వివాదాల నుంచి మరిన్ని వివాదాల్లోకి…
కోరి కష్టాలు తెచ్చుకుంటున్న KONDA| కొండా దంపతులు
HAND| చే’జేతులా చెడగొట్టుకుంటున్న రాజకీయ జీవితాలు
ఆమొన్న డబ్బులు తీసుకుంటారంటూ MINISTERS| మంత్రులపై వ్యాఖ్యలు
మొన్న MLA| ఎమ్మెల్యేల రాజీనామాలకు హెచ్చరికలు
నిన్న పార్టీ నేతలపై క్రమశిక్షణ కమిటీకే ఫిర్యాదులు
నేడు ఎన్నికల ఖర్చు రూ.70 కోట్లంటూ ప్రేలాపనలు
ఇంటా బయటా అవేం మాటలు? ఇవేం వ్యవహారాలు?
5న కొండా దంపతుల భవితవ్యం తేలనుందా?
మన పురాణాలలోని భస్మాసుర హస్తం అనే కథ ప్రస్తుత రాజకీయాలలో మంత్రి కొండా దంపతులకి అన్వయించాల్సిన అవసరం లేకుండానే అతికిపోతోంది.
ఎవరైనా సమస్య రాకుండా చూసుకుంటారు. సరే, ఒక వేళ సమస్యే వస్తే దాన్ని అదిగమించడమెలా? అని ఆలోచిస్తారు. ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి… ఆ సమస్యల నుంచి మరిన్ని సమస్యల్లోకి ఎవరూ కూరుకుపోరు. అలా కూరుకుపోయే వారు చాలా అరదుగా ఉంటారు. అలాంటి అరుదైన వారి కోవలోకి ఇప్పుడు కొండా దంపతులు చేరిపోయారా? ఒక వివాదంలోకి వచ్చి, ఆ వివాదం నుంచి మరో వివాదం… ఆయా వివాదాల నుంచి మరిన్ని వివాదాల్లోకి కూరుకుపోవడం వారికి అలవాటైనట్లుగా ఉంది. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్న కొండా దంపతులని చూసి వారి అనుచరులే తలలు పట్టుకుంటున్నారు.
హైదరాబాద్, మే 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
అనేకానేక ఒడిదొడుకులు, గెలుపోటముల నుంచి గెలిచాక, అద్భుతంగా చేతికి అందివచ్చిన మంత్రి పదవి. తమను నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు, ఎన్నుకున్న ప్రజలకు, నియోజకవర్గానికి చేయగలిగినంతా అభివ్రుద్ధి చేసే మంచి అవకాశం. నియోజకవర్గమే కాదు, మొత్తం ఉమ్మడి జిల్లా, రాష్ట్రంలోనే ఎదురు లేని అధికారాన్ని చెలాయించే తరుణం. కానీ కొండా దంపతులు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నట్లుగా ఉంది. తమంత తామే వివాదాలకు ఉవ్విళ్ళూరుతున్నట్లుగా ఉంది. గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, సిఎంకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు కోట్లు తెచ్చి అభివ్రుద్ధి చేయాల్సిన వారు వివాదాల్లోకి దూరుకుపోవడం విచిత్రంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట, లేకలేక 10ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం గురించి కాంగ్రెస్ అధిష్టానం, పెద్దలు ఆలోచిస్తుంటే, ఉన్న అధికారాన్ని చేజేతులా వదిలేసుకోవడం కోసం కొండా దంపతులు పరితపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలే హైకోర్టు డెడ్ లైన్ హై టెన్షన్ లో ప్రభుత్వం, స్థానికం కోసం ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉద్యోగావకాశాలు, యువ వికాసం వంటి పథకాల అమలుపై ద్రుష్టి పెట్టి పని చేస్తుంటే, అవన్నీ పక్కన పెట్టి, మంత్రులు కూడా డబ్బులు తీసుకుంటారని అనవసర వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వార్నింగులు. వివరణ ఇవ్వడానికి వెళ్ళి, సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు, రూ.70కోట్లు ఖర్చు చేశామని నిరర్థక, నిర్హేతుక ప్రేలాపనలతో కష్టాల్లోంచి మరిన్ని కష్టాల్లోకి కూరుకుపోతున్న కొండా దంపతులను చూసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జాలి పడుతున్నారు. ఒకవైపు పార్టీ లోపల వ్యతిరేకత వ్యక్తమవుతున్న దశలో, సర్థుకుపోవాల్సిన మంత్రి దంపతులు, పంతానికి పోతూ, అనవసర మాటలతో అన్యాయమైపోతున్నారా? అన్న అభిప్రాయాలు సొంత పార్టీలో, సొంతమనుకున్న అనుచరగణంలో వ్యక్తమవుతున్నాయి.
నోరుపారేసుకున్న మంత్రి సురేఖ
మొన్నా మధ్య ఓ స్కూల్ లో పలు ప్రారంభాల కార్యక్రమంలో మంత్రులు కూడా డబ్బులు తీసుకుంటారని, తాను ఆ విధంగా తీసుకోకుండా, ఆ డబ్బులన్నింటినీ స్కూల్ కోసమే ఖర్చు చేస్తున్నానంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదానికి దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ లో జరుగుతున్న నిజాల్ని నిజాయితీగా సురేఖ బయట పెట్టారని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే తాను బీఆర్ఎస్ సర్కార్ పరిస్థితిని వివరించానని బుకాయిస్తే, అసలా సమయంలో సురేఖ మంత్రి కాదు కదా? అని మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇన్ చార్జీ పదవి ఊడిపోయే
ఇదే సమయంలో మెదక్ ఇన్చార్జీ మంత్రి పదవి ఊడిపోయింది. ఒకవైపు నోరు పారేసుకోవడం, మరోవైపు గులాబీలతో గూడుపుఠానీ పేరుతో మంత్రిగా ఉండాల్సిన నమ్మకాన్ని కూడా సీఎం దగ్గర కోల్పోయినట్లుగా ప్రచారం జరిగింది. ఇన్ చార్జీ పోతే పోయింది. మంత్రి పదవి మిగిలింది.
