అమరవాదిపై ఎదురుదాడి!
ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రచారంలో ఎదురుగాలి!!
మేం కొట్టుక సావాలె…! మీరు వేడుక సూడాలె!!
10 ఏండ్లల్లో మీ వల్ల ఏం ఒరిగింది?
మీ వల్ల ఏ ఒక్క సభ్యుడికైనా సాయం అందిందా?
తన ప్రచార సమావేశాల్లోనే సభ్యుల నుంచి సూటిగా ప్రశ్నలు
సూర్యాపేటలో సుతిమెత్తగా నిలదీసిన సభ్యులు
అనేక పరిణామాల మధ్య మొదలైన ఎన్నికల ప్రక్రియ
పోటీ పడుతున్న అమరవాది, మిడిదొడ్డి శ్యాంసుందర్
హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం
మార్చి 4న ఎన్నికల పోలింగ్
సమకాలీన సామాజిక, ఆర్థిక సమీకరణల్లో ఆర్యవైశ్యులు అత్యంత కీలకం. కేవలం వ్యాపార రంగంలోనే గాక, ఇతర సేవా, రాజకీయ రంగాల్లోనూ ఇప్పుడా సామాజిక వర్గం ప్రభావవంతంగా పని చేస్తున్నది. ప్రస్తుతం ఆర్యవైశ్యులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెలలోనే పోలింగ్ ఉంది. ఈ ఎన్నికల వేళ… ఇప్పటికే 10 ఏళ్ళుగా మహాసభ అధ్యక్షుడిగా ఉన్న అమరవాది లక్ష్మీనారాయణ తిరిగి పోటీలో ఉండగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మహాసభ విద్యా కమిటీ చైర్మన్, శ్రీశైలంలో నిర్మించిన మల్లికార్జున సత్రం అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాం సుందర్ పోటీ పడుతున్నారు. ఈ ఎన్నిక అటు ఆర్యవైశ్యుల, ఇటు మహాసభ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రస్తుత మహాసభ కన్వీనర్ అమరవాది లక్ష్మీనారాయణ గత 10 ఏళ్ళుగా మహాసభ అధ్యక్ష పదవిలో ఉంటూ, ఇప్పుడు పోటీలో నిలిచారు. ఈ ఎన్నిక కోసం గత మూడేళ్ళుగా జరిగిన అంతర్గత పోరాటంలో కీలకంగా ఉండి, ఆయన అనుచరుడిగా, ఆయన కార్యవర్గంలో మహాసభ విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాం సుందర్ ఆయనతో పోటీ పడుతున్నారు. నిజానికి ప్రతి రెండేళ్ళకు ఒకసారి జరగాల్సిన మహాసభ ఎన్నికలు గత 10ఏళ్ళుగా జరిగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికైన అమరవాది, నాటకీయ పరిణామాల మధ్య టీజీ వెంకటేశ్ జోక్యంతో 2015లో కన్వీనర్ గా నియమింపబడ్డారు. అప్పటి నుంచి అప్రకటిత అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నారు. అయితే, మూడేళ్ళ క్రితం నుంచి ఆయనకు మహాసభలోనేగాక, ఆయన కార్యవర్గంలోనూ ఎదురుగాలి మొదలైంది. అందుకు ఆయన మహాసభ బై లా ను సవరించి, ససేమిరా అనడంతో, ఎన్నికలు నిర్వహించాలని ఆయనకు వ్యతిరేకంగా కొందరు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో తనకు చుక్కెదురు తప్పదని, ప్రత్యేక కమిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయని తెలుసుకున్న అమరవాది, చివరకు చేసేది లేక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయన ప్రత్యర్థుల ఆరోపణల ప్రకారం బైలాలో తనకు అనుకూలంగా అనేక మార్పులు చేర్పులు చేసుకున్న ఆయన, గత 2015 నుండి తాను కన్వీనర్ గానే ఉన్నందున తిరిగి పోటీలో నిలుస్తున్నట్లు ప్రకటించి నామినేషన్ వేశారు. ఆయనకు ప్రత్యర్థిగా మిడిదొడ్డి శ్యాం సుందర్ నిలబడటం, మరే ఇతర అభ్యర్థులు లేకపోవడం, అమరవాది మీద వ్యతిరేకత ఉండటంతో గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి.
మహాసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోలింగ్ మార్చి 4న జరగనున్నది. మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 60వేల సభ్యత్వాలు ఉన్నాయి. ప్రతి 200 మంది సభ్యులకు ఒక రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని నియమించారు. ఆ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులే మహాసభ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులకు శాశ్వత కౌన్సిల్ సభ్యులుగా ఓట్లు వేస్తారు. ఈ విధంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో సుమారుగా 1150 ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లను పొందడానికి, కౌన్సిల్ సభ్యులతోపాటు సాధారణ సభ్యులను కూడా కలుస్తూ ఇద్దరు అభ్యర్థులు గత నెల రోజులుగా పోటీపోటీగా, హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహాసభ ఎన్నికలు మహా రసవత్తరంగా మారుతున్నాయి.
మిడిదొడ్డి శ్యాం సుందర్ ఈ ఎన్నికలకు ముందు నుండే ఎన్నికలు నిర్వహించాలని పోరాడుతూనే, మహాసభ సభ్యులను కలుస్తూ, ఎన్నికల నిర్వహణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు కారకుడైన శ్యాం సుందర్ మహాసభ సభ్యుల, కౌన్సిల్ సభ్యుల అభిమానం చూరగొంటూ వస్తున్నారు. 10 ఏళ్ళుగా మహాసభ కార్యకలాపాలు పెద్దగాలేకపోవడం, సభ్యుల సంక్షేమానికి జరిగిందేమీలేకపోవడంతోపాటు, యువతరం, కొత్తతరం నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నది. మరోవైపు మహాసభ కన్వీనర్ హోదాలో అధ్యక్ష తరహా పదవిని అనుభవించి, తిరిగి పోటీలో నిలిచి, గతానికి భిన్నంగా సభ్యులను కలుస్తూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే అమరవాది మాత్రం సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గురువారం సూర్యాపేటలో జరిగిన పలు సమావేశాల్లో ఆయనకు సీనియర్, యూత్ సభ్యుల నుంచి సూటిగా ప్రశ్నలు ఎదురయ్యాయి. సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మాట్లాడుతూ ‘‘ఇక చాలు… మీరు తప్పుకోండి మరేదైనా చూసుకోండి. ఎమ్మెల్సీ, ఎంపీ లాంటి పదవులకు పోటీ చేయండి. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి.’’ అంటూ నేరుగా ఆయన ముందే ఎదురుదాడి చేశారు. మరో సభ్యుడు మాట్లాడుతూ, ‘‘నాకు 65 ఏళ్ళు… 30 ఏళ్ళుగా మహాసభ కార్యక్రమాలు చూస్తున్నాను. మేం కొట్టుక సావాలె… మీరు వేడుక సూడాలె. ఏనాడైనా మహాసభ జిల్లాల స్థాయిలోనైనా జోక్యం చేసుకుందా?’’ అంటూ ప్రశ్నించారు. ఇంకో సభ్యుడు మాట్లాడుతూ, ‘‘గత 10 ఏండ్లల్లో మీ వల్ల ఏం ఒరిగింది? మీ వల్ల ఏ ఒక్క సభ్యుడికైనా సాయం అందిందా?’’ అంటూ ప్రశ్నించాడు. తన ప్రచార సమావేశాల్లోనే సభ్యుల నుంచి సూటిగా ప్రశ్నలు వస్తుండటంతో అమరవాదిని సమర్ధించేవాళ్లు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
బైలాలో మార్పులు, సుదీర్ఘ కాలంగా కొనసాగడం, ప్రభుత్వం మహాసభకు ఇచ్చిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడం, పెద్దగా కార్యకలాపాలేవీ లేకపోవడం, సంక్షేమ కార్యక్రమాలు జరగకపోవడం వంటివన్నీ అమరవాది పట్ల సభ్యుల వ్యతిరేకతకు కారణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు శ్యాం ప్రచారం ముందుగానే ఒక ప్రణాళిక బద్ధంగా ఎన్నికలకు సిద్ధమవడం, మహాసభ సభ్యుల అభిమానాన్ని చూరగొనే అంశాలతో మేనిఫెస్టోని సిద్ధం చేసుకోవడంతో ఇందుకు భిన్నంగా సభ్యుల మద్దతుతో జరుగుతుండటం వల్ల ఇద్దరి మధ్యా పోటీ రసవత్తరంగా మారింది. కౌన్సిల్ సభ్యులు ఎవరిని సమర్ధిస్తారు? ఎవరికి ఓటు వేస్తారనేది? ఎవరిని విజయం వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

