ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపుపై చర్చ జరుపుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కానీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారని చెప్పారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన చేశారన్నారు. ఇప్పుడు నియోజక వర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం వినియోగించుకుంటోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై ఒకే మాటపై నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. అందుకే ఇవాళ సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మనపై వివక్ష చూపుతోందన్నారు.
2026 జనాభా లెక్కింపు తర్వాతే చేపడతామని ఆనాడు పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారన్నారు. జమ్మూ కాశ్మీర్ లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90 కి పెంచారన్నారు. సిక్కింలో 2018లో కేబినెట్ లో రిసోల్యూషన్ పాస్ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దాం అన్నారు. అవసరమైతే పోరాట బాట పడుదాం అన్నారు.త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

