ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ ఒకేసారి ఎదుర్కొంటున్నది. బీజేపీ ఇప్పుడు ఆత్మపరిశీలన ముంగిట ఉంది. వరుస ఎన్నికల విజయాలతో జాతీయ రాజకీయాల్లో ఆధిపత్యం చాటిన పార్టీకి ఇటీవల జరిగిన పరిణామాలు ప్రజల మనోభావాలను మరోసారి అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 543 స్థానాల్లో 240 స్థానాలకే పరిమితమై, స్వతంత్రంగా పూర్తి మెజారిటీ సాధించలేక మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది పార్టీకి వచ్చిన తొలి రాజకీయ హెచ్చరిక. ఆ తరువాత జరిగిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు మలి హెచ్చరిక. తాజా ఉప ఎన్నికల్లో గుజరాత్లోని మంజల్పూర్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకున్నప్పటికీ, బీహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాలను కోల్పోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రత్యేకించి బీహార్లోని బాంకీపూర్ ఫలితం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీ ఆధీనంలో ఉన్న ఈ స్థానాన్ని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గెలుచుకోవడం విశేషం. అది అధికార పార్టీకి ప్రజలు పంపిన రాజకీయ సందేశం. ఒకప్పుడు వరుస విజయాలు సాధించిన ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు మారడం యువత, మధ్యతరగతి ఓటర్ల ఆలోచనల్లో వచ్చిన మార్పుకు ప్రతిబింబంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో నీట్ పరీక్షల నిర్వహణపై వివాదాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు, విద్యార్థుల్లో పెరిగిన అసంతృప్తి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థుల ఆందోళనలు విద్యా వ్యవస్థపై నమ్మకం, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ భద్రత వంటి విస్తృత అంశాలకు సంబంధించినవిగా మారాయి. ఈ నేపథ్యంలో యువత అసంతృప్తి ఎన్నికలపై కూడా ప్రభావం చూపిందన్నది గ్రహించాల్సిన విషయం.
భారతదేశం అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. 35 ఏళ్ల లోపు జనాభా సగానికి పైగానే ఉంది. ఇలాంటి దేశంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పన ప్రభుత్వాలకు అత్యంత ప్రాధాన్య అంశాలు కావాలి. యువతలో నిరాశ పెరిగితే అది క్రమంగా రాజకీయ అసంతృప్తిగా మారడం సహజం. ప్రపంచ చరిత్ర కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.
ప్రజలు కేవలం అభివృద్ధి గణాంకాలను మాత్రమే చూడరు. వారి నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆరోగ్య ఖర్చులు, విద్యా వ్యయం, పన్నుల భారం వంటి అంశాల ఆధారంగానే ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తారు. స్థూల ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నా, కుటుంబ బడ్జెట్ దెబ్బతింటే ప్రజల్లో అసంతృప్తి పెరగడం సహజం. అందువల్ల ప్రజల దైనందిన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే భావన అధికార పార్టీలకు ప్రమాదకరమైన భ్రమ. ప్రతిపక్ష పార్టీలు బలహీనపడినా, ప్రజల అసంతృప్తి ఎప్పటికీ బలహీనపడదు. అవసరమైతే కొత్త రాజకీయ శక్తులు ఆ ఖాళీని భర్తీ చేస్తాయి. బాంకీపూర్ ఫలితం ఈ వాస్తవాన్ని మరోసారి గుర్తు చేసింది.
బీజేపీ గత పదేళ్లలో మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, ప్రత్యక్ష నగదు బదిలీలు, జాతీయ రహదారులు, సంక్షేమ పథకాల అమలులో గణనీయమైన పురోగతి సాధించిందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, సామాజిక సమగ్రత వంటి అంశాల మాటేమిటి మరి?! విజయాలను నిలబెట్టుకోవాలంటే విమర్శలను సైతం సమానంగా వినడం అవసరం.
చరిత్ర చెబుతున్న స్పష్టమైన పాఠం ఏమిటంటే, ప్రజల తీర్పును గౌరవిస్తూ, అవసరమైనప్పుడు విధానాలను సవరించుకున్న ప్రభుత్వాలే దీర్ఘకాలం నిలిచాయి. ఎన్నికల ఫలితాలను తాత్కాలిక సంఘటనలుగా కాకుండా ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబంగా చూడగలిగితేనే రాజకీయ పార్టీలు తమ బలాన్ని, బలగాన్ని నిలబెట్టుకోగలవు.
అందువల్ల తాజా ఉప ఎన్నికల ఫలితాలు, యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తికి ప్రబల నిదర్శనం. విద్యా-ఉపాధి రంగాలపై ప్రజలు, విద్యార్థులు సంధిస్తున్న ప్రశ్నలను బీజేపీ నాయకత్వం ఆత్మపరిశీలనకు వచ్చిన గొప్ప సదవకాశంగా స్వీకరించాలి. ప్రజలతో మరింత సన్నిహితంగా మమేకమై, విద్య, ఉపాధి, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో స్పష్టమైన ఫలితాలు చూపగలిగితేనే, బీజేపీ భవిష్యత్తులో ప్రజల విశ్వాసాన్ని మరింత బలంగా నిలబెట్టుకోగలదు. అధికారం శాశ్వతం కాదు, ప్రజల విశ్వాసమే శాశ్వతం.
బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

