Government ముందడుగు-సీఎం|CM రేవంత్ రెడ్డి|REVANTH REDDY

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడుతూ, ఇది నాలుగు కోట్ల ప్రజల కల నెరవేరిన గర్వదాయకమైన రోజు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు, మహిళలు, కవులు, కళాకారులు, మేధావులు – ప్రతి వర్గం పోరాడింది. ప్రజల ఆకాంక్షలకే రూపం తెలంగాణ అని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ కాంగ్రెసు అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారికి ఘన నివాళులు అర్పించారు.

2014లో రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. గత డిసెంబర్ 7న ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అప్పటి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణానికి నిబద్ధతతో ముందుకు సాగుతున్నామన్నారు.
మహిళా సంక్షేమమే బలమైన బాట
“మహిళలే సమాజానికి పునాది” అనే నినాదంతో ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా పలు కీలక చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. ఇందిరా మహిళా శక్తి మిషన్, ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఆధ్వర్యంలోని క్యాంటీన్లు, సిలిండర్ను రూ.500కే అందించే మహాలక్ష్మి పథకం వంటి పథకాలను గుర్తు చేశారు.
రైతుకు రుణ విముక్తి – 20,617 కోట్ల మాఫీ
రైతుల సంక్షేమాన్ని ధ్యేయంగా మిగిలిన ప్రభుత్వం ఇప్పటికే 25.35 లక్షల మందికి రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఉచిత విద్యుత్, రూ.12 వేలు పెట్టుబడి సాయం, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూ.500 బోనస్ అందించడం వల్ల రాష్ట్రం దేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు.
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతోపాటు, 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను రూ.11,600 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిని పునర్నిర్మాణం చేసి రూ.2,700 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు.
బీసీలకు 42% రిజర్వేషన్, కుల గణనతో దిశానిర్దేశం
తెలంగాణలో బీసీల జనాభా 50.36 శాతంగా తేలడంతో వారికీ 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లులు ఆమోదించినట్టు తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చట్టబద్ధత కల్పించామన్నారు.
ఉజ్వల తెలంగాణ కోసం పెట్టుబడులు, మౌలిక వృద్ధి
ఐటీ దిగ్గజాల విస్తరణతో పాటు, ఫ్యూచర్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్టులు, మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. ఇప్పటికే మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వివరించారు.
భద్రతకు పెద్ద పీట – తెలంగాణ పోలీస్ దేశంలో నెం.1
డ్రగ్స్ నిరోధానికి చర్యలు తీసుకున్నామని, హైదరాబాద్ నార్కోటిక్ విభాగానికి అంతర్జాతీయ అవార్డు దక్కిందని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు.
సంక్షేమ పథకాలలో తెలంగాణ ప్రత్యేక స్థానం
ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాలతో పేదల ఆకలి తీర్చడమే కాకుండా, ఆత్మగౌరవాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుంటుంది అని అన్నారు.
ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా ఉటంకించారు. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి, న్యాయం, సాధికారత అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

