గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ప్రయాగను పాలించిన కుషాణులకు సామంతులుగా ఉండి తర్వాత స్వతంత్రులై పాటలీపుత్రం నుండి పాలించారని ఒక అభిప్రాయం.

సాహిత్య ఆధారాలు
గుప్తుల కాలంలో లభించిన గ్రంథాలన్నీనూ సంస్కృత భాషలోనే రాయబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సమయం నుండే సంస్కృత భాష పూర్తి రూపాన్ని మరియు వినియోగాన్ని సంతరించుకుంది అని చెప్పవచ్చు.
# శూద్రకుడు రాసిన మృచ్ఛకటికము గుప్తుల కాలంలోని చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్యను వివాహం చేసుకోవడం గురించి తెలియచేస్తుంది. దీనిని బట్టి వేశ్యను వివాహమాడే పద్ధతి గుప్తుల కాలము నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు.
# కామాంధకుడు రాసిన నీతిసారము గుప్తుల పరిపాలనా విధానాన్ని తెలియచేస్తుంది. నీతి అనగా రాజు ఎలా పరిపాలించాడో చెప్పడం.
# వజ్జికుడు రాసిన కౌముదిమహోత్సవము మొదటి చంద్రగుప్తుడి పట్టాభిషేకం గురించి తెలియచేస్తుంది.
# విశాఖదత్తుడు రాసిన దేవిచంద్రగుప్తము రెండవ చంద్రగుప్తుడు ధ్రువాదేవిని వివాహం చేసుకోవడం గురించి తెలియచేస్తుంది. (విశాఖదత్తుడు ముద్రారాక్షసంను కూడా రచించాడు. ఇది మౌర్యుల గురించి తెలియచేస్తుంది.)
# విదేశీయుడైన పాహియాన్ (చైనా దేశస్థుడు) భారతదేశానికి వచ్చిన ఒక బౌద్ధ సన్యాసి. ఇతను రెండవ చంద్రగుప్తుని కాలంలో (క్రీ.శ.399-414) భారతదేశంలోని అస్పృశ్యత గురించి తెలియచేసిన తొలి యాత్రికుడు. ఇక్కడ కులాలు మరియు ప్రజలు అనుభవిస్తున్న సామాజిక, మత, ఆర్ధిక వివక్షతల గురించి పూర్తి సమాచారాన్ని తెలియచేసాడు.
శాసన ఆధారాలు
గుప్తుల కాలంలో సుమారు 40 వరకు శాసనాలు లభ్యమయ్యాయి. ఇవి ప్రశస్తి మరియు దానశాసనాలుగా ఉన్నాయి.
1) చంద్రగుప్త-II వేసిన మెహ్రౌలీ శాసనం ఇతని యొక్క సైనిక విజయాల గురించి తెలియచేస్తుంది. ఇది ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉండడం దీని విశేషం (సుమారు 1500 సంవత్సరాలు).
2) సముద్రగుప్తుడు వేసిన ఎరాన్ ప్రశస్తి శాసనం (మధ్యప్రదేశ్) అతని విజయాల గురించి తెలియచేస్తుంది. అలహాబాద్ లో వేసిన ప్రశస్తి శాసనం సముద్రగుప్తుడు జయించిన రాజ్యాల గురించి తెలియచేస్తుంది. నలంద తామ్ర శాసనం సముద్రగుప్తుడు ఒక బ్రాహ్మనుడికి అగ్రహారాన్ని, బ్రాహ్మణులకు భూదానాలు చేసినట్టు ఈ శాసనంపై లిఖించబడింది. (అగ్రహారం అనగా బ్రాహ్మణులు నివసించే ప్రదేశం. ఈ పదం తొలిసారిగా గుప్తుల కాలంలోనే కనిపిస్తుంది.) బీహార్ లోని గయ తామ్ర శాసనం సముద్రగుప్తుడు బౌద్ధులకు ఇచ్చిన విహారాల గురించి తెలియచేస్తుంది. (విహారాలు అనగా బౌద్ధులు నివసించే ప్రదేశం.)
3) స్కందగుప్తుడు వేసిన ఝునాఘడ్ శాసనం, బితారి శాసనం అనే ప్రశస్తి శాసనాలు అతను చేసిన యుద్ధాలు మరియు దానధర్మాల గురించి తెలియచేస్తుంది.
4) భాణగుప్తుడు వేసిన ఎరాన్ ప్రశస్తి శాసనం గుప్తుల కాలంలోని సతి సాంప్రదాయం గురించి తెలియచేస్తుంది. (సతిని గురించి తెలియచేస్తున్న మొట్టమొదటి శాసనం ఇదే.)
