ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక కావాల్సిన అవసరం ఉంది. అదే జరిగితేనే భారత పార్లమెంట్పై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
నేటి నుంచి ప్రారంభమవుతోన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టంగా మారనున్నాయి. గత లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త రాజకీయ సమీకరణాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, బలపడిన ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య జరిగే తొలి ప్రధాన రాజకీయ పోరుకు ఈ సమావేశాలు వేదిక కానున్నాయి. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ సమావేశాలు దేశ సమస్యలకు పరిష్కారాలను చూపుతాయా? రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతాయా?
భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అత్యున్నత వేదిక. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే బాధ్యత ప్రతిపక్షానిదైతే, ప్రజా సమస్యలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత అధికార పక్షానిది. గత కొన్నేళ్ళుగా పార్లమెంట్ సమావేశాల నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 17వ లోక్సభ (2019–2024) కాలంలో పార్లమెంట్ ఉత్పాదకత 97 శాతంగా నమోదైనప్పటికీ, చర్చలకు కేటాయించిన సమయం గణనీయంగా తగ్గిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. అనేక కీలక బిల్లులు గంటల వ్యవధిలోనే ఆమోదం పొందడం, పార్లమెంటరీ కమిటీలకు పంపకుండా చట్టాలు చేయడం చర్చల నాణ్యతపై ప్రశ్నిస్తున్నాయి.
ఈసారి సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని అనేక అంశాలపై నిలదీయాలని నిర్ణయించింది. అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణపై ఆరోపణలు, నీట్ ప్రశ్నాపత్రాల లీక్, విద్యా వ్యవస్థలో అవస్థలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, విదేశాంగ విధానం, అవినీతి ఆరోపణలు, సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులు వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తనుంది. ఇదే సమయంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రాజకీయ చర్చకు కేంద్రబిందువు కానున్నాయి.
2026 తర్వాత తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్న చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరుగుదల కారణంగా లోక్సభ స్థానాల సంఖ్యలో అసమానతలు ఏర్పడతాయన్న వాదనను కూడా విస్మరించలేం. అందుకే డీలిమిటేషన్ వంటి సున్నితమైన అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత సంప్రదింపులు అవసరమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమావేశాల్లో ప్రధాన చర్చ కానుంది. జూన్ 2026 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 3% లోపు ఉన్నప్పటికీ, ఆహార పదార్థాల ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై భారంగా మారుతోంది. మరోవైపు నిరుద్యోగం రేటు 5%–6% మధ్య నమోదవుతుండగా, యువతలో ఉపాధి అవకాశాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయం, భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సమస్యలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
నీట్ ప్రశ్నాపత్రాల లీకులు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. పోటీ పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్ర నియామక పరీక్షలలోనూ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరిగితేనే భవిష్యత్లో సమర్థవంతమైన సంస్కరణలకు అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బిల్లుల సంఖ్య కంటే వాటిపై జరిగే చర్చల నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. చట్టాలు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందుకే పార్లమెంటరీ స్థాయిలో సమగ్ర పరిశీలన, స్టాండింగ్ కమిటీల పరిశీలన, అన్ని పార్టీల అభిప్రాయాల సేకరణ ప్రజాస్వామ్యానికి బలం చేకూరుస్తాయి.
ఇటీవల అఖిలపక్ష సమావేశాలు జరగడం లేదు. అధికార పక్షం పార్లమెంట్లోనే చర్చ జరగాలని భావిస్తుండగా, ప్రతిపక్షాలు ముందస్తు సంప్రదింపులు రాజకీయ ఉద్రిక్తతలను తగ్గిస్తాయని వాదిస్తున్నాయి. ఏ అభిప్రాయం సరైనదైనా, ప్రజాస్వామ్యంలో చర్చకు ప్రత్యామ్నాయం లేదన్నది నిర్వివాదం.
ప్రస్తుతం లోక్సభలో ఎన్డీయేకు మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షం కూడా గతంతో పోలిస్తే బలంగా ఉంది. అందువల్ల ఈ సమావేశాల్లో జరిగే ప్రతి చర్చ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే పార్లమెంట్ లక్ష్యం రాజకీయ ఆధిపత్యం కాదు. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం. రైతుల ఆదాయం, నిరుద్యోగం, ధరల నియంత్రణ, విద్యా సంస్కరణలు, ఆరోగ్య రంగం, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు వంటి అసలు ప్రజా సమస్యలపై చర్చ జరిగితేనే ఈ సమావేశాలు సార్థకమవుతాయి.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక కావాల్సిన అవసరం ఉంది. అదే జరిగితేనే భారత పార్లమెంట్పై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది.