ఎమ్మెల్యేల రాజీనామాకు కొండా మురళి డిమాండ్
సరిగ్గా ఈ దశలోనే జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా, కొండా మురళి మాట్లాడుతూ, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమేగాక, వారిని తూలనాడారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం ఉంటుందా? ఇష్టానుసారం ఎమ్మెల్యేలను తిట్టడమేంటని? ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు సమావేశమై తిడితే, మంత్రినన్న మాట మరచి, తన భర్త మాటలను సమర్ధిస్తూ, కొండా సురేఖ, శ్రీహరి నల్లకుట్లోడని తీవ్రంగా విరుచుకుపడ్డారు. భర్తకు మించి, భార్య వ్యాఖ్యలుండటం పార్టీ నాయకత్వం సహా అందరినీ విస్మయ పరచింది.
పార్టీ నేతలపై క్రమశిక్షణ కమిటీకే ఫిర్యాదులు
కొండా దంపతుల వ్యవహారంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా పార్టీకి, పరిశీలకురాలికి, క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనికి వివరణ ఇవ్వడానికి వెళ్ళిన కొండా మురళి, 6 పేజీల లేఖతో క్రమశిక్షణ కమిటీకే ఫిర్యాదు చేశారు. సీనులో లేని సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డిని, ఆయన కొడుకు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వియ్యంకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల మీదా ఆరోపణలు చేశారు. పైగా, డీ లిమిటేషన్ సమయంలో వారి నియోజకవర్గాలు ఎగిరిపోవడానికి తానే కారణమని లేని వివాదానికి పోయారు. పార్టీకి పెద్దకాపుగా చెప్పుకున్నారు. సరే, బయటకు వచ్చి, నన్ను రెచ్చగొట్టొద్దు? నన్నెవరూ పిలవలేదు. నేను వచ్చా? అంటూ గొప్పలు పోయారు. పైగా, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన డెడ్ లైన్ అంతా తెలిసిపోయే.
కొండా మురళి అంటే భయమేం కాదు…
ఈలోగా, నాయిని రాజేందర్ రెడ్డి, బస్వరాజు సారయ్యలు కొండా మురళి అంటే భయమేం కాదు… అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన విలువను మరింత దిగజార్చినట్లైంది. కాదు ఆయనే దిగజార్చుకున్నట్లయింది. లేని అవకాశాలను వారికి ఇచ్చి, తిట్టించుకున్నట్లయింది.
ఎన్నికల ఖర్చు రూ.70 కోట్లంటూ ప్రేలాపనలు
సొంత పార్టీలో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చుకునే వరకు పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా ఒల్లు, నోరు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. కానీ, కొండా మురళి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన మాట మరీ విభిన్నం. ‘నాకు 500 ఎకరాలు ఉంది. మొన్న ఎలక్షన్స్ కు అందులో 16 ఎకరాలు అమ్మిన రూ.70 కోట్లు ఖర్చు చేసిన’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. ఇప్పటి దాకా పార్టీ అంతర్గత సమస్యను బహిర్గతం చేసుకుంటూ నస్టపోతూ వస్తున్న కొండా దంపతులు, తాజాగా వ్యాఖ్యలతో ఎన్నికలు, కోర్టు, అఫిడవిట్ వంటి చట్ట వివాదాల్లోకి తమంత తాముగా కూరుకుపోయినట్లుగా అయిపోయింది. ఇప్పుడు పార్టీలోపలి ప్రత్యర్థులే కాదు, బయటి పార్టీల ప్రత్యర్థులకు కూడా తనంత తానే అవకాశం ఇచ్చినట్లయింది.
చే’జేతులా…
తమకు తాము కోరి కష్టాలు తెచ్చుకుంటూ, వివాదాల నుంచి మరిన్ని వివాదాల్లో కూరుకుపోతూ కొండా దంపతులు తమ రాజకీయ జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో జరిగే అంశాలపై కాస్త సంయమనం పాటిస్తే సరిపోయేది. తొందరపాటుగానో, గ్రహపాటుగానో వివరణ ఇస్తే ముగిసిపోయేది. దాన్ని పెద్దదిగా చేసుకోవడమేగాక, ఓపిగ్గా ఉండాల్సిన సమయంలో నోరు పారేసుకుని అటు మంత్రి పదవికే కాదు, ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు తెచ్చుకుంటున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ అద్రుష్టం బాగుండి ఏదో వివరణతో పార్టీ అంతర్గత సమస్య సమసిపోయినా, ఎన్నికల్లో రూ.70 కోట్ల ఖర్చు వ్యవహారం ముగిసిపోవడం ఎలా? కలిసి వస్తే కాలం తేలుస్తుంది. కలిసిరాకపోతే ఆ కాలమే తేల్చేస్తుంది.
…….

