అతడే ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
వరికోల్ నుంచి మోకిళ్ళ వరకు
పత్రికా ప్రటనలు మోయడం నుంచి…
‘మెగా’తో కలిసి రూ.750 కోట్ల విల్లాల దాకా!
ఎమ్మెల్సీ, కాంట్రాక్టర్.. అన్నీ ఆయనకేనా?
‘పల్లా’ చెప్పాడంటూ బయట పెట్టిన కవిత!
రాష్ట్రంలో అధిక ధనవంతుల జాబితాలో చోటు?
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక సేవ. లింకు ఊరు దత్తత. సినిమా బాగా హిట్టైంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్థావిస్తున్నది తండ్రి తరహా. కొడుకు సేవ, దత్తత కలగలిసిన క్యారెక్టర్ గురించి. ఇదేమీ ఎవరో రాసిన కథ కాదు. తనకు తాను రాసుకున్న కథ. ఇక ఈ కథను చెప్పిందెవరో కాదు సాక్షాత్తు కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత. ఆమెకు ఈ కథ చెప్పింది జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నది కూడా కవిత చెప్పిందే. ఇక అసలు కథలోకి వెళితే…
నిన్నటి వరకు అతడు పూర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. నేడు అతన్ని హైదరాబాదులోనే కాదు అంతటా, అందరూ ‘శ్రీమంతుడు’ అని పిలుస్తారు. భారత రాష్ట్ర సమితిలో అతడు అధిక ధనవంతుల్లో ఒకరు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నడికుడ మండలం, వరికోల్ గ్రామంలో 1975, ఏప్రిల్ 17న మధ్య తరగతి కుటుంబమైన పోచంపల్లి జనార్దన్ రెడ్డి, సమ్మక్క దంపతులకు జన్మించాడు. ఆయన ఎంబీఏ పూర్తి చేశాడు. బీఆర్ఎస్ యువరాజు ‘కేటీఆర్ ఫ్రెండ్’, ‘క్లాస్ మేట్’ నని ప్రచారం చేసుకుని రాజకీయాల్లో ఎదిగారు. వాస్తవంగా కేటీఆర్ చిన్నమ్మ కొడుకు, వరుసకు సోదరుడు, కేసీఆర్ కు వెన్నంటి ఉండే సంతోష్ రావుకు పూణేలో క్లాస్ మేట్, రూం మేట్ కూడా. బయట ప్రపంచానికి కేటీఆర్ కూడా తనకు క్లాస్ మేట్ అని ఈయన ప్రచారం చేసుకుని, కేటీఆర్ ప్రాపకం, సంతోష్ సహకారంతో రాజకీయాల్లో బాగా రాణించారు. 2014లో, 2018లో పరకాల నుంచి, 2023లో జనగామ నుంచి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అందుకు ప్రతిగా ఆయనకు రెండుసార్లు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. అందులో ఒకసారి ఏకగ్రీవం కూడా అయ్యారు. అందుకు అప్పట్లో ఆయన భారీగానే ఖర్చు చేశారని ప్రచారంలో ఉంది. 2018 ఎన్నికలకు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టారని అంటూంటారు.
అయితే ఆయన బీఅర్ఎస్ రాజకీయాల్లో కీలక నేతగా చక్రం తిప్పుతున్నారని తెలిసింది. మొన్నామధ్య తన పేరునే ఉన్న ఎన్జీఓ పేరుతో కేటీఆర్ చేతుల మీదుగా పరకాలలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. బహుషా వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి దండె లేదా గండి కొట్టి, ఆయన పరకాల నుంచి పోటీ చేస్తారేమో! అనే ప్రచారం జరుగుతోంది.
ఇక భారీ నిర్మాణ రంగ సంస్థ ‘మోగా’తో భాగస్వామ్యం కుదిరే వరకు పరిస్థితి వెళ్ళిందనే విషయాన్ని సాక్షాత్తు కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితే వెల్లడించారంటే, అతడు ఏ మేరకు సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. మోన్నామధ్య రేవ్ పార్టీ జరుగుతుండగా, రెడ్ హ్యాండెడ్ గా అడ్డంగా బుక్కైన హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టు కూడా ఆయనదేనని ప్రచారం జరిగింది. అయితే, దాన్ని మరొకరికి లీజుకిచ్చానని, తన అల్లుడు ఆ వ్యవహారం చూస్తున్నారని, తనకా విషయమేమీ తెలియదని, దానితో సంబంధం లేదని తెలివిగా తన పలుకుబడితో తప్పించుకున్నారని కూడా ప్రచారంలో ఉంది.
శ్రీనివాస్ రెడ్డి తరచూ దుబాయ్ కి వెళ్తారని తెలిసింది. ఆయనకు అక్కడ కూడా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని ఓ ప్రచారం ఉంది. హైదరాబాదులోనూ ఒక భారీ సంస్థతో విల్లాలు నిర్మిస్తున్నట్లుగా బీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. స్వయంగా కవిత శ్రీనివాస్ రెడ్డి శ్రీమంతుడు అని వ్యాఖ్యానించడం మామూలు విషయంమేమీ కాదు. ఈ లెక్కన ఆయన కూడా మామూలోడేమీ కాకపోవచ్చు. అంతేకాదు సంతోష్ రావు స్నేహితుడైన శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ చుట్టూ ఉండి తప్పుదారి పట్టిస్తున్న కోటరీలో ఒకరిగా కవిత ప్రస్థావించడం, విమర్శించడం గుర్తుంచుకోవాలి.
సైలెంట్ గా, సౌమ్యూడిగా కనిపించే శ్రీనివాసరెడ్డి వెనుక ఇంత చరిత్ర ఉందా? అని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు అతి సామాన్యుడుగా కనిపించిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు శ్రీమంతుడుగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న సంతోష్ రావు మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. కవిత ఆరోపణల్లో నిజం నిగ్గు తేల్చాలంటే శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని లేదా కవిత వ్యాఖ్యల ఆధారంగా న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేయాలని లేదా బీఆర్ఎస్ పార్టీ సీనియర్లతో ఓ కమిటీని వేసి నిగ్గు తేల్చాలని పార్టీ కోసం 2001 నుంచి పనిచేసిన గులాబీ తమ్ముళ్లు గుస్సాగా డిమాండ్ చేస్తున్నారు.

