జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి భారీగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా కష్టపడే, స్థానికులకు అందుబాటులో ఉండే వారినే పార్టీ ఎంపిక చేస్తుందని అన్నారు. టికెట్ ఎవరికీ ఇవ్వాలనే నిర్ణయం పూర్తిగా పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా, అన్ని డివిజన్లలో పార్టీ నాయకులు తిరుగుతారని, వారు పార్టీ పటిష్టతకు కృషి చేస్తారని, బూత్ కమిటీలతో కలిసి పని చేస్తారని చెప్పారు. పార్టీ అభ్యర్థిని ఎవర్ని నిలబెట్టాలి అనే విషయంపై సర్వే చేస్తుందని, సర్వేలో పాజిటివ్ ఉన్న వ్యక్తికే పార్టీ టికెట్ ఇస్తుందని, ఆశించి భంగపడిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని వివరించారు. వేరే బయటి నాయకులకు ఎవరికీ టికెట్ ఇవ్వమని, మేమంతా ఐక్యంగా పనిచేసి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్లో కూడా మేమే గెలుస్తాం. స్థానిక ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకునే అభ్యర్థికే అవకాశమిస్తామని తెలిపారు. ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు, ముగ్గురు మంత్రులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రమే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం సమన్వయంతో పనిచేస్తుండటంతో ఈసారి కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

