నిష్పాక్షికంగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు
ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ( రిజి. నెం.363/2015) ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.
ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో ఎన్నికల కమిటీని నియమించింది.
ఎన్నికల అధికారిగా డిఐజి ఎన్. సైదిరెడ్డి, సహాయకులుగా ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఎం. సంతోష్లను నియమించింది.
ఇందుకు సంబంధించి మెమో నెం. 6395/ ఆర్ ఇ జి ఎన్ 2/ 2025 -2 ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్యవైశ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఏకపక్షంగా , ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న నేపధ్యంలో నాగర్ కర్నూలుకు చెందిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణతో పాటు మరికొంతమంది వైశ్య నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా లక్ష్మీనారాయణ మళ్లీ అప్రజాస్వామికంగా రాష్ట్ర ఎన్నికలు నిర్వహించి తిరిగి రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ పలు వివరాలు , ఆధారాలతో రామకృష్ణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుల నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి ఉత్వర్వులు జారీ చేసింది.

