రెండు రాష్ట్రాల్లో డిసెంబర్ 12–27 సేవా-సాంస్కృతిక ఉత్సవాలు|TELANGANA|ANDHRA PRADESH
ATA మహాసభల ఏర్పాట్లు వేగవంతం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు–యువజన సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ మహాసభలకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండా హైదరాబాద్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రవాస వ్యాపారవేత్తలు, ఐటీ నిపుణులు, స్టార్టప్ ఇన్నోవేటర్లు, యువత అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఈ మహాసభలు అమెరికా–తెలంగాణ మధ్య సాంకేతిక, వ్యాపార అనుబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తాయని వారు మంత్రికి వివరించారు.
ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యూత్ కాన్ఫరెన్స్లు, బిజినెస్ సమ్మిట్లు, NRI సదస్సులు వంటి వైవిధ్యభరితమైన సెషన్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రవాస తెలుగు ప్రతిభ, నూతన ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసే అపూర్వ వేదికగా ఈ మహాసభలు నిలుస్తాయని వారు తెలిపారు. అదేవిధంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ATA చేపడుతున్న సేవా కార్యక్రమాల భాగంగా డిసెంబర్ 19న హైదరాబాద్ టీ–హబ్లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్కు కూడా మంత్రి శ్రీధర్బాబు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశం ద్వారా స్టార్టప్లకు అంతర్జాతీయ అవకాశాలు, పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయని వివరించారు.

ఇక ATA ప్రతి ఏడాది భారత్లో నిర్వహించే సాంస్కృతిక–సాహిత్య ఉత్సవాలు ఈసారి డిసెంబర్ 12 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆటా ప్రతినిధులు జూబ్లీహిల్స్ తాజ్ మహల్ హోటల్లో సీనియర్ జర్నలిస్టులతో సమావేశమై వేడుకల వివరాలను వెల్లడించారు. ఈ పదిహేనురోజుల కార్యక్రమాల్లో సంగీతం, నృత్యం, సాహిత్యం, సేవ, చరిత్ర, సంప్రదాయాలు, ప్రవాస తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ప్రదర్శనలు చోటుచేసుకోనున్నాయి. అమెరికా నుంచి పలువురు కళాకారులు, రచయితలు, రంగస్థల కళాకారులు, తెలుగు వలసకారుల సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొననుండటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు, కళాకారులు, యువత, మరియు తెలుగు సంఘాలు విస్తృతంగా పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకలు అమెరికా–తెలుగు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తాయని వారు చెప్పారు. ఈ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం అందించి, ప్రజల్లోకి పెద్దఎత్తున చేరేలా చేయాలని మీడియాకు ఆటా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలువురు ప్రధాన మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

