సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా వీరికి ఆర్యులు అనే పేరు వచ్చింది. వీరు రచించిన వేద సాహిత్యం ద్వారా సాహిత్యమును అధ్యయనం చేశారు కాబట్టి వీరిని వైదికులు అంటారు. భారతదేశంలో సాహిత్యం ద్వారా అధ్యయనం చేయబడిన తొలి యుగం ఇదే. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాగరికతను Painted Grey Ware (కుండ పాత్రలు) అంటారు.

ఆర్యుల జన్మస్థలం:
ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాహిత్యంలో వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కొంతమంది చరిత్రకారులు వీరిని స్వదేశీయులు అని మరికొందరు విదేశీయులని అంటున్నారు.
D.S. త్రివేది, సంపూర్ణానంద్ ప్రకారం ఆర్యులు స్వదేశీయులని సింధు ప్రాంతం వీరి జన్మస్థలమని భావిస్తున్నారు.
దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు టిబెట్ ప్రాంతం నుండి వలస వచ్చారని అభిప్రాయపడుతున్నారు.
జర్మన్ శాస్త్రవేత్త అయిన మాక్స్ ముల్లర్ ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చి క్రీ. పూ.1500 కాలంలో సింధు ప్రాంతంలో స్థిరపడ్డారని భోగజ్ కోయీ శాసనం తెలియచేస్తుంది. ప్రస్తుతానికి ఈ మాక్స్ ముల్లర్ అభిప్రాయాన్ని ఎక్కువ మంది పండితులు ఆమోదిస్తున్నారు. ఆర్యుల నాగరికతను సౌలభ్యం కొరకు రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేస్తారు.
ఎ) మొదటి దశ: ఈ కాలాన్ని ఋగ్వేద యుగమని పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలాన్ని అధ్యయనం చేయడానికి ఋగ్వేదం ఒకటే ఆధారం. దీని కాలం క్రీ. పూ. 1500 నుండి 900 వరకు.
బి) రెండవ దశ: ఈ కాలాన్ని మలివేద యుగం అంటారు. దీని కాలం క్రీ. పూ. 900-500 వరకు.
ఆర్యుల భౌగోళిక పరిజ్ఞానం:
ఆర్యులు తొలివేద కాలంలో కేవలం సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. తూర్పున యమున, దక్షిణాన ఆరావళి ప్రాంతం వరకు మాత్రమే వీరు జీవించారు. ఈ కాలం ఆర్యులకు సముద్రం తెలియదు. సముద్రం అంటే కేవలం నదుల సంగమం అని మాత్రమే తెలుసు. ఋగ్వేద కాలంనాటి ఆర్యులకు సింధు నాగరికత వెలసిన ప్రాంతాల్లోనే జీవించారు. క్రీ. పూ. 1000 కాలంలో ఆర్యులు సింధు ప్రాంతం నుండి గంగా మైదాన ప్రాంతానికి వలస వెళ్ళారు. శతపద బ్రాహ్మణం సింధు ప్రాంతంలోని ఒక తెగ నాయకుడు తన తెగతో కలిసి గంగా నది పరివాహక ప్రాంతాల్లో స్థిరపడ్డారని చెప్తుంది. మలివేద ఆర్యులకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉంది అని ఐతరేయ బ్రాహ్మణం తెలియచేస్తుంది.
వేద సాహిత్యం
ఆర్యులు అందించిన అద్భుతమైన సాహిత్యం వేదసాహిత్యం. ఇది సంస్కృత భాషలో ప్రారంభంలో మౌఖికంగా ఉంటూ గుప్తుల కాలంలో రాయబడింది. ఆర్యులు అందించిన ఈ వేదసాహిత్యమే హిందూ మతానికి పవిత్ర గ్రంథాలుగా మారాయి. వేద సాహిత్యంలో ప్రధానంగా 8 భాగాలున్నాయి. అవి:
1. వేదాలు
2. బ్రాహ్మణాలు
3. అరణ్యకాలు
4. ఉపనిషత్తులు
5. వేదాంగాలు
6. పురాణాలు
7. ఉపవేదాలు
8. ఇతిహాసాలు
ఇందులో మొదటి నాలుగింటిని శృతి సాహిత్యం అంటారు. శృతి అనగా పాడగలిగేవి అని అర్థం. ఇవి దేవతలు రాసి ఋషులకు పంపించారని నమ్మకం. ఇవి అత్యంత పవిత్రమైన గ్రంథాలు.
చివరి నాలుగింటిని స్మృతి సాహిత్యం అంటారు. ఇవి ఋషులు రాయబడిన గ్రంథాలు.
