పాలకుర్తి నియోజకవర్గకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు, అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత శ్రీ జైపాల్ రెడ్డి 83వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారి చిత్రపటానికి పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ప్రజాసేవా తత్పరతను, పార్లమెంటరీ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, ఆయన ప్రజల సంక్షేమం కోసం చేసిన అనేక సేవలను గుర్తు చేశారు. అలాగే జైపాల్ రెడ్డి దేశం కోసం చేసిన కృషి, ప్రజల అభ్యున్నతికి చేసిన చర్యలు, వారికి ప్రజా నాయకత్వంలో అద్భుతమైన మార్గదర్శకత్వం ఇచ్చాయని చెప్పారు.

నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… జైపాల్ రెడ్డి ఆశయాలను యువతకు స్ఫూర్తిగా నిలిచేలా ఉండాలని పేర్కొన్నారు. ‘‘జైపాల్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, ఆయన జీవితం యువతకు పెద్ద ఆదర్శంగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల నాయకులు, యువజన సంఘాలు, మహిళా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


