నిజమైతే నేనే పోతా?
మరి మీరు రెడీయా?
కేటీఆర్, హరీశ్ రావులకు నవీన్ యాదవ్ సవాల్
రసవత్తరంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు
డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు
గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పావులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పేలుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. నవీన్ రౌడీ అని, ఆయనపై అనేక కేసులున్నాయని విమర్శించారు. దీనికి ప్రతిగా నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులకి గట్టి సవాల్ విసిరారు. తన మీద పెట్టిన కేసులు నిజమైతే తాను రాజకీయాలని వదిలి పెడతా, హైదరాబాద్ విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. కానీ ఆ కేసులు తప్పని తేలితే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వం తనపై, తన కుటుంబ సభ్యులపై, అనుచరులపై ఒకే ఏడాదిలో 20 నుంచి 30 తప్పుడు కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. తన మీద రౌడీ అని ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని విమర్శించారు. తనకు న్యాయ వ్యవస్థ నమ్మకం కలిగించిందని.. తనను కాపాడిందని ఉద్ఘాటించారు. అలాగే, కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసు నమోదైందని తెలిపారు. పోలీసులు ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్పైన విశ్వాసం ఉంచారని నవీన్ యాదవ్ నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. డివిజన్ వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు.
రహమత్నగర్ డివిజన్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్ బాధ్యతలు సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళ్ రావునగర్ డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తారు. సోమాజిగూడ డివిజన్ పర్యవేక్షణ బాధ్యతలు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ వహించనున్నారు. షేక్పేట డివిజన్ బాధ్యతలు కొండా సురేఖ, వివేక్ తీసుకుంటారు. ఎర్రగడ్డ డివిజన్ను దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు చూసుకుంటారు. అలాగే యూసుఫ్గూడ డివిజన్ పర్యవేక్షణ ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నంలకు అప్పగించారు.
ఉప ఎన్నికలో సమన్వయం, ప్రచార వ్యూహం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రతి మంత్రి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

