అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ప్రపంచ వాణిజ్యం గందరగోళంలో పడింది. తక్షణ, దుందుడుకు ఆర్థిక విధానాలు, వీసాల కట్టడులు, వాణిజ్య నియంత్రణలు గ్లోబల్ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయి. ఒకవైపు అమెరికా టారిఫ్ల దూకుడు, మరోవైపు చైనా ఆధిపత్య కాంక్షల మధ్య ప్రపంచ దేశాలు కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు.
2007లో యూపీఏ హయాంలో మొదలైన భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు, వివిధ కారణాలతో నిలిచిపోయాయి. తిరిగి 2022లో చర్చలు పునఃప్రారంభమై, ఇప్పుడు ఫలితానికి చేరాయి. గ్రీన్లాండ్ పై ట్రంప్ వ్యవహారశైలి, “అమెరికా లేకుంటే యూరప్కు విలువే లేదు” అన్న వ్యాఖ్యలు, టారిఫ్లతో బెదిరింపులు యూరోపియన్ యూనియన్ను భారత్ వైపు వేగంగా నడిపించాయి. మరోవైపు భారత్ కూడా ఆచితూచి, పరస్పర సహకార విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో సయోధ్యకు ప్రయత్నిస్తోంది.
కొన్ని రాజకీయ ఆరోపణలను పక్కనపెడితే, వాస్తవానికి ప్రస్తుత గ్లోబల్ పరిణామాల్లో అమెరికాను ప్రత్యక్షంగా ఎదిరించే పరిస్థితి భారత్కు లేదు. వాణిజ్యం, పెట్టుబడులు మాత్రమే కాదు. లక్షలాది భారతీయుల జీవనాధారం అమెరికాతో ముడిపడి ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు అడుగులు వేయడం భారతావనికి తప్పనిసరి. ఆ దిశలో ఈయూ ఒప్పందం ఎడారిలో ఒయాసిస్లాంటిదని చెప్పాలి.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో యూరప్ దేశాలకు భారత్ ఎగుమతి చేసే అనేక ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల భారత ఎగుమతిదారులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరతాయి. అదే సమయంలో యూరప్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, కీలక ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుని, వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను భారత్–ఈయూ ఆమోదించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, భారత్–ఈయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం. ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుకు ఇది సమానం. యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు తమ దేశీయ చట్టాలను పూర్తి చేసిన తర్వాత ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టే అవకాశముంది.
ఈ ఒప్పందంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఆటోమొబైల్ రంగం. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ 125% వరకు సుంకాలు విధిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం ఇవి మొదట 40 శాతానికి, తర్వాత దశలవారీగా 10 శాతానికి తగ్గనున్నాయి. దీనివల్ల బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్, లాంబోర్గిని, పోర్షే వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా భారత్ నుంచి యూరప్కు ఎగుమతి అయ్యే కార్లపై అక్కడి సుంకాలు కూడా తగ్గనుండటంతో భారత ఆటో రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
ఫార్మా రంగంలోనూ ఈ ఒప్పందం కీలకం. క్యాన్సర్, బరువు తగ్గించే మందులు వంటి కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై సుంకాలు తగ్గడం వల్ల భారత ఫార్మా కంపెనీలకు లాభం చేకూరుతుంది. విమానాలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గడంతో వినియోగదారులకు ధరల ఉపశమనం లభిస్తుంది.
ఇక భారత్ నుంచి యూరప్కు వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశముంది. విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో భారత యువతకు యూరప్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. గ్రీన్ హైడ్రోజన్, శాస్త్ర సాంకేతిక భాగస్వామ్యం, డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాల్లోనూ సహకారం బలపడనుంది.
మొత్తానికి, అమెరికా టారిఫ్ల బెడద నుంచి ఉపశమనానికి, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, భారత ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అందిపుచ్చుకునేందుకు భారత్–ఈయూ ఒప్పందం ఒక చారిత్రక ముందడుగు. ప్రపంచంతో పోటీ పడుతూ భారత్ తన ఆర్థిక శక్తిని మరింత బలపర్చుకునే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

