మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అవినీతి కేసును ఛేదించిన సంఘటన సంచలనంగా మారింది. తొర్రూర్ సీఐ కర్రి జగదీష్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విశ్వసనీయ సమాచారం మేరకు, గత సంవత్సరం అక్టోబర్ నెలలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీసులు పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల వెతకడంలో తొర్రూర్ సీఐ జగదీష్ కూడా వున్నారు.
అవినీతి ఒప్పందం
ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ వ్యాపారి పేరు బయటకు రావడంతో అతన్ని విచారణకు పిలిపించారు. అయితే, సీఐ జగదీష్ ఈ విచారణను లంచం కోసం ఉపయోగించుకున్నాడు. వ్యాపారిపై ఒత్తిడి తెచ్చి, తనకు రూ. 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ. 4 లక్షల ఒప్పందం కుదుర్చుకుని, మొదటి విడతగా రూ. 2 లక్షలు తీసుకున్నాడు. మిగిలిన రూ. 2 లక్షల కోసం పలు మార్లు వ్యాపారిని ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
వాట్సప్ కాల్
సీఐ రెగ్యులర్ కాల్ చేస్తే CDR (కాల్ డేటా రికార్డు) ద్వారా తేలిపోతుందని భావించి, వాట్సప్ కాల్ ద్వారా డబ్బుల గురించి చర్చించాడు. అయితే, ఈ కాల్లను సదరు వ్యాపారి మరో మొబైల్ ద్వారా రికార్డు చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సీఐ జగదీష్ అవినీతిని నిరూపించేందుకు ఏసీబీ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించింది. సీఐ, వ్యాపారికి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణను ఏసీబీ ప్రత్యేక డివైజ్ సహాయంతో రికార్డు చేసింది. సీఐ వాట్సప్లోనే మాట్లాడుతున్నానన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, ఏసీబీకి తగిన ఆధారాలు దొరికాయి.
ఏసీబీ దాడులు
ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు, సోమవారం తొర్రూర్ సీఐ కార్యాలయంపై దాడులు నిర్వహించి జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ, తనను అవినీతి ఆరోపణలతో ఎలా అరెస్ట్ చేస్తారని ఎదురు ప్రశ్నించినా, ఏసీబీ అధికారులు తనకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలను చూపించారు. చివరికి సీఐ జగదీష్ తాను లంచం తీసుకున్న విషయాన్ని అంగీకరించాడు.
టెక్నాలజీపై ఆధారపడిన ఏసీబీ
అవినీతిని నివారించేందుకు మాత్రమే కాకుండా, దోషులను పట్టుకోవడంలో కూడా ఏసీబీ ఆధునిక టెక్నాలజీపై నమ్మకం ఉంచుతోంది. రెగ్యులర్ కాల్ల ద్వారా లంచం అడిగితే తాము దొరికిపోతామన్న అవినీతి అధికారులు, వాట్సప్ కాల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నారు. అయితే, ఏసీబీ ఆధునిక పద్ధతులను ఉపయోగించి, టెక్నాలజీ ట్రాప్ ద్వారా దోషులను పట్టుకోవడంలో విజయవంతమవుతోంది.
ఏసిబి అధికారుల స్పందన
ఈ ఘటన అధికార యంత్రాంగంలో అవినీతిని బయటపెట్టడంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఏసీబీ అధికారులు చెప్పిన ప్రకారం, అవినీతి కేసులలో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఎలాంటి ప్రలోభాలకు పాల్పడినా, న్యాయానికి ఎసరు పెట్టినా వారిని కఠిన చర్యలు తీసుకుని శిక్షిస్తామన్నారు.
సీఐ అరెస్ట్
సీఐ జగదీష్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసు ద్వారా అవినీతికి పాల్పడుతున్న అధికారులకు గుణపాఠం చెప్పినట్టు మారింది. టెక్నాలజీ ద్వారా అవినీతి మీద పట్టు సాధించిన ఏసీబీ చర్యలు ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించింది .

