INTERNATIONAL|అంతర్జాతీయ స్థాయి EDUCATIONAL CENTRE|విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం
OSMANIA UNIVERSITY|ఉస్మానియా యూనివర్సిటీలో CM|సీఎం రేవంత్ రెడ్డి|REVANTH REDDY
స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకు వచ్చినందుకు గర్వంగా ఉందని, ఇక్కడికి రావడానికి ధైర్యం కాదు… అభిమానం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుండెల నిండా ప్రేమతో, విశ్వవిద్యాలయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని వచ్చానని, ఉస్మానియాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ నేల ఎప్పటికీ పౌరుషం, తిరుగుబాటు స్వభావానికి ప్రతీకగా నిలిచిందని, ఆధిపత్యం చెలాయించాలనుకునే ప్రతి ప్రయత్నానికి ఈ నేలలోనే ప్రతిఘటన పుట్టిందని చెప్పారు. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తాజా తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రజా ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ముందున్నారని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఉద్యమ సమయంలో ఓయూ, కేయూ వేదికలపై విద్యార్థులు పోరాడి చరిత్ర నిర్మించారని అన్నారు.
పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి మహనీయులను దేశానికి అందించిన ఘనత ఓయూదే అని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యూనివర్సిటీనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా, ఓయూను బలహీనపరిచే ప్రయత్నాలే జరిగాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు సాధ్యమని రేవంత్ రెడ్డి అన్నారు.
తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడినని, విదేశీ భాషలు రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవగలనని, పేదల కోసం పరిపాలన చేయగలనని తెలిపారు. ప్రజల సొమ్ముతో ఫామ్ హౌసులు కట్టుకోలేదని, పేద బలహీన వర్గాల ఆశీర్వాదాలతోనే ముఖ్యమంత్రి అయ్యానని స్పష్టం చేశారు. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
రెండేళ్లలో చేసిన పనులను గుర్తుచేసిన సీఎం జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించడం, బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన పూర్తి చేయడం వంటి నిర్ణయాలను వివరించారు. కేంద్ర జనగణనలో కులగణనకు మార్గం సుగమం చేసిన ఘనత తెలంగాణకే దక్కిందని చెప్పారు. భూములు లేవని నిస్సందేహంగా చెప్పినందుకు విమర్శిస్తున్నారని, అదే సమయంలో వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్న వాళ్లు పదేళ్లలో దళితులకు మూడు ఎకరాలు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు.
భూమి లేకపోవడం పేదరికానికి సూచిక కావొచ్చని, కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనానికి సంకేతమని తెలిపారు. నాణ్యమైన విద్య అందరికీ అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, విద్య మాత్రమే తలరాత మార్చే శక్తి ఉందని గుర్తుచేశారు. కులవివక్షను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నామని, యువత నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడా ప్రతిభను వెలికితీయడానికి 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేశామని తెలిపారు. అనంద్ మహీంద్రా వంటి గొప్ప వ్యక్తులను బోర్డుల్లో నియమించడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
పేదలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే తన తపన అని, అందుకే రూ.1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. ఇంగ్లీష్ భాష నాలెడ్జ్ కాదు, కమ్యూనికేషన్ మాత్రమేనని, నాలెడ్జ్, నిబద్ధత ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు, ఇందులో రాజకీయ జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
ఉస్మానియా తెలంగాణ గుండెకాయ అని, ఇక్కడి విద్యార్థులు రాజకీయ పార్టీల వలలో పడకూడదని సీఎం సూచించారు. కష్టపడితే తప్పకుండా విజయం సాధించవచ్చని నమ్మకం వ్యక్తం చేశారు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఉన్నతాధికారులుగా మాత్రమే కాక, ఈ యూనివర్సిటీ నుంచే భవిష్యత్ నాయకులు ఎదిగి రాష్ట్రాన్ని పరిపాలించాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

