యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత మాత్రం అగ్రరాజ్యంపైనే ఉంది. ప్రపంచానికి కావాల్సింది మరో యుద్ధం కాదు. దౌత్యం ద్వారా పరిష్కారం. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి అమెరికా లక్ష్యాలను సాధిస్తుందా? లేక మరో దీర్ఘకాలిక ఘర్షణకు బీజం వేస్తుందా? అన్నది కాలమే తేల్చాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
అమెరికా–ఇరాన్ ఘర్షణ మరో కీలక మలుపు తిరిగింది. ఆయుధాలతో ఇరాన్ను పూర్తిగా లొంగదీయడం అంత సులభం కాదని అమెరికా గ్రహించిందా? అన్న అనుమానాలు బలపడుతున్న వేళ, ఇప్పుడు వాషింగ్టన్ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇరాన్పై కొత్త ఆంక్షలు విధించడంతోపాటు, టెహ్రాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తప్పవని అమెరికా హెచ్చరిస్తోంది. అంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు. ప్రపంచ వాణిజ్యం, చమురు మార్కెట్, డాలర్ ఆధిపత్యం, అంతర్జాతీయ దౌత్యంపై ప్రభావం చూపే విస్తృత ఆర్థిక యుద్ధంగా మారుతోంది.
‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరుతో ప్రకటించిన తాజా చర్యల్లో ఇరాన్ సైనిక కార్యకలాపాలు, చమురు, పెట్రోకెమికల్ వాణిజ్యం, నౌకాయానం, విమానయానం, సాంకేతిక రంగాలు, బంగారం, డిజిటల్ ఆస్తులతో సంబంధం ఉన్న 60కి పైగా వ్యక్తులు, సంస్థలు, నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఉన్న సంబంధాలను తెంచేయడమే లక్ష్యమని అమెరికా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇరాన్తో లావాదేవీలు కొనసాగించే విదేశీ సంస్థలు ద్వితీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చన్న హెచ్చరిక ఈ నిర్ణయంలోని తీవ్రతను తెలియజేస్తోంది.
ఇది అమెరికాకు కొత్తేమీ కాదు. 1979 ఇరాన్ విప్లవం తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. ఇరాన్ చమురు ఎగుమతులు, బ్యాంకింగ్ వ్యవస్థ, విదేశీ మారకద్రవ్య ఆదాయంపై ఆంక్షలు విధించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురిచేయాలని వాషింగ్టన్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ ఇరాన్ పూర్తిగా మోకరిల్లలేదు. ఇదే ఇప్పుడు అమెరికాకు ప్రధాన సవాల్ గా మారింది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు అత్యంత కీలకం. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఇరాన్ వాటా 4% ఉన్నప్పటికీ, పర్షియన్ గల్ఫ్లో దాని భౌగోళిక స్థానం కారణంగా దాని ప్రాధాన్యం చాలా ఎక్కువ. ప్రపంచ చమురు వినియోగంలో ఐదో వంతు హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. ఇలాంటి కీలక మార్గంపై ఉద్రిక్తత పెరిగితే, ఇరాన్ను మాత్రమే కాదు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ సహా అనేక దేశాలను ఇంధన సంక్షోభం చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది.
ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం పెద్ద సవాల్ గా ఉంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగితే రవాణా ఖర్చులు, విద్యుత్ ఉత్పత్తి, ఎరువులు, ప్లాస్టిక్, రసాయనాలు, ఆహార ధరలు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది మరింత భారమవుతుంది. భారతదేశం తన ముడిచమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్న నేపథ్యంలో, పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే దిగుమతి బిల్లు పెరగడం, రూపాయిపై ఒత్తిడి రావడం, ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకడం వంటి పరిణామాలు సంభవించవచ్చు.
అమెరికా వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం డాలర్ ఆధిపత్యం. అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్కు ఇప్పటికీ 58 శాతం వాటా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఆధిపత్యాన్ని ఉపయోగించి అమెరికా ఆంక్షలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమలు చేయగలుగుతోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలను, సంస్థలను డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేస్తామని బెదిరించడం అందులో భాగమే. అయితే ఇదే విధానం దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలు, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, డీ-డాలరైజేషన్కు ఊతమివ్వవచ్చన్న వాదన కూడా ఉంది.
ఇరాన్ మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక ఉందని, ఆర్థిక ఒత్తిడికి ప్రతిఘటించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసుకున్నామని టెహ్రాన్ చెబుతోంది. చైనా, రష్యా వంటి దేశాలు అమెరికా ఆంక్షలను పూర్తిగా అంగీకరించవని ఇరాన్ నమ్ముతోంది. గతంలోనూ ఇరాన్పై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆసియా దేశాలతో వాణిజ్యం, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు, మధ్యవర్తి దేశాల ద్వారా చమురు విక్రయాలు కొనసాగాయి. అందువల్ల ఆర్థిక నిషేధాలతో ఒక దేశాన్ని పూర్తిగా ఒంటరిచేయడం ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతోంది.
అమెరికా చర్యలను ఇజ్రాయెల్ స్వాగతించడం సహజమే. ఇరాన్ ఆర్థిక శక్తిని బలహీనపరచడం ద్వారా దాని సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ కార్యక్రమాలను తగ్గించాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం. అయితే ఆర్థిక యుద్ధం తీవ్రతరం కావడం వల్ల పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశాలు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆంక్షలు ప్రజలపై పడే భారాన్ని పెంచితే, ప్రభుత్వ వ్యతిరేకతకు బదులుగా జాతీయవాద భావోద్వేగాలు బలపడే అవకాశం కూడా ఉంటుంది.
ఇరాన్ నుంచి వస్తున్న హార్ముజ్ జలసంధి హెచ్చరికలు మరింత ఆందోళనకరం. ఆ మార్గంలో చమురు రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుంటే, ఇరాన్ మాత్రం ప్రపంచ ఇంధన సరఫరాపై తన భౌగోళిక ప్రభావాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడే ఆర్థిక యుద్ధం ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదం దాగి ఉంది.
అమెరికా తన శక్తిని ఉపయోగించి ప్రపంచ దేశాలను ‘మా వైపు లేదా మా వ్యతిరేకం’ అనే ద్వంద్వ నీతిలోకి నెట్టడం సమర్థనీయమా? ఆలోచించాలి. ఆంక్షలు ఒక దేశ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, సాధారణ ప్రజల జీవనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇరాన్ ప్రజలకు ఆహారం, ఔషధాలు, ఉపాధి, జీవన వ్యయాలపై అదనపు భారం పడితే, అది మానవ సమస్యగా మారుతుంది.
కాబట్టి ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి అమెరికా లక్ష్యాలను సాధిస్తుందా? లేక మరో దీర్ఘకాలిక ఘర్షణకు బీజం వేస్తుందా? అన్నది కాలమే తేల్చాలి. యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత మాత్రం అగ్రరాజ్యంపైనే ఉంది. ప్రపంచానికి కావాల్సింది మరో యుద్ధం కాదు. దౌత్యం ద్వారా పరిష్కారం.

