-
శ్రీ సీతారాములు నడయాడిందిక్కడే!
-
రామాయణ కావ్యానికి బీజం పడిందిక్కడే!!
-
వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి ఇదే!!!
-
శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఏటా నవరాత్రోత్సవాలు
✍🏻డా.మార్గం లక్ష్మీనారాయణ
వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అక్షింతలు పడితేనే, భద్రాచలంలో సీతారాముల పెండ్లి అవుతుందని ప్రతీతి! ఇది వల్మీడి రాములోరి గుడికి ఉన్న ప్రత్యేకతకు ప్రతీక. రాముడి చరితను రామాయణ కావ్యంగా రాసిన ఆదికవి వాల్మీకి పుట్టిన ఊరు వాల్మీకిపురమే ఈ వల్మీడి కావడం విశేషం!! అత్యంత మహిమాన్వితం, చారిత్రకం, అధ్యాత్మికమైన ‘వాల్మీకి-వల్మీడి-సీతారాముల కళ్యాణం’ పై శ్రీరామ నవమి సందర్భంగా ‘అడుగు’ అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
ఆది కావ్యం రామాయణాన్ని సంస్కృతంలో రాసిన వాల్మీకి ఆదికవి. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాతది. దేవనాగరి భాష అనబడే సంస్కృతంలో రచించబడింది. రామాయణంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశంలోని అన్ని భాషలేగాక, ప్రపంచం నలుమూలలా రామాయణం పూజనీయం, అనుసరణీయం, ఆచరణనీయం.

రామాయణ కావ్య సృష్టి కర్త వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వాల్మీకి పురం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఉంది. పాలకుర్తికి 5 కి.మీ. దూరంలోని వల్మీడికి దక్షిణ దిక్కున మరో కీ.మీ. దూరంలో రెండు గుట్టలు ఉన్నాయి. ఒకటి మునులు గుట్ట. మరొకటి రాములోరి గుట్ట. ఈ రెండు గుట్టల మధ్య వెలసిందే వాల్మీకి పురం. ఈ వాల్మీకి పురానికి చెందిన వాడే వాల్మీకి మహర్షిగా ఇక్కడి వారు చెప్పుకుంటారు. మునుల గుట్ట మీద మునులు తపస్సు చేసుకునే వారట! రాములోరి గుట్ట మీద రాముడు సీతా, లక్ష్మణుల సమేతంగా ఉండేవారట!! అలా ఆ గుట్ట మీద ఇప్పటికీ ఉన్న పాలగుండంలో స్నానమాచరించేవారని, ఆ గుండం ఎదురుగా స్వయంభుగా వెలిశారన్నది ఇతిహాసం. ఇక రాముడి పాదాల ఆధారాలను బట్టి ఇదే గుట్ట మీద రాముడు సంచరించాడని భక్తుల నమ్మిక.

ఇక వాల్మీకి మునుల గుట్ట మీద తపస్సు చేశాడట. దీంతో ఆయన చుట్టూతా పెద్ద వాల్మీకం అంటే… పుట్ట ఏర్పడిందట! ఆ కారణంగా కూడా ఈ ప్రాంతానికి వాల్మీకి పురం అని పేరు ఏర్పడి ఉండవచ్చు. వాల్మీకి పురం ప్రకృతి వైపరీత్యాలు వంటి ఏ కారణాల వల్ల కాల గర్భంలో కలిసిపోయిందో కానీ, ఆ తర్వాత అక్కడి ప్రజలంతా ఆ గుట్టలకు ఉత్తర దిక్కున ఓ గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఆ గ్రామమే వల్మీడి. వాల్మీకి పురమే కాల క్రమంలో వల్మీడిగా నిలిచింది.

