భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా అదే మార్పులో భాగం. అలాగే చట్టసభలు కొందరి కోసమే అన్న భావన తొలగాలంటే, చట్టసభలలో పారదర్శకత, బాధ్యత, సమాన అవకాశాలు పెరగాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారత ప్రజాస్వామ్యానికి చట్టసభలే పట్టుగొమ్మలు. ప్రజల ఆశలు, సమస్యలు, హక్కులు వంటి వాటిపై పార్లమెంటులో గళమెత్తాలి. కానీ, ఇటీవలి పరిణామాలు చట్టసభలు నిజంగా ప్రజలందరి కోసమే పనిచేస్తున్నాయా, లేక కొందరి ప్రభావంలోనే నడుస్తున్నాయా? అన్న అనుమానాలు కలగక మానవు.
అంబేద్కర్ జయంతి జరుపుకున్న మరుసటి రోజే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలు చర్చకు రావడం ఒక ప్రతీకాత్మక సంఘటన. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దూరదృష్టి గురించి మాట్లాడుకునే సందర్భంలోనే మహిళల ప్రాతినిధ్యం పెంపు అనే కీలక అంశం మళ్లీ పార్లమెంట్ లో చర్చకు రావడం యాదృచ్ఛికం కాదు. కానీ, ఈ చర్చలు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి?
లోక్సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉండగా, కీలకమైన బిల్లులపై చర్చ జరిగిన సమయంలో కేవలం 333 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 210 మంది గైర్హాజరు కావడం సభ్యుల బాధ్యతపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజల తరఫున చట్టాలు చేయాల్సిన వారు, అత్యంత ముఖ్యమైన చర్చల సమయంలో సభకు హాజరు కాకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించాలి.
మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త ఆలోచనేమీ కాదు. దశాబ్దాలుగా ఈ అంశం చర్చల్లోనే ఉంది. అయినప్పటికీ, ఇప్పటికీ అమలుకు రాకపోవడం వెనుక ప్రధాన కారణం రాజకీయ సంకల్పం లోపించడమే! ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం, లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుండి 816కు పెంచి, అందులో 33 శాతం అంటే 273 సీట్లను మహిళలకు కేటాయించాలని యోచిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రస్తుతం ఉన్న పురుష సభ్యుల స్థానాలను తగ్గించకుండా మహిళలకు అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం.
అయితే ఈ ప్రతిపాదనను డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం మరో వివాదానికి దారితీసింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రాల మధ్య సంఖ్యా బలాలు మారే అవకాశముంది. ముఖ్యంగా జనాభా ఆధారంగా సీట్లు పెరగడం వల్ల కొన్ని రాష్ట్రాలకు లాభం, మరికొన్నింటికి నష్టం కలగవచ్చు. అందుకే అనేక పార్టీలు ఈ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఇక రాజకీయ వ్యవస్థలో కుటుంబ ఆధిపత్యం మరో కీలక అంశం. అనేక పార్టీల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో గాంధీల కుటుంబం, బీజేపీలో పరివారం, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నింట్లోనూ కుటుంబ పాలన సర్వసాధారణమైంది. ఇది ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధం. ఓటర్లు ఎన్నుకుంటున్నారనే వితండవాదం ఉన్నప్పటికీ, పార్టీ టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వల్ల కొత్త నాయకులకు అవకాశాలు తగ్గుతున్నాయి.
ఇదే నేపథ్యంలో “రెండు పదవీకాలాల పరిమితి” అనే ప్రతిపాదన ప్రస్తావనకు వస్తోంది. ఒక వ్యక్తి గరిష్టంగా రెండు సార్లు మాత్రమే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉండేలా చట్టం తీసుకురావాలనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విధానం అమలైతే కొత్తతరం నాయకత్వానికి మార్గం సుగమమవుతుంది. అయితే అనుభవజ్ఞుల సేవలు కోల్పోయే ప్రమాదం, ప్రజల ఎంపిక స్వేచ్ఛపై ప్రభావం వంటి అంశాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు మాటలలో మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. సీట్ల కోత భయం, సామాజిక సమీకరణల ఒత్తిడి ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఈ బిల్లు అమలుకు డీలిమిటేషన్ అనే మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది.
సమస్యలు వ్యక్తుల్లో మాత్రమే కాదు, పార్టీలు, రాజకీయ, చట్టసభలు, పరిపాలనా వ్యవస్థల్లోనూ ఉన్నాయి. చట్టసభల పనితీరు మెరుగుపడాలంటే ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావాలి. సభలకు హాజరు, చర్చల నాణ్యత, చట్టాల ప్రభావాలను ప్రజలు పరిశీలించి నాయకులను ప్రశ్నించాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి.
భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా అదే మార్పులో భాగం.
చట్టసభలు కొందరి కోసమే అన్న భావన తొలగాలంటే, చట్టసభలలో పారదర్శకత, బాధ్యత, సమాన అవకాశాలు పెరగాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

