ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ కార్మికుల సంక్షేమమే మా లక్ష్యం
రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్మిక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి దారి చూపుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఎంత మార్పులు వచ్చినా కార్మికుల ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు.
తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్రను కొనియాడిన ఆయన, ఈ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలవగలిగిందంటే, కార్మికుల సహకారమే ప్రధాన కారణమని తెలిపారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇవ్వడంలో ప్రజా ప్రభుత్వం ముందుండిందని గుర్తు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్య పాలన వల్ల విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరిందని, ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం నష్టాలను తగ్గిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అసంఘటిత కార్మికుల కోసం త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఈ పాలసీ దేశానికి రోల్ మోడల్గా నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, వారి పాలనలో 50 వేల కోట్ల బిల్లులు పెండింగ్గా ఉండగా, మొత్తం 8 లక్షల 29 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని వదిలేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూడేళ్లలోనే కూలిపోయే పనులు చేశారన్న ఆయన, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చివరికి ఆ హామీని విస్మరించిన కపట నాయకత్వాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబోధిస్తూ సమ్మె ఆలోచనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోంది అని ఆయన తెలిపారు. ఈ సంస్థను ఆదుకునే బాధ్యత కార్మికులదేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఆర్టీసీ విధ్వంసానికి గురైందని, ఆర్ధిక దోపిడీ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
సమ్మె ద్వారా రాష్ట్రానికి నష్టం కలుగుతుందని హెచ్చరిస్తూ, ఎలాంటి సమస్యలైనా సంబంధిత మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. “వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేయాలో మీరే సూచించండి. నేను అణా పైసా ఇంటికి తీసుకెళ్లేది లేదు. అన్నీ మీ కోసమే ఖర్చు చేస్తాం,” అని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా, నిజం ఏమిటో చెబడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సమ్మె పోటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. “ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. మరో ఏడాదిలో కాస్త కుదురుకుంటుంది,” అని సీఎం చెప్పారు.
గతంలో ఏమీ చేయని వారు ఇప్పుడు మళ్లీ వచ్చి మాటలు చెప్పినా వారి వలలో పడకూడదని ఆర్టీసీ కార్మికులను కోరారు. “వారి విషపు చూపుల్లో చిక్కుకోకండి. మీరు నన్ను నమ్మండి. నన్ను నమ్మిన మీకు నేను అండగా ఉంటాను,” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సద్దుబాటులోకి వస్తుందని, మరో ఏడాదిలో కొంత స్థిరపడుతుందని తెలిపారు. గతంలో పాలించిన వారు ఇప్పుడు తిరిగి వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. “వారి విషపు చూపుల్లో చిక్కుకోకండి. నన్ను నమ్మండి. మీకు నేను అండగా ఉంటా,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు.

