అటో! ఇటో?
తేలాల్సిందే!
HIGHCOMMAND| అధిష్టానం తేల్చాల్సిందే!!
చూస్తూ ఊరుకునేది లేదు
PARTY| పార్టీ LINE| గీత దాటితే వాతే!
నోటికెంత వస్తే అంతేనా?
ఇసుమంతైనా ఇంగితం లేదా?
బీసీ అయితే చేసిన పాపాలు పోతాయా?
WARANGAL| వరంగల్ MLC| ఎమ్మెల్సీలు, MLA| ఎమ్మెల్యేలు, నేతల సమావేశం
KONDA MURALI| కొండా మురళికి NAINI RAJENDER REDDY| నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్
KADIYAM SRIHARI| కడియం శ్రీహరిది నల్లికుట్ల వ్యవహారం
నా మంత్రి పదవి పోతుందని ప్రచారం
నాయిని అలా అనాల్సింది కాదు : మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
‘విచారిస్తున్నాం’ నివేదిక వచ్చాక స్పందిస్తాం : TPCC CHIEF| టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ లో ‘అతి’ ‘గతి’ తప్పింది. ‘కొండ’ శ్రుతి తప్పింది. మంత్రి ‘మతి’ తప్పిది. పార్టీ ‘జతి’ తప్పింది. మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యల దుమ్ము దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమై మరీ కండఖండాలుగా ఖండించారు. ఈ ‘కొండ’ను మోయలేమని అటో ఇటో తేల్చేయాలని పార్టీ అధిష్టానాన్ని అభ్యర్థించారు. ఫిర్యాదు అందింది. నివేదిక రాగానే తగు విధంగా నడుస్తామని టీపీసీసీ చీఫ్ స్పందించారు. అది జరిగిన గంటల్లోనే మంత్రి కొండా సురేఖ, తగ్గేదే లే! అన్నారు. భర్త మురళి లాగే కడియంపై కారాలు మిరియాలు నూరారు. నల్లికుట్లోడు అంటూ నలుసు పెట్టారు. తమపై మాట్లాడిన నాయిని రాజేందర్ రెడ్డిని అభివ్రుద్ధి నిరోధకుడు అంటూ నిందించారు. అలా మట్లాడాల్సింది కాదన్నారు. మొత్తానికి దేనికైనా రె‘ఢీ’గానే కొండా దంపతులున్నట్లు తేలిపోయింది. ఇక పార్టీ ఏం చేస్తుందన్నదే మిగిలి ఉంది.
హైదరాబాద్, మే 19 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. వరంగల్ డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయిని, నాగరాజు, డీసీసీ అధ్యక్షురాలు స్వర్ణ, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొండా మురళికి వ్యాఖ్యలను ఖండించారు. అనంతరం ఆ నేతలందరితో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘పార్టీ మంచి చెడులపై చర్చలు జరిపాం. ఎవరైనా సరే, పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడకూడదు. ఏమైనా విభేదాలు, భేదాభిప్రాయాలుగాని ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఆ ఆదేశాలు, పార్టీ క్రమశిక్షణ, నియమావళిని మరచి నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఊరుకోదు. మీరు చేసిన పాపాలకు కులాలను అడ్డం పెట్టుకుని వ్యవహరించొద్దు. బీసీ కార్డును వాడితే, చేసిన పాపాలు పోతాయా? రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బీసీ కార్డును అడ్డు పెట్టుకోవడం తగదు. ఇలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సన్న బియ్యం అందిస్తూ, వివిధ పథకాలను ప్రజలకు అందించే పనిలో కుక్కల్లా తిరుగుతున్నాం. పార్టీలో సీనియర్ నాయకులుగా వ్యవహరిస్తూ ఇలా ప్రవర్తించడం సరికాదు. మాట్లాడేటప్పుడు ఇంగితం ప్రదర్శించాలి. దీని (కొండా మురళి మాట్లాడిన మాటల) మీద ఆటో ఇటు తేల్చే విధంగా అధిష్టానానికి రిప్రెజెంటేషన్ ఇస్తాం. ఈ పాపాన్ని మోయలేము, దించేయండి’ అని నాయిని రాజేందర్ రెడ్డి వివరించారు. ఇదంతా కొండా మురళిని ఉద్దేశించే జరిగిందన్నది తెలిసిందే.
