ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో ఇంతకాలంగా జరిగిన జీఎస్టీ దోపిడీ కట్టడి అయినట్లేనా? పన్ను విధించిన ప్రభుత్వమే పదేళ్ళ తర్వాత ఆ పన్నును సవరించడం సంతోషించాల్సిందే. కానీ, ఇప్పటిదాకా ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన పన్నులకు ఎవరు సమాధానం చెబుతారు? ప్రజలను పీల్చి పిప్పి చేసి, లబోదిబో మంటున్నా వినకుండా గత దశాబ్ద కాలంలో లక్షల కోట్లు గుంజుకున్నారు. ఇప్పుడు జీఎస్టీ హేతుబద్దీకరించి, కొంతమేర తగ్గించి జబ్బలు చరుచుకుంటున్నారు. జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పుడే హేతుబద్దత గురించి అన్ని వర్గాల ప్రజలు నాయకులు అనేక వినతులు చేసినా పెడచెవిన పెట్టారు. అధికారం ఉంది కదాని ఇష్టానుసారం పన్నులు పెంచారు. ముక్కుపిండి వసూలు చేశారు. ఆర్థికవృద్ధి మందగించడం, గృహ రుణాలు పేరుకుపోవడం, పొదుపు క్షీణించడం, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ట్రంప్ టారిఫ్లే జీఎస్టీ రేట్ల మార్పునకు కారణంగా కనిపిస్తున్నది. దేశం ఆర్థిక శక్తిగా ఎదగడానికి పన్నుల విధానం తోడ్పడాలే కానీ, గుదిబండ కాకూడదు.
నిజానికి పన్నులు హేతుబద్దంగా ఉండాలి. భారతదేశం లో పేద మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. వారి జీవితాలు, జీత భత్యాలు అంతంత మాత్రమే. వీటిని గుర్తించకుండా 18శాతం, 28శాతం వరకు జీఎస్టీ పేరుతో వసూళ్లు చేశారు. ఇప్పుడేమో సంస్కరణలు ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ‘మా ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. ఈ విషయం ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని అనడం నయ వంచనే. కరోనా సమయంలో ప్రజలు హాహాకారాలు చేసినా జీఎస్టీ తగ్గించాలని గుర్తుకు రాలేదు. ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం, వాటి అమలు కోసం పన్నులు వసూలుచేసి పందేరం చేయడమేనా పాలన అంటే. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా కట్టగలిగేలా పన్నుల విధానం ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ సహా, నల్లడబ్బు రూపంలో తరలకుండా సరళీకృత పన్ను విధానాలు ఉండాలి.
సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, జీఎస్టీ మండలి ఆమోదించింది. చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
దేశంలో ప్రతిసారి దసరా, దీపావళికి ముందే పండుగ వస్తోంది. పండుగ సరుకులన్నీ అగ్గువకే అంది వస్తాయని అంటున్నారు. మనదేశంలో 5శాతం గరిష్ట పన్నుల విధానం సరిపోతుంది. ప్రతి ఒక్కరూ పన్నులు కట్టేలాగా, అవి దేశ అభివృద్దికి వినియోగించేలా ఉండాలి. ప్రస్తుత సరళీకరణతో పాలు, పనీర్, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తాయని అంటున్నారు. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులు ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దుతోపాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతమున్న 12శాతం పన్నును పూర్తిగా తొలగించారు.
కరోనా తరవాత ఔషధాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబ్లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న నిర్మలా సీతారామన్ చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు.
అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి, పండగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది.
ఔషధరంగాన్ని కట్టడి చేయాలి. ధరలను పెంచుతున్న ఫార్మా కంపెనీలకు ముకుతాడు వేయాలి. నిర్మాణ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అమెరికాను సుంకాలపై తిడుతూ మనమే మన ప్రజలపై అత్యధిక సుంకాలను విధించుకోవడం సరికాదు. విమానయాన రంగం ప్రజలకు మరింత చేరువ కావాలి. ప్రస్తుత విమాన టిక్కెట్ ధరలను సమీక్షించాలి. ఇందుకు ముందుగా రాజకీయంగా ఖర్చులు తగ్గించు కోవాలి. జీత భత్యాలను తగ్గించాలి. రాజకీయ నాయకుల పెన్షన్లు ఎత్తేయాలి. రాజకీయ ఖర్చులు, అవినీతి కారణంగా దేశం భ్రష్టుపడుతున్న వేళ సంస్కరణలు ఈ దిశగా సాగాలి. రాష్ట్రాల్లో ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటించడం, జీఎస్టీ డబ్బుల కోసం కేంద్రం వద్ద యాచించడం రాష్ట్రాలు మానుకోవాలి. ప్రజలను పీడించి పన్నులు వేయడం సరి కాదని గుర్తించాలి.
జీఎస్టీకి సహేతుక పద్ధతి కావాలి!|EDITORIAL

