ఆలయాల చరిత్ర పర్యాటకులకు తెలిసేలా ఏర్పాటు చేయండి
మొండి బకాయిలను వసూలు చేయండి
వల్మీడి, పాలకుర్తి దేవస్థానాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశం
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
గ్రామస్తులతో కలిసి సమీక్ష సమావేశాన్ని ఆసక్తిగా తిలకించిన ఝాన్సీ రెడ్డి
జనగామ జిల్లాకు సంబంధించి, పాలకుర్తి నియోజకవర్గంలో గల పర్యాటక ప్రాంతాలు పాలకుర్తి, వల్మీడి, బమ్మెర అభివృద్ధి పనులపై జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రాజ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాల పెండింగ్ పనుల అభివృద్ధిని సమీక్షిస్తూ, ప్రధాన నిర్మాణాలు, భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయాలకు కేటాయించిన నిధుల వినియోగం, పూర్తి కానీ పనుల పరిస్థితి, తదితర అంశాలపై చర్చించారు. ఆలయ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వల్మీడి, పాలకుర్తి, బమ్మెర ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, ఆలయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలన్నారు. సమగ్ర ప్రణాళికలు రూపొందించి, ఆలయ చరిత్రను పర్యాటకులకు పరిచయం చేయాల్సిన అవసరం వుందని అభివృద్ధి పనులకు పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలకుర్తి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ… ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం పూర్తిగా అందిస్తుంది అన్నారు. అధికారులు, ప్రజలు అందరు కలిసి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అన్నారు.
వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఇతర అధికారులు

సమీక్ష సమావేశానికి ముందు ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఇతర అధికారులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు.
జనంలో ఝాన్సీ

సమీక్ష సమావేశానికి అనుకోకుండా హాజరైన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గ్రామస్తులతో కలిసి కూర్చొని ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆర్డిఓ డి.ఎస్ వెంకన్న నాయక్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో రాములు, ఆలయ ఈవో మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

