గ్రామాలు అభివృద్ధి చెందితేనే, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీజీ అన్నారు. దాన్నే గ్రామ స్వరాజ్యమని కూడా అంటారు. గ్రామాలు స్వయం సమ్రుద్ధిగా ఎదిగితేనే దేశం కూడా పురోగతి సాధిస్తుంది. మన ప్రజాస్వామిక వ్యవస్థలో దేశంలో మూడంచెలు, స్థానిక సంస్థల్లోనూ మూడంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం, గ్రామం ఒక యూనిట్ అయితే, స్థానిక సంస్థల్లో జిల్లా, మండలం, గ్రామం ఒక యూనిట్ గా పరిపాలన సాగుతోంది. అయితే గ్రామాలను పటిష్ట పరచడంలో ప్రభుత్వాలు, పార్టీలు అత్యంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గ్రామాలను గాలికి వదిలేసి, వాటి పరిపాలన, అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయి. పరిపాలన కంటే కూడా రాజకీయాధిపత్యం పరమావధిగా పార్టీలు, ప్రభుత్వాలు పని చేయడం ఆక్షేపణీయం.
స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వాలు కాలం గడిపేస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరుపతారో ఎవరికీ తెలియని అయోమయం నెలకొన్నది. తమకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఎన్నిక మన్నిక అన్నట్లుగా ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థలను విస్మరిస్తున్నారు. గ్రామాల్లో ఆధిపత్యం తమ చేతుల్లో ఉండేలా చూస్తున్నారు. గ్రామాలు ఆర్థికంగా బలపడడం లేదు. పెత్తనం తమ గుప్పిట్లో పెట్టుకుని సర్పంచ్లను డవ్మిూలుగా మర్చేస్తున్నారు.
ఎపీలో గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లకు సమాంతరంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను పెట్టింది. ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి సర్పంచ్ ల మీద పెత్తనం చెలాయించే కమిటీలుగా మారాయి. రాజీవ్ గాంధీ స్థానిక ప్రభుత్వాల బలోపేతం కోసం చేసిన రాజ్యాంగ సవరణలను తుంగలో తొక్కుతున్నారు. గ్రామీణ అర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉన్న గ్రామలను అభివృద్ధి పరచి, సర్పంచ్లను బాధ్యులను చేసేలా విధి విధానాలు ఉండటం లేదు. అన్నీ సిఎంల పర్యవేక్షణలో సచివాలయం నుంచే జరగడం వల్ల గ్రామాలు వట్టిపోతున్నాయి. ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు, సర్పంచ్లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పక్కాగా ప్రణాళికలు జరగడం లేదు. నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచన చేసినా, రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం, సర్పంచ్ లు పదవుల్లో ఉంటేనే కేంద్ర నిధులన్న నిబంధనలు అనుకూలించకపోవడంతో గత ఏడాదికిపైగా గ్రామాలు ఆగమైపోతున్నాయి.
గ్రామాలను పటిష్ట పాలనా కేంద్రలుగా తీర్చి దిద్దాల్సి ఉంది. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా ఎక్కడికక్కడ పరిపాలన సజావుగా సాగి, స్థానికావసరాలకనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే, ఇవ్వాళ దేశం అద్భుత ప్రగతి పథంలో ఉండేది. సిఎం స్థాయిలో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా నిబంధనలను పటిష్టం చేయాలి. ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచ్లను, వార్డు సభ్యులను బాధ్యులను చేస్తే, ఆయా పథకాలు ఆశించన ఫలితాలిచ్చేవి.
ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాలు, నగరాల్లో పారిశుధ్యం అత్యంత చెత్తగా అమలవుతున్నది. పారిశుధ్యం పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సామాజిక బాధ్యతగా చేయాలి. ఇప్పటికీ ఆరుబయట మల, మూత్ర విసర్జన అన్నది అలవాటుగా కొనసాగుతోంది. వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రజలు ఇందుకు కారణాలు అపరిశుభ్రత అని గ్రహించడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల కు 12వేల ఆర్థిక సాయం అందిస్తున్నా గ్రామాల్లో ప్రజలు వెంటనే మరుగదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రజలతో పాటు ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. సర్పంచ్లకు బాధ్యతలు అప్పగించి గ్రామకమిటీల ద్వారా అమలు చేయాల్సి ఉంది. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది.
ఇక ప్రధానంగా అన్ని పనులను ప్రభుత్వమే చేస్తుందన్న దీమాలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు కూడా మహా ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల దాకా, ఏదైనా సరే, తమ కనుసన్నల్లోనే జరగాలని, అంతా తమ క్రెడిట్ గా సాగాలని చూస్తున్నాయి. పారిశుధ్యం లోపం, పరిసరాల అపరిశుభ్రత కారణంగానే అత్యధిక వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. అతిసార, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. మురుగు కాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. సర్పంచ్లు ఉన్నా లేకున్నా ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోవడంలేదు.
ఇలాంటి సమస్యలనే ఇప్పుడు అధ్యయనం చేయాలి. గ్రామాలను బలోపేతం చేయాలి. ఓటుబ్యాంక్ రాజకీయాల కారణంగా ప్రజలు అచేతనంగా తయారయ్యారు. సర్పంచ్లను, పంచాయితీల పాలకవర్గాలను విశ్వాసంలోకి తీసుకుని వారిని ప్రభుత్వ పథకాల అమలుకు బాధ్యులను చేసినప్పుడే గ్రామాల రూపురేఖలు మారుతాయి. సర్పంచ్లకు విధులు, నిధులు అప్పగించాలి. అప్పుడే గ్రామాలు బలపడతాయి. సమీప భవిష్యత్తులోనే స్థానిక ఎన్నికలున్నందున ఈ లోగా ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. వట్టి మాటలు కట్టి పెట్టి గ్రామాలకు గట్టి మేలు చేయాలి.

