నీ రంగు తేలింది!
మేం ఆడ బిడ్డలం కాదు… ఆడ పులులం!
మమ్మల్ని వెంటాడితే… వేటాడుతాం!
మా కుటుంబం గురించి మీకెందుకు?
మీ ఫ్యామిలీ గుట్టు విప్పమంటావా?
బరితెగించిన మీకు బంధాల గురించేం తెలుసు?
ఆడ బిడ్డలని కూడా చూడుకుండా ఆడుకుంటున్నావు!
మా ఉసురు తగులుతుంది… నీ పాపం పండుతుంది!
పాలకుర్తిని దోచుకొని… అమెరికాలో దాచి పెట్టావు!
మీరు తయారు చేసి మా మీదకు పంపిన కోవర్టుల అంతు చూస్తాం!
తప్పుడు ప్రచారాలు మానుకోండి! తప్పటడుగులు దిద్దుకోండి!!
చెల్లని చిల్లర మీరు…ఇక చిల్లర ప్రచారాలు చాలించండి!
దయాకర్ రావుని మళ్ళీ చిత్తుగా ఓడిస్తాం
స్థానిక సంస్థల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే
పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల అవినీతిపై చర్చకు సవాల్
మీ కుట్రలను ఛేదిస్తాం…పాలకుర్తిని ప్రగతి పథంలో నడిపిస్తాం
ఎర్రబెల్లిపై ఫైర్ అయిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ ఝాన్సీ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఇప్పటి వరకు పరోక్ష ఆరోపణలు, ప్రత్యారోపణలు, సామాజిక మాధ్యమాలకే పరిమితమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ల వార్ ప్రత్యక్షంగా మారింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడని, లేనిపోని సమస్యలు కల్పిస్తూ, తమపై చిల్లర, తప్పుడు దుష్ర్పచారం చేస్తున్నాడన్నది కాంగ్రెస్ అత్తా కోడళ్ళ ప్రధాన ఆరోపణ. ఇటీవల అత్తాకోడళ్ళకు పడటం లేదని, అత్త అమెరికాకు వెళ్ళిపోతోందని, కోడలు అత్త మాట వినటం లేదని, కోడల్ని అత్త సహించడం లేదని, వాళ్ల పనైపోయిందని రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. అవన్నీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమపై ఓడిపోయి, అక్కసుతో గుట్టుగా చేయిస్తున్న ఆరోపణలని, తమపై కోవర్టులను ప్రయోగించి, అడబిడ్డలని కూడా చూడకుండా విక్రుతంగా ప్రవర్తిస్తున్నాడని అత్తాకోడళ్ళు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ ఝాన్సీరెడ్డిలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇంతకాలం మౌనంగా ఉన్న అత్తా కోడళ్ళు సమ్మక్క, సారాలమ్మలుగా మారిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ, తీవ్రంగా స్పందించారు. ఎర్రబెల్లిపై ఫైర్ అయ్యారు. దీంతో ఇప్పటి దాకా నియోజకవర్గంలో కోల్డ్ వార్ కాస్తా ఓపెన్ వార్ గా మారిపోయింది.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిలు ఫైర్ అయ్యారు. ఎర్రబెల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలకుర్తిని దోచి, అమెరికాలో దాచుకున్నావంటూ ఆరోపించారు. అత్తా కోడళ్ళంటూ తమ ఫ్యామిలీని బయటకు లాగుతున్న దయాకర్ రావు ఫ్యామిలీని బజారుకీడుస్తామని హెచ్చరించారు. మా కుటుంబం గురించి నీకెందుకంటూ ప్రశ్నించారు. చిల్లర, తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఆడ బిడ్డలని కూడా చూడకుండా, తమని వెంటాడుతున్న ఎర్రబెల్లికి తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. మేం ఆడ బిడ్డలం కాదు… ఆడ పులులం! మేం వెంటపడితే నీవు తట్టుకోలేవు అంటూ హెచ్చరించారు. మీరెన్ని కుట్రలు పన్నినా వాటిని ఛేదిస్తాం…ఎన్ని అడ్డంకులు కల్పించినా, వాటిని అదిగమించి, పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని పునరుద్ఘాటించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ ఝాన్సీ రెడ్డి పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మరీ ఎర్రబెల్లిపై ఫైర్ అయ్యారు.

ముందుగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ, ఎర్రబెల్లి ఓ ఊసరవెల్లి. ఆయన రంగు బయటపడింది. మా కుటుంబం గురించి నీకెందుకు? మీకు పెళ్ళాం, బిడ్డలు లేరా? వాళ్ళపై ఎవరైనా మీరు మాపై మాట్లాడినట్లే మాట్లాడితే ఊరుకుంటారా? మీ ఫ్యామిలీ గుట్టు విప్పమంటారా? అయినా బరితెగించిన మీకు కుటుంబ సంబంధాల గురించేం తెలుసు? అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. “బిడ్డా కాస్కో ఇక…” అంటూ… ఎర్రబెల్లికి నోట్లపై ఉన్న మమకారంతో బంధాల విలువ మరచిపోయాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించారని ప్రశ్నించారు. నీలా రాజకీయాన్ని డబ్బు, అధికారం వ్యాపారం చేయడంకాదని, తాము సమాజ సేవ కోసమే ఉన్నామని స్పష్టం చేశారు. “నీ అంతు చూస్తా, నీ చెంచాల సంగతి చూస్తా” అంటూ హెచ్చరించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని, మాటని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. తాము అన్యాయాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ భూముల కబ్జాలు, నియోజకవర్గ అభివృద్ధిపై ఎర్రబెల్లి చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, అతని కోవర్టుల విషయాలు కూడా తెలిసినవేనని అన్నారు. “అమావాస్య, పౌర్ణమి ఒకటే కాదని గుర్తుపెట్టుకో” అంటూ తీవ్రంగా స్పందించారు. ప్రజల తీర్పే తుదితీర్పు అని, ప్రజల కుటుంబాల్లో మేం సభ్యులం అని వినమ్రతతో చెప్పినప్పటికీ, ఎర్రబెల్లిని ఇక ఉపేక్షించేది లేదని, రోజుల లెక్క పెట్టుకో… అంటూ.. హెచ్చరించారు. ఎర్రబెల్లి ఊసరవెల్లి పోకడలు మానుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకే ఏడాదిలో బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. ఎర్రబెల్లి ఓటమితో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు స్వతంత్రం వచ్చినట్లుయిందని వ్యాఖ్యానించారు. “దయాకర్ రావు, నిన్ను మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తాం,” అని హెచ్చరించారు. దయాకర్ రావు పాలకుర్తిని దోచుకొని, ఆస్తులను అమెరికాలో దాచి పెట్టాడని ఆరోపించారు. . “నువ్వు తయారు చేసిన కోవర్టుల అంతు చూస్తాం. ఎవ్వరినీ వదిలిపెట్టం” అంటూ హెచ్చరించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.450 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. పాలకుర్తిలోని 50 పడకల హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయడంతో పాటు, రాయపర్తిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని చెప్పారు. పెద్దవంగరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కట్టిస్తున్నామన్నారు. తొర్రూరులో ట్యాంక్ బండ్ పూర్తి చేస్తామన్నారు. ప్రతి మండలంలో ఏమేమి చేయాలన్న స్పష్టత తమకుందన్నారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను తన హయంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. పైగా, రిజర్వాయర్ల అభివ్రుద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని, దయాకర్ రావుకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.
“మా కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక, పాలకుర్తి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సన్న బియ్యం విషయంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని వెల్లడించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. “ఇన్ని రోజులు ఏం అభివృద్ధి చేశావో చెప్పాల్సిన అవసరం లేదు, నేను అభివృద్ధి చేసి చూపిస్తా,” అంటూ ఛాలెంజ్ విసిరారు.
ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

