ప్రపంచ వ్యాప్తంగా వున్న కార్మికులకు కర్షకులకు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో…
‘అరివె గురు (అవగాహనయే గురువు), కాయకవే కైలాస (కాయకష్టమే కైలాసము)’ అని బసవేశ్వరుడు కార్మిక లోక కష్టాన్ని గుర్తించాడు.
గతి తార్కిక భౌతిక వాదంతో ‘కార్మికుల కష్టం ద్వారా వచ్చే మిగులు విలువ’ సిద్ధాంతాన్ని విశద పరిచాడు కార్ల్ మార్క్స్.
‘యంత్ర భూతముల కోరలు తోమె కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికే విలాపాగ్నులకు, విశాలాక్షులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్!’ అంటాడు శ్రీశ్రీ. శ్రమైక జీవన సౌందర్యానికి ఆ విధంగా పట్టం కట్టాడు మహాకవి. అంతేకాదు ‘నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది? తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవ్వరు?’ అంటూ నిలదీస్తాడు.
పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో కార్మికులను బానిసల్లా చూశారు. కార్మికులు రోజుకు 16 నుంచి 20 గంటల వరకు పని చేసేవారు. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి కార్మికులు తిరుగుబాట్లు ప్రారంభించారు. ఆనాడు కార్మికులకు ఎటువంటి భద్రత గాని, సౌకర్యాలు గాని వుండేవి కాదు. ఫ్యాక్టరీల్లో గాలి, వెలుతురు సౌకర్యాలు మృగ్యం. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ లేదు. తరచుగా ప్రమాదాలకు గురై మరణించే వారు. కార్మికులు అమానుష శిక్షలకు గురవుతుండేవారు. కార్మికులు తమ పీడనకు వ్యతిరేకంగా యంత్రాలను ధ్వంసం చేసేవారు. ఈ విధ్వంసకాండ బ్రిటన్లో ప్రారంభమైంది. యంత్రాలను విచ్ఛిన్నం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ బ్రిటన్లో చట్టం చేసారు. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి పోరాటం తప్ప మరో మార్గమే లేదని కార్మికవర్గం గుర్తించింది. కార్మికవర్గం చైతన్యమైన దేశాల్లో ట్రేడ్ యూనియన్లు ప్రారంభమయ్యాయి. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియా కార్మికులు సమ్మె చేశారు. ఫిలడెల్ఫియా నగరంలో ’మెకానిక్స్ యూనియన్’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో కార్మికులు సంఘాలను నిర్మించుకొని పోరాటాలు సాగించారు. ట్రేడ్ యూనియన్ల మహత్తర శక్తిని చూసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పాలకులు హడలిపోయారు. 1884 అక్టోబర్లో అమెరికా, కెనడాల ఆర్గనైజ్డ్ ట్రేడ్ అండ్ లేబర్ యూనియన్ల నాలుగవ మహాసభ జరిగింది. 1886 మే నుండి 8 గంటల పని చట్టబద్దమైన పనిదినంగా వుంటుందని తీర్మానం చేసింది. మే 1వ తేదీన సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చింది. ‘మనిషి జీవితంలో రోజులో 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య’ అనే శాస్త్రీయ పద్ధతి కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ పిలుపునకు అశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది కార్మికులు అనేక సంస్ధలు ’8 గంటల పని దినం’ కోసం మే1వ తేదీన సమ్మెలో పాల్గొన్నారు. 1889లో ప్యారిస్లో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్ మొదటి కాంగ్రెస్ మేడే ను అంతర్జాతీయ కార్మికదినంగా అమలు చేయాలని తీర్మానాన్ని రూపొందించింది. అప్పటి నుంచి మేడేను అధికారికంగా కార్మికలోకం జరుపుకుంటోంది.
కష్ట జీవుల, కార్మికుల పండుగ మేడే. మేడే అనగానే గుర్తుకు వచ్చేది కార్మిక లోకమే. కార్మికులు లేనిదే వ్యవసాయం లేదు. పరిశ్రమలు లేవు. జీవితం లేదు. జీవనం లేదు. ఉత్పత్తి లేదు. పునరుత్పత్తి కూడా లేదు. అసలు ప్రపంచమే లేదు. మానవ చరిత్ర సమస్తం కార్మిక లోకమయమే. అయినా కార్మిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చట్టాలు పెట్టుబడిదారులకు చుట్టాలుగా మారుతున్నాయి. చట్టాలెన్ని చేసినా, కనీస వేతనాలు, అమలు కావడం లేదు. పనిదినాలు, పనిగంటలు అన్నవి లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాలు సైతం పెట్టుబడిదారులు లేదా బడా పారిశ్రామికవేత్తలకే అండగా ఉంటున్నాయి. అందువల్ల కార్మికసంక్షేమం అన్నది మేడిపండు చందంగా మారింది. మల్టీ నేషనల్ కార్పోరేట్ రంగం విస్తరించిన తరవాత కార్మికుల జీవితాలకు, జీతాలకు భద్రత, విలువ లేకుండా పోయింది. ప్రధానంగా పనిదినాలు, పనిగంటలు అన్నవి మృగ్యం అయ్యాయి. నిబంధనల మేరకు అనే పద్ధతి పోయింది. కంపెనీల నిబంధనల మేరకు పనిచేయాల్సి వస్తోంది. ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్నా, పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. తమ డిమాండ్లపై నినదించిన వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా కార్మికులు వివక్షను, వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అర్థాంతరంగా కంపెనీలను, సంస్థలను మూసేసి కార్మికుల నోట్లో మట్టికొడుతున్నా కార్మిక చట్టాలు పనిచేయడం లేదు.
కానీ ప్రభుత్వాలు కార్పోరేట్ కంపెనీల మోచేతి నీళ్లు తాగుతూ కార్మికులకు ద్రోహం చేస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రపంచం, అభివృద్ది అంతా కూడా కార్మికుల శ్వేదం చిందిస్తేనే సాధ్యం అయ్యిందన్న విషయం మరచిపోతున్నాం. కార్మికవర్గం లేకుంటే ప్రపంచ పురోగతే లేదన్న భావనను అందరూ అర్థం చేసుకోవాలి. మారిన ప్రపంచ పటంలో మారుతున్న కాలంలో ఇంకా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కార్మికులను అణచివేసేందుకు యాజమాన్యాలు కొత్తకొత్త పద్దతులను అనుసరిస్తున్నాయి. యాజమాన్యాలకు వత్తాసు పలికే బూర్జువా విధానాలను ప్రభుత్వాలు విడనాడాలి. అప్పుడే మేడేకు సార్థకత చేకూరుతుంది. ఎన్నో సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతోనే కార్మికుల హక్కులు సాధ్యం అయ్యాయి. ఆ హక్కులు నిలుపుకోడానికి అవసరమైతే కార్మిక లోకం మరో పోరాటానికి సిద్ధం కావాలి.

