ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. అదే సమయంలో న్యాయబద్ధమైన ఓటరు జాబితా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ, పవిత్రతకు అంతే అవసరం. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగిపోకూడదు. అనర్హుల పేర్లు ఒక్కటీ కొనసాగకూడదు. ఈ రెండు లక్ష్యాలను సమన్వయంగా సాధించడానికి ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఓటర్లు కలిసి పనిచేయాల్సిందే.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రజాస్వామ్యానికి ఓటరే వెన్నెముక. ఎన్నికల పారదర్శకత, విశ్వసనీయత, ప్రజల నమ్మకం అన్నీ ఓటర్ల జాబితా నాణ్యతపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను రాజకీయ వివాదంగా కాకుండా ప్రజాస్వామ్య ప్రక్షాళనగా చూడాలి. ఈ ప్రక్రియపై అనవసర అనుమానాలు సృష్టించడం కంటే, దానిని మరింత పారదర్శకంగా అమలు చేయడంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సహకరించడం ప్రజాస్వామ్య ప్రయోజనాలకు అనుకూలం.
భారతదేశంలో నమోదైన ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువలో ఉంది. ఇంత భారీ ఎన్నికల వ్యవస్థను నిర్వహించడం ప్రపంచంలోనే అతిపెద్ద సవాల్. ప్రతి ఎన్నికకు ముందు ఓటరు జాబితాలో కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి నమోదును సవరించడం, ఒకటికి మించి ఉన్న నమోదులను తొలగించడం, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఈ ప్రక్రియ లేకపోతే ఎన్నికల స్వచ్ఛత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉన్నవారు, ఉద్యోగాలు, ఉపాధిల రీత్యా నగరాలకు వెళ్లినా సొంత గ్రామాల్లో ఓటు కొనసాగిస్తున్నవారు, శాశ్వత నివాసం మార్చుకున్నవారిలో ఆందోళన కనిపిస్తోంది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గంలో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదును చట్టం అనుమతించదు. కాబట్టి ద్వంద్వ నమోదును తొలగించడం ఎన్నికల సంఘం బాధ్యతే తప్ప రాజకీయ జోక్యం కాదు.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను అప్రమత్తం చేయడం సహజమే. అయితే “అర్హులైన ఓటర్ల పేర్లను భారీగా తొలగిస్తున్నారు” అనే అపోహలు ప్రజల్లో అనవసర భయాందోళనలకు కారణమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉన్న వృద్ధులు, మహిళలు, వలస కార్మికులు తమ ఓటు పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ భయాన్ని పెంచడం కంటే తమ వివరాలను ధ్రువీకరించుకోవాలని ప్రజలకు సూచించడం రాజకీయ పార్టీల బాధ్యత.
ఓటరు జాబితా సవరణ కొత్త ప్రక్రియ కాదు. ప్రతి సంవత్సరం సాధారణ సవరణలు జరుగుతూనే ఉంటాయి. అవసరమైనప్పుడు ప్రత్యేక సవరణలూ నిర్వహిస్తారు. గతంలోనూ వివిధ ప్రభుత్వాల హయాంలో ఈ ప్రక్రియ అమలైంది. కాబట్టి దీనిని ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వానికి మాత్రమే ఆపాదించడం వాస్తవాలకు దూరమైన వాదనే అవుతుంది.
అయితే, ఎన్నికల సంఘం కూడా విమర్శలకు అతీతం కాదు. ఇంటింటి ధ్రువీకరణలో పారదర్శకత, తగిన నోటీసులు, అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం, సులభమైన అప్పీల్ వ్యవస్థ వంటి అంశాల్లో మరింత జాగ్రత్త అవసరం. అర్హులైన ఒక్క ఓటరు కూడా నిర్లక్ష్యంతో జాబితా నుంచి తొలగిపోకూడదు. అదే సమయంలో నకిలీ, ద్వంద్వ, మరణించిన వారి పేర్లు కొనసాగకూడదు. ఈ రెండింటి మధ్య సమతౌల్యాన్ని సాధించడమే సర్ ప్రధాన కర్తవ్యం కావాలి.
సర్ ప్రక్రియలో సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆధార్, పాన్ వంటి గుర్తింపు వ్యవస్థలకు శాశ్వత సంఖ్యలు ఉన్నప్పటికీ, ఓటరు నమోదులో ఇప్పటికీ రాష్ట్రాల మధ్య సమన్వయం పూర్తిస్థాయిలో లేదు. డిజిటల్ ధ్రువీకరణ, కృత్రిమ మేధస్సు ఆధారిత డేటా విశ్లేషణ, రాష్ట్రాల మధ్య సమాచార సమన్వయం వంటి చర్యల ద్వారా ద్వంద్వ నమోదులను సులభంగా గుర్తించే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ వ్యక్తిగత గోప్యత, చట్టబద్ధ హక్కులను కాపాడే విధంగానే అమలు కావాలి.
రాజకీయ పార్టీల పాత్ర ఇక్కడ అత్యంత కీలకం. గ్రామాలు, వార్డులు, బూత్ స్థాయిలో స్థానిక పరిస్థితులపై పూర్తి సమాచారం పార్టీలకే ఉంటుంది. ఎవరు మరణించారు? ఎవరు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు? ఎవరి పేర్లు రెండు చోట్ల నమోదయ్యాయి? వంటి వివరాలు వారికి సులభంగా తెలుస్తాయి. ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందించి ఓటరు జాబితా ప్రక్షాళనకు సహకరిస్తే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. కానీ ఎన్నికల లాభనష్టాల దృష్టితో అపోహలు వ్యాప్తి చేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. అదే సమయంలో న్యాయబద్ధమైన ఓటరు జాబితా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ, పవిత్రతకు అంతే అవసరం. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగిపోకూడదు. అనర్హుల పేర్లు ఒక్కటీ కొనసాగకూడదు. ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఓటర్లు కలిసి పనిచేయాల్సిందే.
స్వచ్ఛమైన, నిఖార్సైన ఓటరు జాబితా రాజకీయ పార్టీలతోపాటు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. అందుకే విమర్శలు చేయడమే కాకుండా బాధ్యతాయుత సహకారం అందించడం అన్ని రాజకీయ పార్టీల ధర్మం. ప్రజల్లో అవగాహన పెంచడం, అర్హులైన ప్రతి ఓటరు తన పేరును ధ్రువీకరించుకునేలా చూడడం, అనర్హ నమోదులను గుర్తించి ఎన్నికల సంఘానికి తెలియజేయడం ద్వారా మాత్రమే విశ్వసనీయమైన ఓటరు జాబితా సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే రాజకీయ పోటీతో పాటు రాజకీయ బాధ్యత కూడా సమానంగా ఉండాలి.

