సొనాటా సాఫ్ట్వేర్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పర్యావరణ అనుకూల సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్న సొనాటా సాఫ్ట్వేర్ సంస్థపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంతో పాటు లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC)కు హబ్గా మారిందని సీఎం తెలిపారు. అలాగే, AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాల కేంద్రంగా రాష్ట్రం ఎదుగుతోందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమంతో పాటు పరిశ్రమలకు సహకరిస్తూ ఆర్థిక వ్యూహాలను సమతుల్యంగా అమలు చేస్తోందని సీఎం చెప్పారు. డిసెంబర్ 2023 తర్వాత రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రాగా, వాటి ద్వారా లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు రూపొందినట్లు వివరించారు. 2025లో దావోస్లో జరిగిన వేదికపై తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం తెలిపారు.
పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నియంత్రణ, పన్నుల వసూళ్లు, ఉద్యోగ సృష్టి వంటి కీలక అంశాల్లో తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 66 లక్షల మహిళలను స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారతవైపు నడిపిస్తోందని, యువతకు “రాజీవ్ యువ వికాసం” ద్వారా వ్యాపారాలు, ఉపాధి కోసం అవసరమైన మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ట్రాఫిక్ ఫోర్స్లో ట్రాన్స్జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన తొలి రాష్ట్రంగా గర్వించదగ్గ స్థానం సంపాదించిందని చెప్పారు. డ్రై పోర్ట్ నిర్మాణం, ఏపీ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీ లో AI నగరం నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్శిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఈవెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇంకా అనేక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేయబోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమపాళ్లలో అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని, హైదరాబాద్ను ప్రపంచానికి బ్రాండ్గా నిలబెట్టాలని సీఎం పిలుపునిచ్చారు.