అయితే, నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడిన కొద్ది గంటల్లోనే మంత్రి కొండా సురేఖ, మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తగ్గేదేలే? అన్నట్లుగా ఆమె తమ భర్త కొండా మురళి వ్యాఖ్యలను సమర్ధిస్తూ, మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిది నల్లికుట్ల వ్యవహారం అన్నారు. నా మంత్రి పదవి పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు వచ్చినప్పుడు మేమేమీ అనలేదు. మాకు వచ్చినందుకు ఆయన అలా చేస్తున్నాడన్నారు. ఆయన బిడ్డ ఎంపీ అయ్యారు. మా బిడ్డ కాలేదు. మరి మేం ఆయన బిడ్డని దిగిపొమ్మని అనడం లేదు కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు, కడియంకు నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు తమపై మీడియా ముందు మాట్లాడిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఎదురు దాడికి దిగారు. ఆయన అభివ్రుద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలపై అక్కడ యాటలను కోసుకోవడానికి అనుమతిస్తారని తప్పుడు ప్రచారం చేయించాడన్నారు.
ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కొండా మురళి వాఖ్యల వ్యవహారంపై స్పందించారు. తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. విచారణకు ఆదేశించామని, డీసీసీ పరిశీలకుడు నివేదిక ఇవ్వగానే తగు రీతిలో వ్యవహరిస్తామని తెలిపారు.
కొండా వ్యాఖ్యలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షురాలు ప్రత్యేకంగా సమావేశమై, మీడియా ముందు కొండా మురళి వ్యాఖ్యలను కండించినప్పటికీ, వారిని మోయలేమని ఫిర్యాదు చేస్తామని చెప్పినప్పటికీ, అటో ఇటో తేలాల్సిందేనని హెచ్చరించినప్పటికీ కొండా దంపతులు తగ్గినట్లుగా లేదు. పైగా నిన్న కొండా మురళి ఎదురుడాడి చేయగా, ఇవ్వాళ మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగారు. నేరుగా ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ మరోసారి కడియం శ్రీహరిపై, తమపై మీడియాతో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపైనా ఎదురు దాడి చేశారు. అప్పటికే టీపీసీసీ చీఫ్ కూడా స్పందించి ఉన్నారు. హై కమాండ్ ఆదేశాలు లేకుండానే ఎమ్మెల్యేలు స్పందించారని అనుకోలేం. బహుషా కొండా దంపతులు సైతం అన్నిటికీ సిద్ధపడే ఉన్నట్లుగా ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. అటో ఇటో, ఎటో? తాడో పేడో తేల్చుకోవాలని కొండా దంపతులు ప్రిపేర్ అయ్యారా? ఏదేమైనా తగ్గే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నారా? పార్టీ చర్యలు తీసుకోదన్న ధైర్యమా? తీసుకున్నా తమకేమీ కాదన్న స్థైర్యమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పార్టీ నాయకత్వాన్ని, పరిశీలకురాలి పనితీరుని పరిశీలిస్తే కచ్చితంగా క్రమ‘శిక్ష’ణ ఉంటుందన్న అభిప్రాయమే కలుగుతోంది. మొత్తానికి అటో ఇటో… ఎటో ఏదో ఒకటైతే తేలుతుందనేది స్పష్టమవుతున్నది.
కడియం శ్రీహరిది నల్లికుట్ల వ్యవహారం!
నా మంత్రి పదవి పోతుందని దుష్ప్రచారం!!
నాయిని మా ఆయన గురించి అలా అనాల్సిది కాదు
మీడియాతో చిట్చాట్లో మంత్రి కొండా సురేఖ విమర్శలు
కడియం శ్రీహరిది నల్లికుట్ల వ్యవహారం. నా మంత్రి పదవి పోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. నాయిని మా ఆయన గురించి అలా మాట్లాడాల్సింది కాదని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్ లో మంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని ఆరోపించారు. సీఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్లి నా మీద లేనిపోనివి చెబుతున్నారని చెప్పుకొచ్చారు. తెలుగు దేశంలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ సాగదని సురేఖ వ్యాఖ్యానించారు. నా అదృష్టం కొద్దీ నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యారు. నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయింది. ఆమె ఎంపీ పదవి తీయాలని నేను అంటున్నానా? అని ప్రశ్నించారు.
అలాగే, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు. కొందరు తమ సొత్తు అన్నట్లు ఫీల్ అవుతున్నారంటూనే, నాయిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సురేఖ ఫైర్ అయ్యారు.
విచారిస్తున్నాం.. నివేదిక రాగానే స్పందిస్తాం
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరామని, డీసీసీ పరిశీలకుడి నుంచి నివేదిక రాగానే స్పందిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కొండా మురళి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే టీపీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిస్తున్నారు.