మరో కథనం ప్రకారం
రాముడు, సీతా సమేత, లక్ష్మణ సహితంగా ఇక్కడే ఉన్నాడని, లవకుశులు కూడా ఇక్కడే పుట్టారని, వారిని అక్కున చేర్చుకుని వాల్మీకి ఆదరించారని కూడా పూర్వీకులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయా పురాణాలకు, గాథలకు ఆధారంగా ఈ గుట్టలు, పుట్టలు, చెట్లు చేమలు, రాముడి గుడి, ఆయన పాదాలు, కోనేరు అన్నీ మనకు నేటికీ కనిపిస్తున్నాయి. కాగా, రాముడు, వాల్మీకి నడయాడిన నేలలో మనం ఉన్నందుకు ధన్యులం. ఆ వాల్మీకి మన వాడు కావడం మనందరికీ గర్వకారణం, పుణ్యం, పూర్వ జన్మ సుకృతం.
వల్మీడి తర్వాతే భద్రాచలంలో సీతారాముల పెండ్లి!
కాగా, ప్రతి ఏటా శ్రీరామ నవమి నాడు వల్మీడి గుట్ట మీద సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడి వల్మీడి గుట్టమీద అక్షింతలు పడ్డ తర్వాతే, అక్కడ భ్రదాచలంలో సీతారాములు కళ్యాణం జరుగుతుందని చెప్పుకుంటుంటారు. ప్రతి ఏటా భద్రాచలం కంటే ముందే ఇక్కడ సీతారాము కళ్యాణం పూర్తవుతుంది. అలాగే నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే!!
ఇక రామ నామం సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మకం. తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది. రామ నామంలో పంచాక్షరీ మంత్రం “ఓం నమశ్శివాయ” నుండి ‘మ’ బీజాక్షరం, అష్టాక్షరీ మంత్రం “ఓం నమో నారాయణాయ” నుండి ‘ర’ బీజాక్షరం పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తారు. మూడు మార్లు “రామ” నామాన్ని స్మరిస్తే, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం చేసిన ఫలం లభిస్తుందని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
రామాయణానికి బీజం పడిందిక్కడే
అయితే, వాల్మీకి బోయవాడు. వేటగాడు. ఒకనాడు వాల్మీకి దగ్గరకు నారదుడు వచ్చాడట. అప్పుడు వాల్మీకి, నారదుడిని అడిగాడట…. ‘‘అయ్యా! ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నడా..?’’ ఉంటే అతని గురించి చెప్పు అని అడిగాడట! అంతే కాదు…‘‘దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు… అలా 16 గుణములు ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా?’’ అని వాల్మికి మహర్షి నారదుడిని అడిగాడట! అప్పుడు నారదుడు… ‘‘అన్నిగుణములు గొప్ప చక్రవర్తులకే సాధ్యం కాదు. ఇక మామూలు మనుషుల సంగతి చెప్పలేమన్నాడట!’’ కానీ, అలాంటి ఒక మనుష్యుడు… ఇక్ష్వాకుల వంశ రాజు రాముడి గురించి చెప్పాడట. ‘‘రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అపారమైన సంకల్పశక్తి కలవాడు. ఇంద్రియములను జయించినవాడు. అన్ని విద్యలు తెలిసినవాడు. ఐశ్వర్యవంతుడు. శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు. ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు. సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు. హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువయా..’’ అని 100 శ్లోకాలలో చెప్పాడట!
శోకంలోంచి శ్లోకం!
ఆ మరునాడు వాల్మీకి తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళుతుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణంతో కొట్టాడు. అది విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి ముని హృదయం ద్రవించి వెలువడిన మాటలు చందోబద్ధంగా ఉన్నాయట. ఆ శోకమే మొదటి శ్లోకమైంది!
రామాయణంలో 24వేల శ్లోకాలు, 7 కాండాలు
ఆతర్వాత రామాయణం 24వేల శ్లోకాలతో, 7 కాండాలతో ముగిసింది. బాల కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండ, ఉత్తర కాండ తర్వాత రామావతార సమాప్తి ఉంది. ఇక ఆ 24వేల శ్లోకాలలో శతకోటి అక్షరాలున్నాయి. ఆ విధంగా రామాయణం మహా కావ్యం అయింది! కాండం అనగా చెరకుగడ కణుపు అని అర్ధం. రామాయణ కథనం చెరకు వలె మధురమైనది. గనుక, ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు.
ప్రముఖ సాహిత్య, సాంస్కృతిక, అధ్యాత్మిక, చారిత్రక పర్యాటక కేంద్రంగా పాలకుర్తి
ఇదిలావుండగా, తొలి తెలుగు మహాకవి, ఆదికవి పాల్కురికి సోమనాథుడు పాలకుర్తిలో పుట్టాడు. సుమధుర సహజకవి బమ్మెర పోతన పాలకుర్తికి 3.కి.మీ. దూరంలోని బమ్మెరలో పుట్టాడు. కవులకు కాణాచిగా పాలకుర్తి ప్రాంతం. కానీ, ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. చరిత్ర నిర్వీర్యం చేయబడింది. తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతాన్ని ప్రముఖ సాహిత్య, సాంస్కృతిక, అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తున్నారు. రూ.51 కోట్లతో వల్మీడి దేవాలయాన్ని, రూ.45 కోట్లతో పాలకుర్తి దేవాలయాన్ని, రూ.16 కోట్లతో బమ్మెర పోతన ప్రాంగణాన్ని, రూ.4 కోట్లతో శ్రీ వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని, రూ.2 కోట్లతో చెన్నూరు త్రికూటాలయాన్ని, రూ.20 కోట్లతో సన్నూరు శ్రీ వేంకటేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి పరిచే పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి.
చరిత్రకారులు, పర్యాటకులు, సాహిత్యాభిలాషులు, ఆద్యాత్మికవేత్తలు, భక్తులు, ప్ర్రకుతి ఆరాధకులు, పరిశోధకులకు అనువైన, అధ్యయనం చేయదగివన, సందర్శనీయమైన ప్రాంతం పాలకుర్తి.

✍🏻డా.మార్గం లక్ష్మీనారాయణ

