CM REVANTH REDDY|సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
మృతి పట్ల ADUGU|DIGITAL MEDIA|అడుగు డిజిటల్ మీడియా దిగ్బ్రాంతి
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, జననిని జయ జయహే తెలంగాణ రచయిత, ప్రముఖ కవి, సాహితీ వేత్త అందెశ్రీ ఈరోజు ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సాహితీ వర్గాలు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిన అందెశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు కలిగింది. ఆయన రచనల ద్వారా కోట్లాది తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవం నింపారు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయం రాష్ట్ర సాధనకు ప్రతీకగా నిలిచిందని, ఆ పాట ప్రతి తెలంగాణ వాసి హృదయంలో స్ఫూర్తిగా మారిందని సీఎం గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గేయాన్ని కొత్త స్వరూపంలో రూపకల్పన చేసినప్పుడు అందెశ్రీతో కలిసి ఆలోచనలు పంచుకున్న సందర్భాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆయనతో తనకున్న స్నేహం, సాహిత్య దృష్టి, తెలంగాణపైనున్న మమకారం ప్రత్యేకమని అన్నారు. “
తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. ఆయన మరణం తెలంగాణ ఆత్మను తాకే లోటు అని సీఎం అన్నారు.
అందెశ్రీ కేవలం కవి, రచయిత మాత్రమే కాకుండా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో భావోద్వేగాల పునాదిగా నిలిచిన సాహిత్య జ్యోతి. ఆయన రచనలు తెలంగాణ మట్టివాసనతో, ప్రజల మనసుల్ని తాకే భాషతో ప్రసిద్ధి పొందాయి. ప్రజా కవిగా ఆయన కలం ఎప్పుడూ అణగారిన వర్గాల గొంతుకగా మారింది. కవిత్వం, గేయరచన, నాటకరచనల్లో తనదైన శైలిని ప్రదర్శించి, తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు.
సాహిత్య రంగంలో తన కృషికి అనేక పురస్కారాలు అందుకున్న అందెశ్రీ, తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సభల్లో పాల్గొని, జయ జయహే తెలంగాణ గేయం ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించారు. ఆ గేయం ఉద్యమానికి చిహ్నంగా మారి, ప్రతి ర్యాలీలో, ప్రతి మనసులో తెలంగాణ గర్వాన్ని నింపింది.
సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. తెలంగాణకు అందెశ్రీ చేసిన సాహిత్య సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందే శ్రీ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు.
సోమనాథ కళా పీఠం సంస్థ సోమనాథ సాహిత్య పురస్కారం అందించిందని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని ఆ సంస్థ అధ్యక్షులు డా.రాపోలు సత్యనారాయణ అన్నారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ జయ జయహే గేయం స్ఫూర్తిదాయకంగా నిలిచినందెశ్రీ లేని లోటు భర్తీ కాని ఖాళీగా మారిందని అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సాహిత్యం, భావజాలం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, వారి మృతి తనకి వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు.
అందెశ్రీ మృతితో తెలంగాణ సాహితీ ప్రపంచం మౌనంగా మారిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజ, రాపోలు సోంసాయి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