వేదాలు
వేదాలు నాలుగు. అవి:
1) ఋగ్వేదం: ఇందులో 1028 శ్లోకాలుంటాయి. ఇవన్నీ వివిధ దేవతలకు ప్రార్థనలు. వీటిలో అత్యంత ముఖ్యమైనది గాయత్రి మంత్రం సావిత్రి అనే దేవతకు ప్రార్థన. ఋగ్వేదంలోని పది మండలాలలో చివరిది పురుషసూక్తం. తొలిసారిగా కుల ప్రస్తావన ఈ పురుషసుక్తంలోనే ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మ కుల వ్యవస్థను మరియు సమస్త విశ్వమును తన శరీరం నుండే సృష్టించాడని ఈ గ్రంథం చెప్తుంది. తల నుండి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను పుట్టించాడని ఈ గ్రంథం తెలియచేస్తుంది.
2) యజుర్వేదం: ఈ వేదం యజ్ఞయాగాల గురించి తెలియజేస్తుంది. ఆర్యుల కాలంలో యజ్ఞయాగాలు కీలక పాత్రను పోషించాయి.
3) సామవేదం: సమ అంటే సంగీతం అని అర్థం. ఋగ్వేదంలో రాయబడిన శ్లోకాలను రాగయుక్తంగా సామవేదంలో ఆలకించారు. ఇందులో కొత్త సమాచారం ఏమీ ఉండదు.
4) అథర్వణ వేదం: ఈ వేదం 20 ఖండాలుగా విభజించబడి సుమారు ఏడు వందల శ్లోకాలను కలిగిఉంది. ఇందులో భూతప్రేతాలను, రోగాలను నివారించే మంత్రాలు ఉంటాయి. ఇవి. ఆర్యుల కాలంలో కూడా మూఢనమ్మకాలు ఉండేవి అని సూచిస్తుంది. కొంతమంది పండితుల ప్రకారం అథర్వణ వేదాన్ని ఆర్యులు కాకుండా ఇతర జాతి ప్రజలు రచించారని చెప్తున్నారు. వేదాల్లో గల మొదటి మూడు వేదాలను త్రయం అని, వీటిని పూర్తిగా ఆర్యులే రచించారని చెప్తున్నారు.
బ్రాహ్మణాలు
ఇవి యజ్ఞయాగాల గురించి తెలియజేసే గ్రంథాలు. ఇందులో ఏడు బ్రాహ్మణాలు గద్యరూపంలో వేదాలకు అనుబంధంగా రాయబడ్డాయి. అవి: 1) ఐతరేయ బ్రాహ్మణం, 2) కౌశితకి బ్రాహ్మణం, 3) శతపత బ్రాహ్మణం, 4) తైత్తిరీయ బ్రాహ్మణం, 5) తాండ్యమాన బ్రాహ్మణం, 6) తైమీనియ బ్రాహ్మణం, 7) గోపథ బ్రాహ్మణం.
ఐతరేయ బ్రాహ్మణం కళింగ, పులింద, ఆంధ్ర ఇత్యాది, సవర వంటి తెగలు దక్షిణ భారతదేశంలో జీవిస్తున్నాయి తెలియజేసింది. ఆంధ్ర అనే పదం తొలిసారిగా ఈ గ్రంథాలోనే ప్రస్తావించబడింది.
అరణ్యకాలు
అడవులలో నివసించే మనుషులు, ఋషుల గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఇందులో 7 బ్రాహ్మణులకు అనుబంధంగా 7 అరణ్యకాలు ఉన్నాయి.
ఉపనిషత్తులు
వేదసాహిత్యంలో ఉపనిషత్తులు చివరివి. అందుకే వీటిని వేదాంతాలు అంటారు. ఇవి మొత్తం 108. ఉపనిషత్తుల్లో ఎక్కువగా తాత్విక ఊహాగానాలు ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్షం వంటి అంశాలన్నీ ఇందులోనే చర్చించబడ్డాయి. ముఖ్యమైన ఉపనిషత్తులు 1) ముండకోపనిషత్తు, 2) శ్వేతేశ్వతార ఉపనిషత్తు, 3) జబలోపనిషత్తు, 4) చాందోగ్య ఉపనిషత్తు.
భారత చిహ్నంలోని ‘సత్యమేవ జయతే’ అనే సూక్తి ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది.
వేదాంగాలు
ఇవి వేదాలకు అంగముల వంటివి. వేద పండితులకు వీటి జ్ఞానం తప్పనిసరి. వేదాంగాలు ఆరు. అవి: 1) శిక్ష, 2) నిరుక్త, 3) ఛందస్సు, 4) వ్యాకరణం, 5) జ్యోతిష్యం, 6)కల్ప. ఈ కల్పలోనే యజ్ఞయాగాలకు సంబంధించిన గృహసూత్ర, శ్రౌతసూత్ర, సుళువసూత్ర అనే మూడు భాగాలున్నాయి.
గృహసూత్ర:
ఒక వ్యక్తి మోక్షం పొందుటకు చేయవలసిన షోడశ కర్మల (16 యజ్ఞాలు) గురించి ప్రస్తావించబడ్డాయి. ఒక వ్యక్తి తల్లి గర్భం నుండి స్మశానానికి వెళ్ళేవరకు ఈ 16 యజ్ఞాలను నిర్వహించినట్లయితే మోక్షం పొందుతాడని నమ్మకం.
