నైట్ వాచ్ మన్ లేరు
స్వీపర్లు ఊడ్చేయరు!
పంతుళ్ళు పట్టించుకోరు?
2 ఏండ్ల కిందే గేట్లు తీసేశారు!
పెట్టిన 2 నెలలకే డిగ్రీ కాలేజీని ఎత్తేశారు!
నాంచారి మడూరుకు మార్చేశారు!
ఖాళీగా గ్రౌండ్ లో కట్టిన కొత్త భవనాలు
గ్రౌండ్ లో లేని సీసీ కెమెరాలు
బడినే బార్ గా మార్చిన మందుబాబులు!
ఆకతాయిలకు అడ్డాగా బడి
మాతృ దేవోభవ! పితృ దేవోభవ!!ఆచార్య దేవోభవ!!! గురువు ఉండే చోటు బడి. బడి గుడితో సమానం. కానీ, బడిగుడి ఏలుబడి లయ తప్పుతోంది. ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో మిగతాతో పోలిస్తే, బడి వాటా అతి తక్కువే! “మన ఊరు – మన బడి”, *అమ్మ ఆదర్శ పాఠశాల” వంటి పథకాలెన్ని పెట్టినా, బడి బర్ బాత్ అవుతున్నది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీస వసతులు కరువైన సదువు సట్టు బండలు అవుతూనే ఉన్నది. ఇప్పటికైనా బడుల సమీక్ష జరగాలి. సదుపాయాలు, సౌకర్యాలు, విద్యార్థులు, టీచర్లు, స్విపర్లు, మొత్తం స్టాఫ్ రేషనలైజేషన్ వంటివి జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఈ తరుణంలో… బడి, తడబడిన పరిస్థితికి పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. చారిత్రాత్మకమైన గుడిలాంటి పాలకుర్తి బడి బందెల దొడ్డిలా మారింది. ఆకతాయిలకు అడ్డా అయింది. మందుబాబులకు మజా చేసుకునే కేంద్రమైంది. అడ్డు అదుపులేని విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలకు అందివచ్చినట్లయింది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఈ ఒక్క ప్రజా పాలనతోనే రాకపోవచ్చు. గత పాలకుల పాపాల ఫలితం కూడా కావచ్చు. కానీ, ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. ఇలాంటి బడులు అనేకం రాష్ట్రంలో ఉన్నాయి.
అది చారిత్రక బడి. 50 ఏండ్ల నుంచీ ఆ బడి నుండి వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారు. ఎంతో మంది ఉన్నత చదువులు చదివారు. అనేక మంది అత్యున్నత పదవులను అధిరోహించి శిఖరాలకు చేరారు. గతమెంతో ఘనకీర్తి. ఉజ్వల భవిష్యత్తు. కానీ వర్తమానమే అత్యంత దారుణంగా మారింది. ఇప్పుడు సదువు కంటే సదుపాయాలే సమస్యగా మారాయి. బడిలో పిల్లలకు టాయిలెట్స్ లేవు. భవనాల సముదాయాలకి గేట్లు లేవు. నైట్ వాచ్ మన్ లేరు. మొన్నటి దాకా స్వీపర్లు లేరు. గ్రామ పంచాయతీ సపాయీ వర్కర్లే ఊడ్చేసేవారు. ఇప్పుడు ఉన్నా స్వీపర్లు పరిశుభ్రంగా ఊడ్చేయరు. వచ్చామా? చెప్పామా? వెళ్ళామా? తప్ప పంతుళ్ళు పెద్దగా పట్టించుకోరు. దీంతో గుడిలాంటి బడి బందెల దొడ్డిలా మారింది. ఇదే అదనుగా బడిని ఆకతాయిలు అడ్డాగా మార్చుకున్నారు. బడిని కాస్తా బార్ లా మార్చుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనువైన చోటల్లా దర్జాగా కూర్చుని బీర్లు లాగేస్తున్నారు. వైన్ ను గుంజేస్తున్నారు. చెత్తా చెదారాన్ని చెల్లా చెదురుగా వేసేస్తున్నారు.
2 ఏండ్ల కిందే గేట్లు తీసేశారు

బడిని అభివృద్ధి చేస్తామని, కొత్త భవనాలు కట్టిస్తామని చెప్పి, కాంట్రాక్టర్ల అవతారమెత్తిన నాయకులు గేట్లు తీసేశారు. ఈ లోగా ఎన్నికలు రావడంతో వదిలేశారు. ప్రభుత్వమే మారింది. పలుకుబడి పోయింది. ఇక బడితో పనేంటని పట్టించుకోవడం మానేశారు. అసలు గేట్లే లేకపోవడంతో యథేచ్ఛగా పందులు, కుక్కలు, మనుషులు, మందుబాబులకు ఇష్టారాజ్యంగా మారింది.
పెట్టిన 2 నెలలకే డిగ్రీ కాలేజీని ఎత్తేశారు

ఇదే పాలకుర్తి బడి గ్రౌండ్ ఆవరణలో ఇంటర్ కమ్ డిగ్రీ కాలేజీని ఆదరబాదరగా ఏర్పాటు చేశారు. అరకొర సదుపాయాలు, చాలీచాలని సౌకర్యాలు, ఉన్నారో లేరో తెలియని విద్యార్థులు, అధ్యాపకులు… ఎందుకు ప్రారంభించారో తెలియదు కానీ, రెండు మూడు నెలలు తిరగకముందే ఆ కాలేజీనీ ఎత్తేశారు. నాంచారి మడూరుకు మార్చేశారు. దాన్నీ ఎవరూ పట్టించుకోలేదు.
ఖాళీగా గ్రౌండ్ లో కట్టిన కొత్త భవనాలు

