‘ఆపరేషన్’పై ‘అడుగు’ అప్ డేట్
పాక్ ప్రయోగించిన 26 డ్రోన్ల నిర్వీర్యం!
అమృత్సర్లో గాయపడిన ఓ కుటుంబం
ఆరు నగరాల్లో క్షిపణుల ప్రయోగం!
రావల్పిండి సమీపంలో భారీ పేలుళ్లు!
ఇస్లామాబాద్ లోనూ వరుస దాడులు!
ఈ తెల్లవారుజామున ముష్కరులపై ముప్పేట దాడి
తాజా దాడులపై పాక్ ఆర్మీ ప్రకటన
మరోవైపు పాక్ సైనిక స్థావరాలపై బీఎల్ఏ దాడులు
సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై గ్రనేడ్లతో దాడి
బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల వశం
క్వెట్టా సహా అనేక ప్రాంతాల స్వాధీనం
ఇంకోవైపు టీటీపీ దాడులు
20 మంది పాక్ సైనికుల హతం
పాక్ తోకాడించడం మానలేదు. ఇంకా భారత్ బార్డర్ ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉంది. 9వ తేదీ అర్థరాత్రి అనేక డ్రోన్లను భారత్ పై పాక్ ప్రయోగించింది. నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయి. వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయి. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మెర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఉన్నాయి.
విచారకరంగా, ఫిరోజ్పూర్లోని ఒక పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న సాయుధ డ్రోన్ వల్ల స్థానిక కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారికి వైద్య సహాయం అందించారు. అలాగే ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అమృత్సర్లోని ఖాసా కాంట్ మీదుగా ఎగురుతున్న బహుళ శత్రు సాయుధ డ్రోన్లను గుర్తించారు. శత్రు డ్రోన్లను మన వైమానిక రక్షణ విభాగాలు తక్షణమే నియోగించి నాశనం చేశాయి. ప్రతిగా భారత్ ఆ డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఎంతకూ పాక్ పన్నాగాలు ఆగకపోవడంతో తెల్లవారు జాము నుంచి భారత్ పాక్ పై ప్రతిదాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను పాక్ ఆర్మీ ధృవీకరించింది.
పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్లోని రఫికి ఎయిర్బేస్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. పాకిస్తాన్లోని పెషావర్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్లోని నూర్ ఖాన్, షోర్కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
కొనసాగుతున్న బిఎల్ఎ దాడులు
పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకున్నారు. ఓవైపు భారత్పై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాక్ తెగబడుతున్న సమయంలో… బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సహా మూడు తిరుగుబాటు గ్రూపులు అక్కడి పాక్ సైనిక స్థావరాలపై దాడులకు దిగాయి. క్వెట్టాలోని ఫైజాబాద్ ప్రాంతంలో పాక్ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై తిరుగుబాటుదారులు గ్రనేడ్లతో దాడికి దిగారు. పాకిస్థాన్ ఆర్మీని తరిమికొడుతూ, అక్కడి కీలక నగరం క్వెట్టా సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆరు ప్రాంతాల్లో పాక్ దళాలపై ఐఈడీలు, గ్రనేడ్లు, ఆటోమేటిక్ ఆయుధాలతో దాడులు చేశామని బీఎల్ఏ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ ప్రకటించారు.
ఇదిలావుండగా, క్వెట్టా, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్ జెండాలను తొలగించి.. బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
టీటీపీ దాడులు
పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) తీవ్రవాదులు చేసిన దాడిలో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్, దక్షిణ వజిరిస్తాన్లోని షకాయి సబ్ డివిజన్లో ఉన్న ఓ మిలటరీ ఔట్పోస్టుపై గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగినట్టు రిపబ్లిక్ వరల్డ్ సంస్థ ఓ కథనంలో పేర్కొంది. లేజర్ రైఫిల్స్ ఉపయోగించి టీటీపీ చేసిన తొలి దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. మిలటరీ ఔట్పోస్టు రక్షణకు బయలుదేరిన రెండు సైనిక వాహనాలపైనా టీటీపీ దాడి చేసింది. మొత్తంగా 20 మంది పాక్ సైనికులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని టీటీపీ ప్రకటించింది.

