-అశేష అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య సంస్మరణసభ
జనగామ(గూడూరు), జూలై 26(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సమాజంలోని అణగారిన వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ అని, ఆయన మరణంతో బీసీ సమాజం మూగబోయిందని పలువురు వక్తలు అన్నారు. ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ ఆశయాలను వ్యాప్తి చేద్దామని, వారి భావజాలాన్ని ప్రజలకు నేర్పుదామని, వారి మరణం మనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో వారి సతీమణి, మంచిర్యాల మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డా.రేఖ, తల్లి కొమురమ్మ, సోదరులు రమేష్, శ్రీనివాస్, తదితర కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 16న అకాల మరణం చెందిన ప్రముఖ సామాజిక బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త ప్రొ. ప్రభంజన్ కుమార్ యాదవ్ సంస్మరణ సభను శనివారం, నిర్వహించగా, బోరును కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, బంధుమిత్రులు, ప్రజలు ప్రభంజన్ కు జోహార్ అంటూ.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభంజన్ దేహాన్ని జనగామ మెడికల్ కాలేజీకి అందించినందుకు గాను వారి అభినందన జ్ఞాపికను వారి కుటుంబసభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన సతీమణి డా. రేఖ మాట్లాడుతూ, ప్రభంజన్ కుమార్ యాదవ్ తనకు భర్తగా కన్నా… మంచి స్నేహితుడు అని చెప్పారు. ప్రభంజన్ లాంటి మిత్రుడిని కోల్పోవడం నాకు తీరని లోటు అని కంటతడి పెట్టారు. ప్రభంజన్ ఎప్పుడూ అందరూ సమానమనే భావనతోనే ఉండేవారని చెప్పారు. ఆయన తాను ప్రజా ఉద్యమాలు చేస్తా… అని, ఉద్యోగం మానేస్తున్నా… పిల్లల బాధ్యత నువ్వే తీసుకోవాలని చెప్పి, తనను ఈ సమాజానికి పరిచయం చేశారన్నారు. నాకు తన స్నేహితులను ఆస్తిగా ఇచ్చారన్నారు. తన మిగిలిన జీవితం వారి ఆశయాల కోసం పనిచేస్తానని, వారి భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. తన తదనంతరం శరీర దానం చేయాలని కోరిన ప్రజా ఉద్యమ నేత నా భర్త కావడం తనకు గర్వంగా ఉందన్నారు.

వారి తమ్ముడు యాదనాల రమేష్ మాట్లాడుతూ, తన అన్న ఆశయాలకు అనుగుణంగా బీసీ ఉద్యమంలో తమ కుటుంబం పాలు పంచుకుంటుందని చెప్పారు. తమ అన్నయ్య రాసిన పుస్తకాలను పునర్ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు.

ఇదే సందర్భంలో పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ గుర్తుగా, స్వగ్రామం గూడూరులో, మండల కేంద్రం పాలకుర్తిలో, ఏర్పాటు చేయాలని, అన్ని సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేయగా, వచ్చిన మిత్రులు, బంధువులు, అభిమానులు తదితరులు చప్పట్లతో ఆమోదం తెలిపారు.

అడుగు డిజిటల్ మీడియాకు అభినందనలు
గత 10 రోజులుగా ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ కు తమ అడుగు డిజిటల్ మీడియా ద్వారా అక్షర నీరాజనం పలికిన ప్రభంజన్ యాదవ్ మిత్రుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ, వారి బృందానికి వారి సతీమణి డా. రేఖ, ఇతర వక్తలు వారి ప్రసంగంలో అభినందించారు. ఇలాంటి సమయంలో వారి వ్యాసాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు గాను వారిని అభినందించారు.
సంస్మరణ సభలో ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ చిత్రపటానికి వారి మిత్రులు సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా. రాపోలు సత్యనారాయణ, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ దాడబోయిన శ్రీకాంత్, టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా ఖాన్, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్ దళపతి, కర్రేటి శంకర్ రావు, కోలా జనార్ధన్, మాజీ సర్పంచ్ బక్కి పుల్లయ్య, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, జమాలుద్దీన్, మహమ్మద్ పాషా, భూమా రుషి, దీపక్, చౌడవరపు శ్రీనివాస్, బెల్లి రాజయ్య, నోముల రవీందర్, బహుజన దయాకర్, వాయిస్ ఆఫ్ తెలంగాణ జగదీష్, నల్గొండ లింగయ్య, సోమిడి కిషన్, అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందీప్ తేజ, రషీద్, జీ వెంకటేశ్వర్లు, వెంకన్న, డా. రాకేష్ తోపాటు అభిమానులు బీసీ సంఘాల సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