ఖాళీగా ఉండాల్సిన గ్రౌండ్ కాస్తా ఖాళీగా మిగిలిన భవనాలతో నిండిపోయింది. పిల్లల ఆట స్థలం హాం ఫట్ అయింది. పోనీ, కొత్త భవనాలైనా పిల్లల చదువులకు ఉపయోగపడుతున్నాయా? అంటే అదీ లేదు. పాత భవనాల్లో పాఠాలు నడుస్తుంటే, కొత్త భవనాలు బోసిపోయి, శిధిలావస్థకు చేరుతున్నాయి. గట్టిగా, డోర్లు, కిటికీలు ఊడిపోయేలా ఉన్నాయి. కాంట్రాక్టర్ల పనితనం అంత గొప్పగా ఉంది.
కొత్త భవనాలకు సీసీ కెమెరాలు లేవు

పాలకుర్తి పాఠశాలలోని పాత భవనాలకు సీసీ కెమెరాలు ఉన్నాయి. కొత్త భవనాలకు లేవు. దీంతో కొత్త భవనాలు, గ్రౌండ్ కాస్తా ఆకతాయిలకు, అసాంఘిక కార్యలాపాలకు అడ్డాగా మారాయి.
బడినే బార్ గా మార్చుకున్న మందుబాబులు

గేట్లు లేవు. సిసి కెమెరాలు లేవు. నైట్ వాచ్ మన్ లేడు. అడిగే వారు లేరు. దిక్కు దివానం లేకుండా ఖాళీగా భవనాలు. ఒక భవనం ఫస్ట్ ఫ్లోర్, మరొక భవనం టెర్రెస్ పైకి ఎక్కి మరీ మందుబాబులు మజా చేసుకుంటున్నారు.
పాత క్యాంపస్ లో విద్యార్థులకు టాయిలెట్స్ లేవు
పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ లో 288 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు సహా 21 మంది టీచర్లు, ఇద్దరు స్వీపర్లు ఉన్నారు. అయితే పాత క్యాంపస్ లో ఉన్న టాయిలెట్స్ ని టీచర్లు వాడుతున్నారు. ఇక విద్యార్థుల కోసం లేవు. ఇక కొత్త క్యాంపస్ లో ఉన్న టాయిలెట్స్ ని విద్యార్థుల కోసం వినియోగిస్తున్నారు. 15 రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్ పాఠశాలను సందర్శించి, ‘అమ్మ ఆదర్శ పాఠశాల పథకం’ కింద టాయిలెట్స్, గేటు వంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కానీ అదీ అమలు కాలేదు. ఫైల్ కలెక్టర్ దగ్గరే ఆగిపోయింది. పిల్లలు మాత్రం సమస్యల్లో మగ్గిపోతున్నారు.
ఒకటి రెండు రోజుల్లో సీసీ కెమెరాలు:హెచ్ ఎం వివరణ
పాఠశాల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియ చేస్తున్నామని పాలకుర్తి హై స్కూల్ హెడ్ మాస్టర్ మాచర్ల శోభారాణి ‘అడుగు’ కు తెలిపారు. గేట్లు లేకపోవడంతోపాటు, చుట్టూ ఇండ్లు ఉండటంతో వారు వేస్తున్న చెత్త కొంత, ప్రహారీ గోడ సరిగా లేక కొందరు ఆ గోడలు దూకి కూడా గ్రౌండ్ లోకి ప్రవేశిస్తున్నారని ఆమె వివరించారు. అయినా తాము సిసి కెమెరాలు పెట్టించామని, కొత్త క్యాంపస్ లో కూడా సోలార్ సిసి కెమెరాలను ఒకటి రెండు రోజుల్లో పెట్టిస్తామని తెలిపారు. అలాగే బడిలో మందుబాబుల ఆగడాలపై సిఐ మహేందర్ రెడ్డిని బుధవారం కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఎంఇఓ నర్సయ్యను వివరణ కోరగా, ఈ రోజు ప్రేరణ కార్యక్రమంతోనే ముగిసిందని, రేపు అంటే బుధవారం స్కూల్ ను సందర్శిస్తామని చెప్పారు.
త్వరలోనే బడి సమస్యలకు పరిష్కారం!: ఎమ్మెల్యే యశస్విని

పాలకుర్తి హై స్కూల్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి ని రాజా రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. ‘అడుగు ‘ లో వచ్చిన “పగటి పూట సాగు బడి… రాత్రి పూట తాగు బడి!!” అనే కథనానికి ఆమె స్పందించారు. ఇప్పటికే ఈ విషయమై తాను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా తో మాట్లాడామన్నారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాల పథకం’ కింద నిధులు మంజూరు చేయిస్తున్నామన్నారు. ఈ ఫైల్ జిల్లా కలెక్టర్ దగ్గర ఉందన్నారు. త్వరలోనే నిధులు అందేలా చూడాలని చెప్పామని అన్నారు.
పాలకుర్తికి వచ్చినా, పట్టించుకోకుండా పోయిన కలెక్టర్, డిఇఓ

పాలకుర్తికి వచ్చినప్పటికీ, హై స్కూల్ సమస్యలను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, జిల్లా విద్యాధికారి రమేశ్ లు పట్టించుకోలేదు. అప్పటికే ఈ విషయమై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రాజారామ్ మోహన్ రెడ్డి కలెక్టర్ తోనూ, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ తోనూ మాట్లాడారని తెలిసింది. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రేరణ నింపడానికి వచ్చిన వారు, ఆ విద్యార్థుల, వారు చదువుతున్న హై స్కూల్ సమస్యలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. ఆ తర్వాత పాలకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించి, పరిశీలించిన కలెక్టర్ దృష్టికి హై స్కూల్ సమస్యలు రాకపోవడం దురదృష్టకరం.

