ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!!
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తీవ్రం
అడుగంటుతున్న జలాశయాలు
జీవ నదుల్లోనూ జల జీవమే లేదు
రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి
సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు
ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ
20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు
బోరుబావుల కింద వరి సాగూ కష్టమే?
హైదరాబాద్, జూలై 16 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో ప్రధాన నదులు, జలాశయాలు జలకళను కోల్పోయి అడుగంటుతున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు వాటి పూర్తి సామర్థ్యంలో కనీసం మూడో వంతు కూడా లేకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కొద్దిరోజుల పాటు వచ్చిన అరకొర వరద నీరు కూడా క్రమంగా తగ్గిపోతుండటంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రుతుపవనాలు కదలిక లేకపోవడం, వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రధాన జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి శాతం పడిపోవడంతో సాగు, తాగునీటి అవసరాలకు గండం పొంచి ఉందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
ముఖ్యంగా గోదావరి బేసిన్ పరిధిలోని 57 జలాశయాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 418.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 94.72 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 108 టీఎంసీల నీరు ఉండగా, ఈసారి అంతకంటే తక్కువకు పడిపోవడం గమనార్హం. గత పదేళ్ల సగటు నిల్వ అయిన 151.62 టీఎంసీలతో పోల్చి చూస్తే ప్రస్తుత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గత వారం, పది రోజులుగా గోదావరి బేసిన్లో వస్తున్న వరద గణనీయంగా తగ్గిపోవడంతో మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో కేవలం 16 వేల క్యూసెక్కులకు పడిపోయింది. అలాగే సమ్మక్క బ్యారేజ్ వద్ద 27 వేల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 29 వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదవుతుండటం నది ఎండిపోతుందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మరోవైపు కృష్ణా బేసిన్లోనూ దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని 30 జలాశయాల మొత్తం సామర్థ్యం 640.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 240.37 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది జలాశయాల పూర్తి సామర్థ్యంలో కేవలం 38 శాతం మాత్రమే. గోదావరి బేసిన్తో పోలిస్తే కృష్ణా బేసిన్ పరిస్థితి కొద్దిగా మెరుగ్గా అనిపించినప్పటికీ, గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే ఇది దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. గత పదేళ్ల సగటు నిల్వ అయిన 277.64 టీఎంసీలతో పోల్చినా ప్రస్తుత నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రావాల్సిన ప్రవాహాలు కూడా క్రమంగా క్షీణిస్తున్నాయి.
కర్ణాటకలోని కీలకమైన ఆల్మట్టి జలాశయంలోకి ఇన్ఫ్లోలు 15 వేల క్యూసెక్కులకు పడిపోగా, తుంగభద్ర జలాశయంలోకి వస్తున్న ప్రవాహం 10 వేల క్యూసెక్కుల కంటే దిగువకు పడిపోయింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో కృష్ణా బేసిన్లోని జలాశయాలు వేగంగా నిండే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. సాధారణంగా వర్షాకాలం ముదిరిన ఈ నెలలో జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకోవాల్సి ఉండగా, ఈసారి ఎల్నినో సృష్టించిన వాతావరణ మార్పుల వల్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా, ఆందోళనకరంగా మారింది. వర్షాల కోసం అన్నదాతలు, ప్రజలు ఆకాశం వైపు చూస్తుండగా, జలాశయాల అడుగడుగునా కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