1) గర్భాదానం: వివాహిత స్త్రీ గర్భం దాల్చుటకు చేసే యజ్ఞం.
2) పుంశవన: గర్భవతి స్త్రీ పుత్రసంతానం కోసం చేసే యజ్ఞం.
3) సీమంతోన్యాయ: సుఖప్రసవం కోసం చేసే క్రతువు.
4) జాతకకర్మ: పుట్టిన శిశువు జాతకమును తెలుసుకొనుటకు చేసే యజ్ఞం.
5) నామకరణ: పుట్టిన శిశువుకు పేరు పెట్టే క్రతువు.
6) నిష్క్రమణ: తొలిసారిగా శిశువును బయటకు తీసుకువెళ్ళే క్రతువు.
7) అన్నప్రాసన: తొలిసారిగా ఆహారాన్ని అందించే క్రతువు.
8) చూడకర్మ: తొలిసారి గుండు కొట్టించే క్రతువు.
9) కర్ణవేద: చెవులు కుట్టించే క్రతువు.
10) విద్యారంభ: విద్యను ప్రారంభించే క్రతువు.
11) ఉపనయన: ఇది కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులకు మాత్రమే ఎనిమిదేళ్ల వయసులో గాయత్రి మంత్రం చదువుతూ పవిత్రతాడును(జంధ్యం) వేస్తారు. ఉపనయనం పాటించేవారిని ద్విజులు అంటారు. ఇది కేవలం పురుషులకు మాత్రమే.
12) వేదారంభ: వేద విద్యను అభ్యసించడానికి ఆశ్రమాలకు వెళ్ళే క్రతువు.
13) కేశాంత: ఆశ్రమాలలో కేశఖండనం(గుండు కొట్టించడం) చేసే క్రతువు.
14) సమావర్తన: విద్యను పూర్తిచేసుకొని ఇంటికి వచ్చే క్రతువు.
15) వివాహం: బ్రహ్మచర్యమును వీడే క్రతువు.
16) అంతేస్తి: మరణం తర్వాత చేసే చివరి కర్మ.
(క్రతువు అంటే యాగం/కార్యం అని అర్థం)
శ్రౌతసూత్ర
ఇందులో రాజు రాజ్యం మరియు ప్రజల సంక్షేమం కొరకు చేయవలసిన యాగాల గురించి వివరించబడ్డాయి. దీనిని సామాన్య ప్రజలు చేయడానికి వీలులేదు.
1) అశ్వమేధయాగం: ఇవి ఇతర రాజ్యాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే యాగం.
2) రాజసూయయాగం: దైవత్వం పొందుటకు చేసే యాగం
3) వాజపేయ: రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితుడు కావడానికి చేసే యాగం. ఈ యాగం చేసిన తర్వాత రాజుకు ‘సామ్రాట్’ అనే బిరుదు లభిస్తుంది.
4) సులువసూత్ర: ఇది హోమగుండాల ఆకారం, పరిమాణాల గురించి తెలియజేసే గ్రంథం. ఈ గ్రంథంలో రేఖాగణిత పరిజ్ఞానం నిక్షిప్తమై ఉంది.
పురాణాలు
పురాణాలు పౌరాణిక గాథలతో పాటు ప్రాచీన చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాయి. ఇవి కలియుగంలోని రాజుల వంశ చరిత్ర గురించి, వంశావళిని తెలియచేస్తాయి. పురాణాలు మొత్తం 18. వీటిలో వాయిపురాణం, విష్ణుపురాణం, మత్స్యపురాణం, భాగవతపురాణం ముఖ్యమైనవి.
ఉపవేదాలు
ఇవి వేదాలకు అనుబంధంగా ఉంటాయి. ఇవి నాలుగు.
1) ఆయుర్వేదం : వైద్య శాస్త్రం గురించి తెలియచేస్తుంది.
2) ధనుర్వేదం: విలువిద్య గురించి తెలియచేస్తుంది.
3) గాంధర్వవేదం: సంగీతం గురించి తెలియచేస్తుంది.
4) శిల్పవేదం: శిల్పకళ గురించి తెలియచేస్తుంది.
ఇతిహాసాలు
ఇవి రెండు. 1) రామాయణం, 2) మహాభారతం.
1) రామాయణం: దీనిని వాల్మీకి సంస్కృతంలో రచించాడు. రామాయణాన్ని ఆదికావ్యమని, వాల్మీకిని ఆదికవి అని అంటారు. దీనిలో 7 కాండములు, 24000 శ్లోకాలు ఉంటాయి.
2) మహాభారతం: దీని రచయిత వ్యాసమహర్షి. ఇందులో 18 పర్వాలు ఉంటాయి. మహాభారతం యొక్క అసలు పేరు జయసంహిత. ఇందులో లక్ష శ్లోకాలు ఉండడంవల్ల ‘శతసహస్రసంహిత’ అని కూడా అంటారు.


