్తి మిల్లర్లు, సీసీఐ అధికారులు, దళారులు, మార్కెట్ సిబ్బంది అవినీతి విషయంలో అందరి బాధ్యత ఉంది. కానీ తప్పులు అందరు చేస్తే మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రమే శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం అని సీసీఐ కొనుగోలు మాల్ తో పరిచయం ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు.
పత్తి పాపాన్ని పంచుకున్నారు
సీసీఐ కొనుగోలులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి అనేది నిజం. పత్తి మిల్లర్లు, సీసీఐ, మార్కెట్ అధికారులు అందరూ ఏకమై పత్తి కొనుగోలులో పెద్ద మొత్తం దోపిడీ చేశారు. కానీ, మార్కెటింగ్ శాఖ పెద్దలు మాత్రం జేడియం తో పాటు ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెన్షన్ చేసింది. ఇందులో కొందరు రాజకీయ నాయకులకు సైతం డబ్బులు అందాయి. చివరికి రైతు సంఘ నాయకులకు.. మీడియా మిత్రులకు డబ్బులు ఇచ్చి మరీ, సీసీఐ పత్తి కొనుగోలు అవినీతి బయటికి పొక్కకుండా నోర్లు మూయించారు.
బాధ్యులపై కేసులేవి?
సీసీఐలో జరిగిన అవినీతి విషయంలో కేవలం మార్కెటింగ్ శాఖ ఉద్యోగులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా అవినీతిలో భాగం పంచుకున్న పత్తి మిల్లర్లు సీసీఐ అధికారులు, రైతు సరుకుల విక్రయదారులు, దళారులు, మార్కెటింగ్ సిబ్బంది, దడ్వాయిలు అందరిపై కేసు నమోదు చేయాలి. తప్పు చేసిన వారిని జైల్లో వేసి శిక్షించాలి.

