దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని గణాంకాలు విడుదల చేస్తుంటే, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ విరుద్ధ విచిత్ర పరిస్థితి ప్రభుత్వ ప్రకటనలకూ, భూమి మీద క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతనలేని భారీ అంతరాన్ని బయటపెడుతోంది.
ప్రస్తుతం వరి కోతలు పూర్తయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు సమయానికి కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతుల కష్టాన్ని పూర్తిగా నీళ్లలో కలిపేశాయి. తెలంగాణలో మంథని, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాల దెబ్బకు వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా నాణ్యత కోల్పోయింది.
రైతుల ఆవేదనలో నిజం ఉంది. కోతలు పూర్తయ్యాక 10 నుంచి 15 రోజుల పాటు కొనుగోళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అధికారులు తగిన సంఖ్యలో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకపోవడంతో కొనుగోళ్లు నెమ్మదిస్తున్నాయి. ఫలితంగా ధాన్యం యార్డుల్లో పేరుకుపోతోంది. సమయానికి కొనుగోలు జరిగి ఉంటే అకాల వర్షాల కారణంగా ఈ స్థాయిలో నష్టం వాటిల్లేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం వేరేలా ఉన్నాయి. కొన్నిచోట్ల రైతులు ధాన్యం కుప్పల వద్దే రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర నిరాశతో రైతులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ సమస్య కేవలం వరి వరకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా పంటల మార్కెట్ వ్యవస్థలో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అదే సమయంలో వినియోగదారుడు కూడా తక్కువ ధరలకు సరుకులు పొందడం లేదు. మధ్యలో లాభపడేది మాత్రం దళారులు, నిల్వదారులు, పెద్ద వ్యాపారులు, వ్యాపార సంస్థలే.
గోధుమల పరిస్థితి కూడా ఇందుకు భిన్నమైందేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఏడాదికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.2,585గా నిర్ణయించింది. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో హోల్సేల్ మార్కెట్లలో గోధుమ ధర కిలోకు రూ.23 నుంచి రూ.25 మధ్య మాత్రమే పలుకుతోంది. అంటే రైతులు కనీస మద్దతు దర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. మరోవైపు రిటైల్ మార్కెట్లో గోధుమపిండి ధర మాత్రం కిలోకు రూ.36 నుంచి రూ.40 వరకు ఉంది. బ్రాండెడ్ పిండి అయితే రూ.50 దాటుతోంది. రైతుకు ధర తగ్గినా వినియోగదారుడికి ప్రయోజనం ఎందుకు చేరడం లేదు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.
సాధారణంగా ముడి సరుకు ధర తగ్గితే తుది ఉత్పత్తి ధర కూడా తగ్గాలి. కానీ భారత మార్కెట్ వ్యవస్థలో అది కనిపించడం లేదు. గోధుమల ధర పెరిగినప్పుడు పిండి కంపెనీలు వెంటనే ధరలు పెంచుతాయి. కానీ ధరలు తగ్గినప్పుడు అదే వేగంతో తగ్గించవు. ఈ తేడా మొత్తం లాభాల రూపంలో మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఇదే పరిస్థితి వరి, మక్క, పప్పుధాన్యాలు సహా అనేక పంటల్లో కనిపిస్తోంది.
పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు బలంగా ఉండటంతో రైతులకు కనసీ మద్దతు ధర సమీప ధరలు లభిస్తున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు వ్యవస్థ బలహీనంగా ఉండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ అసమానత దేశవ్యాప్తంగా రైతుల ఆదాయంలో భారీ వ్యత్యాసాలకు దారితీస్తోంది.
వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ధరల పర్యవేక్షణ విభాగం ఉన్నప్పటికీ మార్కెట్లో జరుగుతున్న అక్రమ ధరల నియంత్రణలో అది ప్రభావవంతంగా వ్యవహరించడం లేదు. రైతు నుంచి వినియోగదారుడి వరకు సరఫరా వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే కేవలం మద్దతు ధరలు ప్రకటించడం సరిపోదు. సమయానికి కొనుగోళ్లు, శాస్త్రీయ నిల్వ వ్యవస్థలు, వేగవంతమైన రవాణా, మార్కెట్ సంస్కరణలు, మధ్యవర్తుల నియంత్రణ వంటి చర్యలు సమగ్రంగా అమలు కావాలి. అకాల వర్షాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు, రైతులకు తక్షణ పరిహారం అందించే వ్యవస్థ కూడా బలోపేతం కావాలి.
అన్నదాత దేశానికి వెన్నెముక అని ప్రతి ప్రభుత్వం చెబుతుంది. కానీ రైతు పండించిన పంటను సమయానికి కొనలేని వ్యవస్థ ఉంటే ఆ మాటలకు అర్థం ఉన్నట్లేనా? రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర. ఈ రెండింటి మధ్య సమానత, సమన్వయం తీసుకురావడమే నిజమైన వ్యవసాయ విధానం. లేకపోతే ప్రతి పంట సీజన్ రైతుకు ఆశ కంటే ఆందోళననే మిగులుస్తుంది.