నాణెములు
గుప్తుల గురించి తెలుసుకోవడానికి నాణాలు చాలా ఉపయోగపడ్డాయి. గుప్తులు దినార్ అనబడే బంగారు నాణెములను మరియు *రుపయా* అనబడే వెండి నాణెములను వినియోగించారు, వీటితోపాటు సముద్రంలో లభించే గవ్వలను కూడా నాణాలుగా ఉపయోగించారని విదేశీ యాత్రికుడైన పాహియాన్ తెలియచేసాడు. చంద్రగుప్త-I తన భార్య కుమారదేవి మరియు అంతఃపుర స్త్రీల బొమ్మలను నాణాలపై ముద్రించాడు. సముద్రగుప్తుడు కవిరాజు అనే బిరుదుతో ఉన్న నాణాలు మరియు అశ్వమేథ యాగం చేస్తూ అశ్వమేథ పరాక్రమ అనే బిరుదు గల నాణాలను ముద్రించాడు.
గుప్త రాజులు
1) శ్రీగుప్తుడు (క్రీ.శ.275-300) : ఇతను గుప్త వంశ స్థాపకుడు. ఇతను మహారాజా అనే బిరుదును తీసుకోవడం వల్ల సామంతుడై ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం.
2) చంద్రగుప్త-I (క్రీ.శ.320-335) : మహారాజాధిరాజ అనే బిరుదును తీసుకోవడం వల్ల స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని అనుకోవచ్చు. లిచ్చావి రాకుమార్తె అయిన కుమారదేవిని వివాహం చేసుకొని వారి మద్దతు పొంది స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని చరిత్రకారుల అభిప్రాయం.
3) సముద్రగుప్తుడు (క్రీ.శ.335-380) : ఇతను వేసిన అలహాబాద్ ప్రశస్తి శాసనం ఇతని సైనిక విజయాల గురించి తెలియచేస్తుంది. ఒక విధంగా సైనిక విజయాల అంశంలో ఇతనిని గుప్తుల్లో అందరికంటే గొప్పవాడిగా చెప్పవచ్చు. ఇతడు భారతదేశంలోని ఉత్తర భాగంలో గల 8 ఆర్యవర్త రాజ్యాలను జయించాడు. వింధ్య పర్వతాల్లోని 18 ఆటవిక రాజ్యాలను జయించి గుప్త సామ్రాజ్యంలో విలీనం చేసాడు. (ఆటవిక రాజ్యాలు అనగా గిరిజన రాజ్యాలు అని అర్థం.) ప్రజల చేత ఎన్నుకోబడిన 9 గణతంత్ర రాజ్యాలను జయించి మరియు దక్షిణ భారతంలోని కావేరి నది, మహానది ప్రాంతంలో గల 12 రాజ్యాలను జయించి ఆ రాజ్యాలను సామంత రాజ్యాలుగా చేసుకున్నాడు. ఈ విజయాల వలన వి.ఏ.స్మిత్ అనే ఆంగ్లేయ చరిత్రకారుడి ప్రకారం ఒక చిన్న రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా తీర్చి దిద్దిన సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ గా అభివర్ణించాడు. (నెపోలియన్ 19వ శతాబ్దంలోని యూరోప్ చక్రవర్తి.)
4) చంద్రగుప్త -II (క్రీ.శ.380-412) : ఇతను క్రీ.శ.388లో మధ్యప్రదేశ్ ను పాలిస్తున్న శక వంశ రాజైన రుద్రసింహ-III ను ఓడించి ఉజ్జయినిని ఆక్రమించుకొని శకారి, విక్రమాదిత్య అనే బిరుదులను తీసుకున్నాడు. ఉజ్జయిని గుప్తులకు రెండవ రాజధానిగా (సాహిత్య రాజధాని) కొనసాగింది. ఇతను వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్యాన్ని బలోపేతం చేసాడు. గణపతినాగుని కుమార్తె అయినా కుబేరనాగను వివాహం చేసుకొని వారి మద్దతు పొందాడు. ఒక సాంప్రదాయం ప్రకారం *నవరత్నాలు* అనబడే 9 మంది పండితులు ఇతని ఆస్థానంలో ఉండేవారు.
– నవరత్నాలు: కాళిదాసుడు, విష్ణువర్మ, బ్రహ్మగుప్త, వరాహమిహిర, ధన్వంతరి, సుశ్రుతుడు, ఆర్యభట్ట, వరరుచి, అమరసింహ. వీరిలో కాళిదాసుడు ముఖ్యుడు.
5) కుమారగుప్త (క్రీ.శ.412-455) : బీహార్ లో గల నలంద విశ్వవిద్యాలయాన్ని ఇతను స్థాపించాడు. చైనా యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ ప్రకారం వివిధ దేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు, సుమారు 8500 మంది విద్యార్థులు, 1500 మంది ఉపాధ్యాయులు మరియు దీనికి సుప్రసిద్ధ మహాయాన బౌద్ధ పండితులు అధిపతులుగా ఉండేవారు.
క్రీ.శ.455 తర్వాత గుప్త సామ్రాజ్యంలో నరసింహగుప్త బాలాదిత్య, విశునుగుప్తుడు అనే బలహీన చక్రవర్తులు రావడం వల్ల 6వ శతాబ్దపు మధ్యలో గుప్త సామ్రాజ్యం అంతమైంది. విష్ణుగుప్తుడిని గుప్తులలో చివరి చక్రవర్తిగా చెప్పవచ్చు.


